ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Friday 16 May 2014

కర్మయోగం


ళ్లు వంచి కష్టపడాలనే భగవంతుడి ఉద్దేశాన్ని తేనెటీగలు, చీమలు, కొన్ని రకాల పురుగులు, అడవిలో జంతువులు చక్కగా నెరవేరుస్తున్నట్లు కనపడుతుంది. కొందరు మనుషులు మాత్రం- తాము కూర్చోవాలి, ఇతరులు కష్టపడాలి, వాళ్ల కష్టాన్ని హాయిగా దోచుకోవాలనే దుర్మార్గపు ఆలోచనతో బతుకుతుంటారు. ఇది భగవంతుడు నిర్దేశించిన కర్మ మార్గానికి విరుద్ధం. ఇతరుల కూడు కొల్లగొట్టే ఇలాంటివారు లోకానికి ప్రమాదం. వీళ్లకు భవిష్యత్తు ఉండదు.
జీవితమంతా పని చెయ్యాలి. శ్రమైక జీవనసౌందర్యం అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఎవరి పని వారు చెయ్యాలి. మనల్ని ఒక ప్రదేశంలో ఉంచి, మనతో ఒక ప్రయోజనం నెరవేరేటట్లు మన జన్మను తీర్చిదిద్దిన ఆ భగవంతుడికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? చక్కగా కష్టపడి పనిచేసి బతుకుతూ, హాయిగా ఆయన గొప్పతనాన్ని కీర్తిస్తూ జీవించడం తప్ప!

కర్మయోగంలోనే కాదు, భక్తియోగంలోనూ పంచేంద్రియాలకు, మనసుకు పని ఉంది. జ్ఞానయోగంలో మనసుకు, వివేకానికి బోలెడంత పని ఉంది. కదలకుండా ఒక దగ్గర కూర్చున్నట్లు కనిపించినా- యోగులు చేసే పని అనితర సాధ్యం! కదులుతున్నట్లు కనిపించినా బుద్ధి తక్కువ పనులు చేసేవాళ్లు ఏం పని చేస్తున్నట్లు? చేసే పనిలో నాణ్యత ఉండాలి. ఒక లక్ష్యం ఉండాలి. ఉన్నతంగా ఉండాలి. తక్కువ కాలంలో ఎక్కువ పనిచేసి కొత్త విషయాలను అందించి లోకోపకారం చెయ్యగలగాలి.

దైవాన్ని అర్థం చేసుకున్నవాళ్లు పనిని విమర్శించరు. తమకు కేటాయించిన పనిని ప్రసాదంగా స్వీకరిస్తారు. తమకు ఇచ్చిన పనిని అంకితభావంతో ఎవరూ వేలెత్తి చూపడానికి అవకాశం లేకుండా పూర్తిచేసి, తమదైన ముద్ర వేస్తారు.

అంతమంది వీరులు ఉండగా అర్జునుణ్నే కురుక్షేత్ర యుద్ధానికి సమాయత్తం చేశాడు శ్రీకృష్ణుడు. ఎందుకు? అతడి విలువిద్యానైపుణ్యం, కార్యనిర్వహణ సామర్థ్యం అసాధారణమైనవి. పని వెంట విజయం ఉంటుంది. మన పని మనం పరిపూర్ణమైన మనసుతో వివేచనతో చేస్తే- దైవబలం, ఫలం తప్పక లభిస్తాయి!

దేవతలు వేరుగా లేరు. మానవ దేహాలను అంటిపెట్టుకుని తిరుగుతూ ఉంటారంటారు పెద్దలు. వాళ్ల లోకాలు నరదేహంలోనే నిర్మించుకున్నారు. శిరస్సు నుంచి పాదం వరకూ వ్యాపించి ఉన్నారు. దేహంలో రకరకాల పనులు నిర్వహిస్తున్నారు. మనం బయట పనులు చేస్తుంటే, వాళ్లు లోపల పనులు చేస్తున్నారు. నిజానికి వాళ్లు చేయాల్సిన పనులు అత్యంత జాగరూకతతో, నిరంతర అప్రమత్తతతో చెయ్యకపోతే మన ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి.

