ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Monday 7 October 2013

పద్మాసనం


ద్మాసనంలో కూర్చోగానే కళ్లు అరమోడ్పులవుతాయి. చేతులు చిన్ముద్రలోకి వెళ్లిపోతాయి. ముఖం ప్రశాంతమై పద్మంలా వికసిస్తుంది. భారతీయుల అపూర్వమైన ఆసనం... పద్మాసనంలోని ప్రభావం అది. పద్మాసనం వేయగానే మిగిలిన శరీరం సహజంగానే ధ్యానసన్నద్ధమైపోతుంది. మనసు ధ్యానస్థితిలోకి వెళ్లిపోతుంది. ధ్యానస్థితికి అవసరమైన మేరుదండపు నిటారు భంగిమ యథాలాపంగా కుదిరిపోతుంది. మానవుడనే ఈ బాల బ్రహ్మకు బ్రహ్మాండాన్ని ఔపోసన పట్టే, బ్రహ్మనే గుండె పిడికిట పట్టే ప్రక్రియకు చాలిన సన్నద్ధ క్రియ, భంగిమ, స్థితి... ఇది. ప్రపంచాన్ని జయించిన ఏ చక్రవర్తి అయినా ఈ భంగిమలోని ధ్యానిని మించి జయించలేడు. ముల్లోకాలను ఆక్రమించుకునేందుకు వామన రూపంలోని ఆ విష్ణువుకైనా మూడడుగులు కావలసి వచ్చింది. కానీ ఈ మానవుడికి, ఈ ధ్యానికి తాను కూర్చున్న రెండు చదరపు అడుగుల స్థలం సరిపోతుంది. అవని ఆసనంగా, ఆకాశం ఆచ్ఛాదనగా 'తపోభూమిక'లోకి వెళ్లిపోయే సాధకుడు ఈ లోకంలో, ఏ లోకంలో అయినా సాధించలేనిది ఏముంది?
అద్భుతాలెప్పుడూ బృహత్తర ప్రయత్నాల ద్వారానే జరగవు. వాటి మూలం సూక్ష్మంలోనే ఉంటుంది. ఆ కిటుకు తెలియాలి. దాన్ని అనుసరించాలి. ఆచరించాలి. ఔపోసన పట్టాలి. అదే ధ్యానం. తపస్సు. ఓ గొప్ప శాస్త్రజ్ఞుడు కుదురుగా కూర్చుని ఒక్క పది నిమిషాలు ధ్యానం చేయలేకపోవచ్చు. ఒక ధ్యాని అవసరమైతే ఆ శాస్త్రజ్ఞుడి కంటే గొప్ప అంశాన్ని ఆవిష్కరించగలడు. ఆయన ప్రయోగశాల ప్రాంగణం రెండు చదరపు అడుగుల స్థలం. అంతరంగమే ఆయన ప్రయోగశాల. యోగం ఆయన ప్రయోగం. ఒక ధ్యాని, యోగి, రుషి ఎవరైనా... వారి యోగాలు, ప్రయోగాలు పైకి వ్యష్టి ప్రయోజనంగా కనిపించినా నిజానికి అవి సమష్టి ప్రయోజనాలు. సమష్టి హక్కుభుక్తాలు. లోక కల్యాణ కారకాలు.

ఇదంతా భారతీయ సంస్కృతీ వైభవం. రెండు చదరపు అడుగుల సింహాసనం మీదినుంచి విశ్వాన్ని శాసించే భారతీయ యోగికి సాటిరాగల ధీరుడు ప్రపంచ చరిత్రలోనే లేడు. ఉండడు.

పద్మాసనం... ఈ ఆసనంలో సాధకుడు పద్మంలా కనిపిస్తాడు. సాధకుడు మానసికంగా ఏ మాలిన్యాన్నీ అంటకుండా బురద మడుగులోని పద్మంలా స్వచ్ఛంగా, స్నిగ్ధంగా, సౌరభ పూర్ణంగా విరాజమానమవుతాడు. పద్మాసనంలో కూర్చున్న సాధకుడి ఆంతర్యం కూడా ఆసన ప్రభావంతో ఒక ఉదాత్త వైఖరిలోకి వెళ్లిపోతుంది. ఆసనం మీద, ఆ విక్రమార్క సింహాసనం మీద కూర్చున్న ఆ రుషి చక్రవర్తి, ఆ యోగిరాజు మనిషిగా మరణించి మహాత్ముడిగా ఆత్మనేత్రం తెరుస్తున్నాడు.

ప్రపంచ సాధకలోకానికి భారతదేశం ప్రసాదించిన వరం మన పద్మాసనం. కనురెప్పలు అరమోడ్చినా, మోడ్చమని చెప్పినా దానికో ఉత్కృష్ట ప్రయోజనాన్ని గ్రహించాకే లేదా ఆవిష్కరించాకే అలా చెప్పగల సూక్ష్మదర్శులు మన రుషులు. పద్మాసనంలోని ప్రయోజన వైచిత్రిని దర్శించాకే ధ్యానానికి, తపస్సుకు దాన్ని నిర్దేశించింది శాస్త్రమైనా, రుషిగణమైనా. యోగానికి కాలపరిమితి లేదు. సమయ నిర్దేశం లేదు. యోగి జడల్లో పక్షి సమూహాలు గూళ్లూ నిర్మించుకోవచ్చు. శరీరం చుట్టూ పుట్టలూ వెలయవచ్చు. సాధకుడు మొండివాడైతే ఎముకలు అరగనీ అంటాడు. కండలు కరగనీ అంటాడు. జుట్టు జడలు కట్టనీ అంటాడు. తపోదీక్ష అంత కఠినమైనది. బుద్ధుడైతే జ్ఞానోదయం అయ్యేవరకు లేచే ప్రసక్తే లేదని బోధివృక్షం కింద కూర్చున్నాడు. స్వామి వివేకానందుడు సముద్ర మధ్యంలో ఓ శిలాలంక మీద శైల సదృశంగా కూర్చుండిపోయాడు. ఆత్మ సాక్షాత్కారం మాత్రమే ఆయనను ఆసనం మీంచి లేపగలిగింది.

అందుకే... పద్మాసనం. అది దీర్ఘకాలం కదలకుండా కూర్చునే ఓపికనిచ్చే ఆసనం. మూలాధారం నుంచి సహస్రార చక్రం వరకు సూక్ష్మమైన వంకరకూడా లేకుండా నిటారుగా నిలపగలిగే ఆసనం. చిన్ముద్రకు చేతుల్ని సౌకర్యంగా మలచుకోనిచ్చే ఆసనం. మేనునే కాదు మనసునూ ధ్యానానుకూలంగా ఆయత్తం చేసే ఆసనం- పద్మాసనం.
- చక్కిలం విజయలక్ష్మి

No comments:

Post a Comment