ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Saturday 31 August 2013

ఒంటరితనంలోని గొప్పతనం


 కోట్ల జనాభా ఈ భూమ్మీద నివసిస్తోంది. అనుక్షణం ప్రతి ఒక్కరికీ ఎన్నో ఆలోచనలు పుడుతుంటాయి. కరిగిపోతుంటాయి. జీవరాశులు వస్తుంటాయి, పోతుంటాయి. అయితే జీవితాల్లో ఒక క్రమం ఉంది. రావడం, జీవించడం, నిష్క్రమించడం... సముద్రంలో ఎప్పుడైనా అల స్థిరంగా ఉండటం చూశామా... వస్తుంది. వెళ్ళిపోతుంది. రాత్రి... పగలు... రుతువులు అలాగే ఆలోచనల స్పందనలు, ప్రతిస్పందనలు! జీవితంలో ఈ చలన స్వభావాన్ని పరిశీలిస్తే- దేనినైనా పట్టుకుని 'ఇది ఇలాగే ఉండాలి' అని, 'ఉంటుందీ' అని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఎందుకు మనం కొన్ని విషయాలపట్ల తీవ్రంగా ప్రవర్తిస్తాం, చిత్రంగా ఆలోచిస్తాం? కారణం ఎక్కడో లేదు, మనలోనే ఉంది. మనలోని తీవ్ర వ్యతిరేకత. మనమనుకున్నది జరగకపోతే ఏదో అయిపోతుందేమోనన్న అభద్రత. మనమనుకున్నట్లు, వూహించుకున్నట్లు జరగకపోతే ఏదో అయి అయోమయంలోకి నెట్టి లోపల పీడించే బాధ. జరిగేదానివల్ల మనకు మంచి ఉండొచ్చు. దానివల్ల మనకెంతో మేలూ కలగవచ్చు. కానీ, మన ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. అందుకు ముందు తిరస్కరిస్తాం... వ్యతిరేకిస్తాం... కారణం దృక్పథం. ఆలోచనా ధోరణి... చూసే కోణం- రాయికి, రత్నానికి భేదం కనుక్కోలేని స్థితి. ఏదైతే బాధను కలిగించిందో, అదే ఆ తరవాత మన జీవితంలో మధురాతిమధురమైన పరిణామానికి దారితీయవచ్చు. ఏదైనా బాధకు కారణం అయినదానిపట్లా కృతజ్ఞత అవసరం. చిత్రంగానే ఉంటుందీ భావన... కానీ ఆ తరవాత అది ఓ అంతర్మథనానికి, ఓ గొప్ప అవకాశానికి హేతువు అవుతుంది. చాలా సందర్భాల్లో ఆ ఒత్తిళ్లు, బాధలు మంచి మార్పునకు దోహదపడతాయి. 
ఈ సత్యాన్ని గ్రహిస్తే మనసు అల్లకల్లోలానికి, శరీరం అనారోగ్యానికి గురికాకుండా ఉంటుంది. 

శిల్పకారుడు ఒక శిలను తీసుకుని ఉలితో అనవసరమైనదాన్ని తొలగిస్తూ ఓ అందమైన శిల్పంగా మారుస్తాడు. అలాగే బాధలు, ఒత్తిళ్లు, చిక్కులు, చీకాకులు జీవితం అందంగా రూపొందడానికి సహాయపడతాయి.