దేహంలో అంతర్గత కార్యకలాపాలైన రక్తప్రసరణ, గుండె కొట్టుకోవటం, కాలేయం, మూత్రాశయం, మూత్రపిండాలు పనిచేయడం, జీర్ణవ్యవస్థ పనిచేయడం, శిరస్సులో మెదడు కోటానుకోట్ల కణజాలంతో అనుసంధానమై పనిచేయడం... ఇదంతా ప్రకృతి చేసిన ఏర్పాటే.

విశ్వవ్యవస్థలో నిరంతర కర్మ జరుగుతూనే ఉంటుంది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ప్రకృతి తన చైతన్యంతో విస్తరించి ఉంటుంది. రాత్రి మరో కర్మకు తెరతీసి జీవులను సేదతీరుస్తూ ఉంటుంది.

నిజంగా, శాశ్వతంగా మనం బతకాలనుకుంటే మన పని గురించి గొప్పగా, ఉన్నతంగా మన మరణం తరవాతా ప్రతి ఒక్కరూ చెప్పుకోవాలి. అలాంటి పని చెయ్యాలి. తప్పకుండా చేద్దాం. భగవంతుడి ఉద్దేశాన్ని నెరవేరుద్దాం.
- ఆనందసాయి స్వామి 

Thursday 15 May 2014

నీరు- దైవస్వరూపం


పంచభూతాత్మకమైన ఈ ప్రకృతిలో నీటికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ప్రాణికోటికి జీవనాధారమైనది కనుక నీటిని దైవస్వరూపంగా భావిస్తాం. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి, భూమి నుంచి ఓషధులు, వాటినుంచి అన్నం, అన్నం వల్ల ప్రాణులు ఉత్పన్నమైనట్లు శ్రుతులు చెబుతున్నాయి. మన శరీరం కూడా పంచభూతాల తత్వంతో ఏర్పడిందే. అందుకే దీన్ని పాంచభౌతిక దేహం అంటున్నాం.
సకల చరాచరాలను సృష్టించేది నీరే. 'నారాయణుడు' అంటే నీరే స్థానంగా కలవాడని అర్థం. నీటి నుంచే నారాయణుడు ఆవిర్భవించినట్లు రుగ్వేదం చెబుతోంది. ఉదకంలో భగవంతుడు, భగవంతుడిలో ఉదకం ఉందనీ, దాని విశేషం తెలుసుకున్నవారే ముక్తికి అర్హులనీ 'మంత్రపుష్పం' చెబుతోంది. 'జీవితమివ్వడానికి, దీర్ఘాయువు కలిగించేందుకు, తేజస్సు పెంచేందుకు ఈ జలాలు కదులుతూ మమ్మల్ని తడుపుతుండాలి' అన్న వేదార్థం కూడా ఉంది.

నీటితో చేసే అయిదు రకాల స్నానాల వివరణ పద్మపురాణంలో ఉంది. శరీరానికి విభూతి పూసుకొంటూ జలస్మరణం చేయటం ఆగ్నేయస్నానం. శుద్ధజలంతో స్నానం చేస్తే అది వారుణస్నానం. శిరస్సుమీద జలాన్ని ప్రోక్షణ చేసుకుంటే బ్రహ్మస్నానం. గోధూళిలో సంచరిస్తే వాయవ్యస్నానం. ఎండకాస్తుండగా కురిసేవానలో తడిస్తే దివ్యస్నానంగా చెబుతారు. తడిగుడ్డతో శరీరాన్ని తుడుచుకోవడం కపిలస్నానం. ఏనుగులా చాలాసేపు స్నానం చేయడం శ్రేష్ఠమని నీతిశాస్త్రకారుడు చెప్పాడు.