ఒంటరితనం అవసరం. ఒంటరిగా వచ్చి ఒంటరిగా వెళ్ళిపోతాం ఈ లోకంనుంచి. జీవితంలో ఎక్కువ ఆలోచనలు, అవకాశాలు ఒంటరిగా ఉన్నప్పుడే వస్తుంటాయి. ఒంటరితనాన్ని దూషించడం తగదు. నిజానికి ఒంటరిగా ఉండే పరిస్థితులకు కారణమైన వ్యక్తులకు, సందర్భాలకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఒంటరితనంలో చేసే ఆలోచనలవల్ల చాలావరకు మనసు ప్రశాంతమవుతుంది. ఎవరికి వారు అర్థం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అలా జరిగినప్పుడే జీవితం విలువ తెలుస్తుంది. కానీ, ఒంటరిగా ఉండటానికి సాధారణంగా ఎవరం ఇష్టపడం. భయపడతాం. తోడు కోసం పాకులాడతాం. చిత్రమేమిటంటే తోడు దొరికిన మరుక్షణం నీలోని 'నువ్వు' మాయమవుతుంది. అది జరిగినప్పుడు మనలోకి మనం తొంగిచూసుకునే అవకాశం దూరమవుతుంది. ఒంటరితనం బాధించినప్పుడు దానితోనే ఎక్కువ కాలం ఉండే ప్రయత్నం చేయాలి. మొదట్లో ఇబ్బంది అనిపించవచ్చు. ఎప్పుడైతే ఒంటరితనం అనే విత్తనంలో జీవించడం అలవాటు అవుతుందో- ఓ అందమైన వృక్షాన్ని తరవాత చూడగలుగుతాం. ఆ విత్తనమే ప్రేమ, శాంతి, సామరస్యం, సుఖసంతోషాలను... ఎన్నింటినో అందిస్తుంది. ఒంటరితనాన్ని ఓర్పుతో పట్టి ఉంచగలగాలి. ఒంటరితనం ఏర్పడినప్పుడు భగవంతుడి ఆశీస్సులుంటాయి. 'దిక్కులేనివాడికి దేవుడే దిక్కు' అని వూరికే అనలేదు. మానసిక బలం చేకూరుస్తుంది ఈ మాట.

ఈ లోకం చాలా వింతైనది. ఎప్పుడూ దేనితోనో ఒకదానితో ముడిపెట్టి ఉంచుతుంది. తీరిక లేకుండా చేస్తుంది. ఆలోచనలకు ఆస్కారం లేకుండా ఉంటుంది. దేవుడున్నాడా లేడా... అన్న చర్చలొద్దు. 'దేవుడున్నాడు అన్నీ ఆయనే చూసుకుంటాడు' అనే ధైర్యం మనిషిని ముందుకు నడిపిస్తుంది. ఆశావహ దృక్పథాన్ని కలిగిస్తుంది. 'మనం చేసే పాపపుణ్యాలు ఆ దేవుడు చూస్తుంటాడు' అని విశ్వసిస్తే పాపకార్యానికి అడుగు ముందుకు పడదు.                                                                         - మంత్రవాది మహేశ్వర్‌ 

Friday 30 August 2013

సనాతన ధర్మదీపిక


 అనాదిగా, అవిచ్ఛిన్నంగా ఉన్నదీ, శాశ్వతమైనదీ 'సనాతనధర్మం'. దీన్ని వేదధర్మమనీ అంటారు. మనిషిని అన్ని విధాలైన అనర్థాలు, ఆపదల నుంచి ఉద్ధరించి, ఉన్నతివైపు నడిపించేది ధర్మం. కొన్ని కాలాల్లో కొన్ని కొన్ని ధర్మాలు ఆచరణలో ఉంటాయి. కాని సనాతన ధర్మం సర్వదా ఉండేది. దీన్నెవరో సృష్టించలేదు. దానంతటదే ఆవిర్భవించింది. ఆద్యంతాలులేనిదే సనాతన ధర్మమని శ్రీరామానుజాచార్యులు వ్యాఖ్యానించారు.