మన ఆరోగ్యవృద్ధి కోసం సనాతనులు పలు సందర్భాల్లో పలువిధాలుగా నీటిని స్వీకరించాలని చెప్పారు. ఆధునిక విజ్ఞానశాస్త్రమూ దీన్నే సమర్థిస్తోంది. సంధ్యావందనంలో పెట్టిన ఆచమన విధి అందులో ఒక భాగమే. అరచేతిని ఆవుచెవిలా చేసుకొని అందులో ఒక ఉద్ధిరణ శుద్ధోదకం పోసుకుని మూడుసార్లుగా ఆచమనం చెయ్యమన్నారు. సంధ్యావందనం ముగిసేలోగా ఇలా చాలాసార్లు చేయవలసి వస్తుంది. అంటే, రోజూ మనం నీరు తరచూ తాగాలన్న సంకేతమిది. పూజలో కూడా 'మధ్యేమధ్యే పానీయం సమర్పయామి' అంటున్నాం. ఎలాంటి జలం అంటే, 'శుద్ధాచమనీయం' అంటున్నది వేదం. నీరు పరిశుభ్రంగా లేకుంటే వ్యాధులు వస్తాయన్న హెచ్చరిక ఉంది అందులో.

మనకు సంక్రమించే వ్యాధుల్లో అధికభాగం స్వచ్ఛమైన నీరు తాగకపోవడంవల్లే సంభవిస్తున్నాయి. వేదంలో అడుగడుగునా 'శుద్ధోదకం' అనే మాట వినిపిస్తుందందుకే. ఒక అగ్గిపుల్ల ప్రకాశానికీ, దహనానికీ ఎలా వినియోగపడుతుందో ఒక్క నీటిచుక్క ఆరోగ్య రక్షణకు, ఆరోగ్యహానికీ అలాగే ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో జల ఔషధ వైశిష్ట్యం సవివరంగా ఉంది. ప్రకృతి చికిత్సలో నీటికిగల ప్రాచుర్యం అనూహ్యమైనది. వేలసంవత్సరాల పూర్వం రాజులు జలస్తంభన విద్య నేర్చేవారు. పరిశుద్ధమైన నీరునిచ్చే వర్షంకోసం యజ్ఞాలు చెయ్యాలని 'గీత'లో పరమాత్మ చెప్పాడు.

జలతరంగాల్లో అంతర్యామిగా ఉన్న రుద్రుడికి నమస్కారమని 'రుద్రనమకమ్‌' చెబుతోంది. మత్స్యకూర్మావతారాల ఆవిర్భావం నీటినుంచే జరిగింది. అందుకే సలిలం దైవసమానం. జలచరాలన్నింటికీ భగవంతుడే ఆశ్రయమిచ్చి ప్రత్యక్ష సంరక్షకుడయ్యాడు. విషాన్ని హరించి జలాన్ని శుద్ధిచేసే జలచరాలెన్నో ఉన్నాయి. వాటికి ఆ వరం దైవమే ప్రసాదించాడు.

పరమాత్మ 'పత్రం, పుష్పం, ఫలం, తోయం'లలో తనకు నాలుగోదైన నీటిని సమర్పించినా సంతుష్టి పొందుతాననే చెప్పాడు. కలియుగంలో వ్యామోహ, ప్రలోభాలకు దాసులైన మానవాళికి ఇంతటి సేవాసౌలభ్యం అనుగ్రహించాడంటే భగవంతుడికి మనం సర్వదా కృతజ్ఞులమై ఉండాలి.

చెంబుడు నీళ్లుపోస్తే శంభుడు సంబరపడతాడు కదా! అందుకే ఆ అగ్నినేత్రుణ్ని అభిషేక ప్రియుడంటున్నాం. సృష్టిలో మూడువంతులు నీరు, ఒకవంతు నేల ఉంది. వృక్ష సంతతితో సహా సకలజీవకోటిని ఈ నీరే పోషిస్తోంది. పవిత్రమైన నదీ సాగర తీరాల్లో ఎన్నో దేవాలయాలు, పుణ్యతీర్థాలు వెలిసి భక్తకోటిని తరింపచేస్తున్నాయి. సముద్రస్నానం, నదీస్నానం మానవజన్మ సార్ధక్యానికి అత్యంత ఆవశ్యకాలని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఆరోగ్య పరిరక్షణలోనూ నీరు కీలక పాత్ర పోషిస్తుంది. మానవ శరీరంలో అరవై ఎనిమిది శాతం నీరు ఉంది.

భూగర్భంలో జలవనరులు అడుగంటిపోతున్న ఈ విషమ పరిస్థితుల్లో తమవంతుగా నీటిని పొదుపుగా వాడుకోవడం మానవాళి పరమావధి. ప్రతి నీటిబిందువును అమృతసింధువుగా భావించి, అప్రమత్తతతో ఉంటే జలయాగాలు చేసినంత ఫలితం.
- చిమ్మపూడి శ్రీరామమూర్తి 

Wednesday 14 May 2014

మహితాత్ముడు


యిదుగురు ఆధ్యాత్మికవేత్తలకు ఒక వివాదం వచ్చింది. ఎవరికి వాళ్లు తమ మతమే మంచిదని వాదించుకుంటున్నారు. ఎంతకూ వాళ్ల తగాదా తీరడంలేదు. 'ఎవరైనా గొప్ప జ్ఞాని వద్దకు వెళ్లి, మన వాదాలు వివరించి, ఏ మతం గొప్పదో తేల్చిచెప్పమని అడుగుదాం!' అని నిర్ణయించుకున్నారు. అలాంటి గొప్ప జ్ఞాని ఎవరా అని వెతికి, అక్కడకు చేరుకున్నారు. ఒక్కొక్కరే తన మతంలోని విశిష్టతను, తాము పూజించే దేవుడి స్వరూపాన్నీ, స్వభావాన్నీ వర్ణించి చెప్పి, తుదకు ఇతర మతాలపై తమ ద్వేషాన్ని కూడా వెళ్లగక్కారు. 'ఇతర మతాలు పనికి మాలినవి కాబట్టి అందరూ తమ మతాన్ని అనుసరిస్తేనే దైవసన్నిధికి చేరగలరు' అని స్పష్టం చేశారు.
అక్కడ మౌనంగా కూర్చుని ఉన్న మహాత్ముడు తుదకు పెదవి కదిపాడు. 'దేవుడి దృష్టిలో అందరూ సమానులే! ఆయనకు రాగద్వేషాలుండవు. పక్షపాత బుద్ధి ఉండదు. ఆయన శాంతిస్వరూపుడు, కరుణామయుడు, పవిత్రుడు, శుభంకరుడు- అని మీరందరూ స్తుతిస్తూ ఉంటారు. కానీ, మీ హృదయాల్లో మాత్రం పక్షపాత బుద్ధి, రాగద్వేషాలూ నెలకొని ఉన్నాయి. మీ మాటల్లో అసహనం తాండవిస్తూ ఉంది. సర్వ సద్గుణ సముపేతుడైన సర్వేశ్వరుడి చెంతకు చేరుకోవాలంటే, ముందుగా ఈ దుర్గుణాలను మీరు విడిచిపెట్టాలి. మీలో సహిష్ణుత అనే సద్గుణం ఉండాలి. మీరు ప్రేమమూర్తులు కావాలి. శాంతస్వభావులే భగవంతుడి సన్నిధికి చేరుకోగలుగుతారు!'

మహాత్ముడి మాటలు విని ఆ అయిదుగురు మత తత్వవేత్తలూ సిగ్గుతో తలదించుకున్నారు. ఈ హితబోధ చేసిన మహాపురుషుడు బుద్ధభగవానుడు. బుద్ధుడి జీవితంలో మనకు నమ్మశక్యంగాని విషయాలేమీ ఉండవు. కానీ, సన్నివేశాలన్నీ అద్భుతమైనవే! కష్టమంటే ఏమిటో తెలియడానికి అవకాశంలేని రాజసౌధంలో పెరిగిన యువరాజు తుదకు సన్యాసిగా మారడం కంటే ఆశ్చర్యకర సన్నివేశం ఏముంటుంది?