సనాతన ధర్మం మనదేశానికి మహాప్రాణం. దీనివల్లనే ప్రపంచంలో అత్యున్నత ఆధ్మాత్మిక శిఖరాన శోభిల్లగలుగుతోంది. ధర్మాన్ని రక్షిస్తే, అది మనల్ని సదా రక్షిస్తూనే ఉంటుంది. దీనికి సాటియైన ధర్మం లోకంలోనే మరోటి లేదు. ఇది మతం కాదు. ఎందుకంటే మతానికి ఆది-అంతం ఉంటాయి. పరధర్మాచరణకన్న స్వధర్మాన్నే విశ్వసించి చేయడం సముచితమనీ, స్వధర్మానుసరణలో మరణమైనా శ్రేయస్కరమేననీ గీతాప్రవచనతాత్పర్యం. ఇతరులు నీపట్ల ఎలా ప్రవర్తించాలని నీవనుకుంటావో నీవూ అలానే ప్రవర్తించాలనేది సర్వ ధర్మాలసారం. మనిషికి పుట్టుకతోనే స్వధర్మం వెన్నంటి ఉంటుంది. మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి అనే ధర్మసూక్ష్మాలు శైశవదశనుంచే తల్లిదండ్రుల ఆసక్తి, శ్రద్ధల వల్ల పిల్లలకు అలవడతాయి. ఆ తరవాత విద్య, వివేకం, అనుభవం, సమాజంవల్ల మరికొన్ని ధర్మసూత్రాలు వాళ్లు తెలుసుకుంటారు. బంధుప్రీతి వల్ల అర్జునుడు కురుక్షేత్రంలో యుద్ధం చేయనని, స్వధర్మాన్ని త్యజించేందుకు సిద్ధపడితే కృష్ణపరమాత్మ అతణ్ని జాగరూకుణ్ని చేస్తాడు. ధర్మపక్షపాతికి దేనిమీదా వ్యామోహం ఉండదు. ఇతర ప్రాణికి ఏ కష్టమూ కలిగించకపోవడమే ధర్మం.

ధార్మిక జీవనం మంచి మరణానికి దారితీస్తుంది. అంతరాత్మ చెప్పినట్లు జీవించడం ధర్మం. మనసు చెప్పినట్లు జీవించడం అధర్మమవుతుంది. ఇంద్రియవ్యామోహమున్నవారు ధర్మనిర్వహణ చేయలేరు. దేవుడంటే భయభక్తులుండటం వల్లనే మనిషి కొంతలో కొంతైనా ధర్మబద్ధంగా జీవించగలుగుతున్నాడు. ప్రకృతిలోని చెట్టు, గట్టు, ఏరు, గాలి, నేల, నింగి, నిప్పు మొదలైనవన్నీ తమతమ ధర్మాల్ని నిర్వర్తించగలుగుతూంటే, మానవుడే తన ధర్మాన్ని మరిచి విశృంఖలంగా ధర్మ ధిక్కారం చేసి ఎండమావుల్లాంటి భోగాలవెంట పరుగులు తీస్తున్నాడు.

ధర్మానికి, దైవానికి ప్రతీకగా నేలనేలుతున్న సత్యాన్నే పలకాలని మనుస్మృతి. ధర్మవ్యాధోపాఖ్యానంలో ధర్మవ్యాధుడు బహువిధాలైన ధర్మసూక్ష్మాల్ని కౌశికుడికి బోధిస్తాడు. 'సత్యంవద' అనే సూక్తితో తైత్తిరీయోపనిషత్తు సత్యం ద్వారానే ధర్మావిష్కరణ సాధ్యమని చెబుతోంది. సహనం, ధైర్యం, మనోనిగ్రహం, పరధనాపరిగ్రహణం, బాహ్యాభ్యంతరశుచి, సత్యాసత్యవిచక్షణ, కావలసిన పరిజ్ఞానం, సత్యభాషణం, క్రోధ విసర్జనం, ప్రేమ- ఈ పది లక్షణాలు ధర్మజీవనానికి ప్రముఖమైనవిగా విజ్ఞులు చెప్పారు. యుద్ధానికి బయలుదేరేముందు ఆశీస్సుల కోసం తల్లి గాంధారి వద్దకు వచ్చిన దుర్యోధనుణ్ని పుత్రవాత్సల్యంకన్న ధర్మమే శ్రేష్ఠమని నమ్మి, 'ధర్మానికి విజయం లభించుగాక' అని దీవిస్తుంది.