కోరికలే దుఃఖానికి కారణం. అజ్ఞానంవల్ల కోరికలు కలుగుతాయి. అజ్ఞానాన్ని అంతంచేస్తే దుఃఖానికి స్థానం ఉండదు. ఈ ప్రపంచం అశాశ్వతం అని గ్రహిస్తే అజ్ఞానం తొలగిపోతుంది. సరైన వాక్కు, దృష్టి, క్రియ, జీవనం, ప్రయత్నం, మనసు, ధ్యానం అనే వాటివల్ల జ్ఞానం కలుగుతుంది. అహింస, దయ, భోగరాహిత్యం, ప్రేమ, సత్యం- ఈ నియమాలే మనిషి తనను తాను ఉద్ధరించుకోవడానికి తోడ్పడతాయి!

అందరికీ అర్థమయ్యే రీతిలో, ఆచరించడానికి వీలైన వాటిని ప్రవచించాడు బుద్ధుడు. ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ఆయన అడుగుపెట్టగానే మత ధర్మాల తీరే మారిపోయింది. భిక్షాటనం చేసే ఒక భారతీయ సన్యాసి తన ప్రవచనాలతో ఆసియాఖండం మొత్తాన్ని ప్రభావితం చేశాడు. ఆయన వెలిగించిన జ్ఞానజ్యోతి రెండున్నర వేల సంవత్సరాల తరవాతా సర్వ ప్రపంచ మానవాళి శోకపు చీకట్లు చీల్చుకొని బయటపడటానికి కరదీపికగా వెలుగొందుతూనే ఉంది. నాటికీ నేటికీ ఏవైనా మహిమలు చూపగలవారినే ప్రజలు అధిక సంఖ్యలో అనుసరిస్తారు. మహిమలతోగాక, హిత వచనాలతో ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షించి, వారిని సన్మార్గగాముల్ని చేసిన మహితాత్ముడు గౌతమ బుద్ధుడు.

జీవహింస మానవత్వానికి మచ్చగా ఆయన భావించాడు. ఒక పక్షికి బాణపు దెబ్బ తగిలితే, దాన్ని తన ఒడిలో పెట్టుకొని, కన్నీటితో దాని రక్తాన్ని కడిగాడు. 'ఒక గొర్రెపిల్లను బలి ఇస్తే మోక్షం లభిస్తుందని నమ్మేటట్త్లెతే, మనిషినైన నన్ను బలి ఇస్తే మీరు సరాసరి స్వర్గానికే పోవచ్చు కదా!' అని సమాజంలోని మూఢవిశ్వాసాలకు ముచ్చెమటలు పట్టించాడు. మతం అంటే ప్రేమాదరాలతో, సచ్ఛీలతతో కూడిన ధర్మమార్గం అని బుద్ధుడు విశ్వసించాడు. ఎనభయ్యో ఏట తాను తుదిశ్వాస విడిచే వరకు, సామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషలో, సమాజ గమనాన్ని సచ్ఛీలతవైపు మరలించడానికే ప్రయత్నించాడు. 'ఎవరి మోక్షాన్ని వాళ్లే సంపాదించుకోవాలి. ఎవరో వచ్చి సాయంచేస్తే వచ్చేది కాదు అది!' అనే మహత్తర సందేశాన్ని మానవజాతికి ప్రసాదించాడు.

'బుద్ధుడు' అనే పదం అనంత జ్ఞానానికి సంకేతం. 'నేను గౌతముణ్ని. సాధనవల్ల బుద్ధుణ్ని కాగలిగాను! మీరూ సాధనచేస్తే బుద్ధులుగా మారగలరు' అని ఆత్మవిశ్వాసాన్ని మనందరికీ కలగజేసిన మహామహితాత్ముడు బుద్ధ భగవానుడు. 
- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు 

Tuesday 13 May 2014

పసి పిల్లల పసిడి ప్రపంచం


హాభారతం, రామాయణం వంటి ప్రాచీన కావ్యాల్లో ఎన్నో అద్భుతమైన కథలు ఉన్నాయి. అవి అన్నీ నమ్మదగినవిగా ఉండవు. కొన్ని సంఘటనలు నిజంగా జరిగాయా అని ఆశ్చర్యం వేస్తుంది. కల్పిత గాథలుగా కనిపించినా అవి యుగాలుగా నిలిచి ఉన్నాయి. ఇప్పటికీ వాటిని ఎంతో ఆసక్తితో చదువుతూనే ఉన్నాం. పసిపిల్లలు మాత్రమే కాదు, పెద్దవారికీ కథలంటే ఆకర్షణ. దేవతల గురించి కథలు మరీ మరీ ఇష్టం. 'అవి అన్నీ అబద్ధాలు, వాటిని చదవవద్దు' అని జ్ఞానం ఉన్నవారెవరూ అనలేదు. అడ్డు చెప్పలేదు. కథలు చదవగా చదవగా వాటి వెనక మరేదో రహస్యం ఉన్నట్లు, ఏదో సత్యం దాగి ఉన్నట్లు తెలుస్తుంది. మన మనసు అంతఃస్ఫూర్తితో విశాలంగా ఎదిగిన కొద్దీ కథలన్నీ ప్రతీకలుగా కనిపిస్తాయి. మనిషి మనసు, జీవితం వికాసం చెందడానికి పనికివచ్చే అంతరార్థాలు అన్నింటినీ వాటిలో ద్రష్టలు నిక్షిప్తం చేశారనిపిస్తుంది. వాటిలో నైతిక, ఆధ్యాత్మిక, ధార్మిక పరమార్థం ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రాచీన కథలు- అంతర్దర్శన కథలు!
మనిషిలో ధర్మం, నీతి ఉన్నంతకాలం కథలు కల్పితాలైనా నష్టం రాదు. రామాయణ, భారతాలు కల్పితాలైనా, కట్టుకథలైనా వాటిలో ధర్మం, నీతి లేవని ఎవరూ ధైర్యంగా చెప్పలేదు. అవి చదివితే పాతివ్రత్య మహిమ అనేది ఉందని, తపశ్శక్తితో ఏదైనా సాధించవచ్చునని తెలుస్తుంది. మానవాళి ధర్మం, నీతిని కాపాడుతూ వచ్చేవి ఆ కథలే.

ప్రాచీన యుగాల్లో ఉన్న ధర్మం, నీతి ఆ స్థాయిలో ఇప్పుడు ఉన్నాయా అన్న సందేహం వస్తుంది. కారుచీకట్ల మధ్య వెలిగే దీపకళికలాగా- దొంగలు, అవినీతిపరులు, హంతకులు, దుష్ట కీచకులు. అధర్మ, వికృత రాకాసి నీడల మధ్య ధర్మం ఇంకా వెలుగుతూనే ఉంది.

ధర్మం మరణిస్తే మానవజాతి గురించి గొప్పగా చెప్పుకొనేది ఏదీ చరిత్రలో మిగలదు. కాంతిహీనమైన నిర్జీవ భూగోళం సూర్యుడి చుట్టూ నిరామయంగా పరిభ్రమిస్తూనే ఉంటుంది. ధర్మం, నీతిని కాపాడే బాధ్యత ఇప్పుడు మానవజాతి భుజస్కంధాలపైనే ఉంది. 'ధర్మం ఎవరిక్కావాలి, నీతి ఎవరికి అవసరం' అని మొండిగా జీవించాలనుకుంటే మానవ జీవనపరిణామ హోమగుండంలో రాక్షస ప్రవృత్తులు మాత్రమే ప్రజ్వరిల్లుతాయి. అవి మానవజాతి ఉనికికే ప్రమాదం తెస్తాయి.

భవిష్యత్తులో ప్రపంచం సద్వర్తనులు, సాధుమూర్తుల ధర్మధామం కావాలంటే నేటి పసిపిల్లల ఆలోచనలే కాంతిపునాదులు కావాలి. క్రాంతి బీజాలు కావాలి. వారు భగవంతుడి కలలకు ప్రతిరూపాలు. చిన్న పిల్లలు ఉత్సాహంగా పుస్తకాలు చదువుతున్నప్పుడు 'అవి కట్టు కథలు' అని చెప్పి, వారిని నిరుత్సాహపరచకూడదు. 'జీవితం అలా ఉండదు' అని ఎప్పుడూ వారితో అనకూడదు. 'ప్రస్తుతం ప్రపంచం అలా లేదు. పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కాని వాటి వెనక, ఒక అతిలోక సౌందర్యం దాగి ఉంది. ఈ కురూపి ప్రపంచం ఆ అద్భుత సౌందర్యాన్ని వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తోంది' అని వారితో చెప్పాలి. 'ఈ సౌందర్యాన్ని నువ్వు ప్రేమించాలి. నీ వైపు ఆకర్షించుకోవాలి. దీన్ని నీ స్వప్నాలు, నీ ఆశల పరమావధిగా చేసుకోవాలి' అని చెప్పాలి. వారిని ప్రోత్సహించాలి.

తాము అందమైన కల కన్నామని, ఆ కలలో తమకెన్నో శక్తులున్న భావం కలిగిందని, అక్కడ అన్నీ దివ్య సౌందర్యంతో భాసిస్తున్నాయని పిల్లలు చెప్పినప్పుడు 'మీ జీవితం అలా ఉండదు' అని వారితో ఏనాడూ చెప్పకూడదు. 'జీవితం అలాగే ఉంటుంది' అని చెప్పాలి. అప్పుడే ప్రేమ మాధుర్యాలు నిండిన బంగరులోకం తలుపులు తెరుచుకుంటాయి.
- కె.యజ్ఞన్న 

Monday 12 May 2014

జీవన సౌఖ్యాలు


నిషి పుట్టిన తరవాత, బుద్ధి తెలిసిన నాటినుంచి అతడు అనుక్షణం కోరుకునేది సౌఖ్యం. అయితే సౌఖ్యం అంత సులభంగా దొరకదు. దానికోసం కష్టపడాలి. కష్టం చేయకుండా ఇష్టమైన సౌఖ్యం సాధ్యం కాదు. అందుకే దుఃఖానంతరం సుఖం, సుఖానంతరం దుఃఖం- చక్రంలా మనిషి జీవితంలో తిరుగాడుతూ ఉంటాయని అన్నీ తెలిసిన పెద్దలు అంటారు. సుఖదుఃఖాలు శాశ్వతాలు కావని సారాంశం.
మనిషి ఎంత స్వార్థపరుడంటే, చివరికి మరణం కూడా సుఖంగానే రావాలని భగవంతుణ్ని కోరుకుంటాడు. నిరంతరం పాపాలు చేసే మనిషి, చేసిన పాపాలకు ఎప్పుడో ఒకప్పుడు శిక్ష అనుభవించాలి కదా! చేసిన పాపాలకు శిక్షపడకుండా తప్పించుకోవాలని శతవిధాలా ప్రయత్నించడం మానవనైజం. శిక్షానుభవం తప్పదంటే, కనీసం కొన్నేళ్లపాటు శిక్షను వాయిదా వేసుకోవడానికైనా ప్రయత్నిస్తాడు. అంటే మనిషి ఎంతటి సుఖలాలసుడో తేటతెల్లం అవుతుంది. కష్టాలకు భయపడే మనిషిని కాలం ఇంకా భయపెడుతుంది. భయం ఒక మానసిక బలహీనత. ఇది ఉంటే అన్ని రోగాలూ ఉన్నట్లే. చీమ చిటుక్కుమన్నా భయపడేవాడు ధీరుడు ఎలా కాగలడు? అందుకే మనిషి భయాన్ని జయించాలి. అందుకోసం కష్టాన్ని సైతం ఇష్టపడాలి. మహాత్ములు కష్టాలకు భయపడరు. వనవాసంతో సీతారామ లక్ష్మణులూ, పంచపాండవులూ పొందినంత కష్టం లోకంలో ఎవరైనా పొందారా? అయినా వారు ఎంత ధైర్యంగా ఉన్నారో గ్రహిస్తే 'భయం' అనేది మిథ్య అని తేలుతుంది.

నిరంతరం ధనం వస్తుండటం, రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉండటం, మనసుకు నచ్చిన- మధురంగా మాట్లాడే భార్య ఉండటం, తన మాటను జవదాటని కొడుకులు లేదా కూతుళ్లు ఉండటం, డబ్బును సంపాదించి పెట్టే విద్య ఉండటం... మనిషి జీవితంలోని సౌఖ్యాలని 'హితోపదేశం'లో నారాయణ పండితుడు అంటాడు. ఇవన్నీ ఉన్నవారు నేటిలోకంలో చాలా అరుదు. ప్రవాహంలా డబ్బు వస్తే వస్తుందేమోగానీ, అనారోగ్యాలు రాకుండా ఎలా ఉంటాయి? 'లక్షాధికారి అయినా లవణాన్నమే తింటాడుగానీ బంగారు ముద్దలను మింగలేడు' అని నరసింహ శతకకర్త అంటాడు. నేడు కోటీశ్వరుడికి షడ్రసోపేత భోజనం చేసే అదృష్టం ఉండదు. ఈ రెండూ (డబ్బూ, ఆరోగ్యం) ఉంటే ఇంట్లో భార్యానుకూల్యం ఉండదు. భార్య అనుకూలవతి అయినా, కొడుకులు చెడుదారి పడతారు. చెప్పిన మాటలు వినరు. కూతుళ్లూ అంతే. అన్నీ ఉన్నా, డబ్బు సంపాదించిపెట్టే విద్య ఉండదు. ఇలా మానవ జీవనంలో అన్నీ సక్రమంగా ఉండటం అనేది ఎండమావే.

కొందరు ధార్మికులు అంటారు- 'మనిషికి ఇన్ని కష్టాలున్నా, తనను పుట్టించిన దేవుణ్ని కనీసం కృతజ్ఞతతో తలవడమే లేదు. దేవుడు అన్ని సౌఖ్యాలూ వాడికి ఇస్తే, ఇక దేవుణ్ని లెక్కచేస్తాడా?' అని. ఇందులో సత్యం లేకపోలేదు. ఎన్ని కష్టాలున్నా మనిషి కృతఘ్నుడు కాకూడదు. తన పుట్టుపూర్వోత్తరాలను స్మరించుకోవాలి. తన జన్మకు కారణమైనవారిని తలచుకొని, నమస్కరించాలి. వీలైతే సేవ చేయాలి. అందులోనే మానవ సౌఖ్యం ఉంది. సేవలో సౌఖ్యాన్ని అనుభవిస్తున్న గొప్ప మనుషులెందరో లోకంలో ఉన్నారు!

మనిషి అమితంగా సుఖాలకు అలవాటు పడటం మంచిది కాదు. శ్రుతిమించిన సౌఖ్యం శరీరాన్ని భారంగా మార్చివేస్తుంది. అనారోగ్యాలకు ఆలవాలమవుతుంది. కనుక కష్టాన్ని కూడా ఇష్టంతో ఎదుర్కోవాలి. పురాణ పురుషులందరూ భగవంతుణ్ని ప్రార్థించే సమయంలో, తమకు కష్టాలే ఉండాలని కోరుకునేవారట. దాని పరమార్థం- కష్టాలుంటేనే భగవంతుడు గుర్తుకు వస్తాడు. లేకుంటే మనిషి భగవంతుణ్ని కూడా మరచిపోతాడు. కష్టాల్లో భగవంతుణ్ని తలచుకుంటే, అతడు భక్తుణ్ని ఇష్టపడతాడు. ద్రౌపదీ మాన సంరక్షణం, గజేంద్రమోక్షం లాంటి కథలు ఇందుకు ఉదాహరణలు.

స్వప్న వాసవదత్త నాటకంలో విదూషకుడన్నట్లు 'సుఖం అంటే రోగాలతో గడపడం కాదు, ఆరోగ్యంగా ఉండటమే' అనే మాటల్ని తలచుకుంటే 'ఆరోగ్యమే సౌఖ్యం' అనేది అక్షరసత్యం. మానవాళి ఆయురారోగ్య భాగ్యాలతో ఆచంద్రార్కం వర్ధిల్లుగాక! శ్రుతిమించిన సుఖాలను కోరకుండుగాక!
- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