ఆత్మీయత, ప్రశాంతత, ప్రసన్నత, పరపీడనాభావరాహిత్యం, అతిథుల పట్ల ఆదరణ, శిష్టవ్యావహారికత, ఆధ్యాత్మిక చింతన, సత్కార్యాల పట్ల శ్రద్ధ వంటి 55 సద్గుణాల రాశి- 'ధర్మం' సమగ్ర స్వరూపం. మనిషి తన మనసుతోసహా సర్వాంగాలను ధర్మానువర్తనకే వినియోగించాలి. ధర్మప్రతిష్ఠాపన కోసం ఆదిశంకరుల వంటి మహనీయులెందరో అహర్నిశలు కృషిచేసి, అది తమ ధర్మంగానే భావించారు. దుర్యోధనుడి మనసు మార్చాలని భీష్మద్రోణాది ఆచార్యులెంతగానో హితవు చెబుతారు. దుర్యోధనుడంటాడు- 'ధర్మమని తెలిసినా, నేనాచరించలేను. అధర్మమని తెలిసి కూడా దాన్ని అనుసరించడం మానను' అని. తగిన ప్రాయశ్చిత్తం జరగనే జరిగింది. పరకాంతావ్యామోహాన్ని గరళంతో సమానంగా పోల్చింది సనాతన ధర్మం. రావణ దుశ్చరిత్ర అదే నిరూపించింది. సామాజికధర్మాలు, రాజనీతిధర్మాలు, సంప్రదాయక ధర్మాలని వివిధ రకాలుగా ధర్మవర్గీకరణ జరిగింది. సనాతన ధర్మవర్తనుడైనకొద్దీ మనిషి జీవితంలో స్నేహం, ఆనందం, సౌహార్దత, సౌభ్రాతృతం, పరోపకారం, ఔదార్యం, దాతృత్వం వంటి మహోన్నత సద్గుణాలు పెంపొందుతూంటాయి. శ్రీరాముడు, కృష్ణుడి అవతార విశేషాల్లో ఈ సనాతన ధర్మమే ఎల్లెడలా గోచరిస్తుంది మనకు.

ధర్మావలంబనలో ఎంత లీనమవుతామో, అంతగా దుర్వ్యసనాలన్నింటినీ దూరం చేసుకోగలం. రజస్తమోగుణాలను విసర్జించగలం. సనాతన ధర్మం విశ్వధర్మం. సమస్త ప్రాణికోటి శ్రేయానికి సంబంధించింది. పరమ రమణీయమైన ప్రకృతి ధర్మాలకు సంబంధించింది. శ్రుతి-స్మృతి-వేద-పురాణాదుల్లో సర్వత్రా ధర్మమే మూలమంత్రం. కనుక ధర్మమే మనకు శ్రీరామరక్ష!
                                                                    - చిమ్మపూడి శ్రీరామమూర్తి 

Thursday 29 August 2013

అమృతతుల్య అనుభూతి


 లోకంలోని అనుభూతులన్నింటిలోకీ తలమానికమైంది ఆధ్యాత్మికానుభూతి. నిజానికదో అలౌకికానుభూతి. ఆనందకాసారం. బ్రహ్మానంద మూలకం. మానవ జీవిత సార్థక్య రహస్యాన్ని తెలుసుకున్నవారు దాన్ని పొందేందుకు జీవితకాల సాధనకు కంకణం కట్టుకునే అమృతోపమాన వ్రతం. ఉత్కృష్ట మనోరథం.

ఆధ్యాత్మిక అనుభూతికి కారణం ఏమిటి, ఆధారం ఏమిటి? అసలు అందుకు ఏం కావాలి? ఒక గొప్ప క్షేత్ర దర్శనమా, తీవ్రమైన ధ్యాన యోగమా, అత్యుత్తమమైన గురువు పర్యవేక్షణలో సాధనలా? అధిక కాల అనుష్ఠానమా, తపనా, వ్రతాలు, నిష్ఠలు, ఉపవాసంలాంటి హఠయోగాలా? ఇన్నీ, ఇవన్నీ. అవును. కానీ... కాకపోవచ్చుకూడా. ఎందుకంటే ప్రాపంచికాంశాల్లో ఒక పని పక్వానికి రావడానికి, ఫలించడానికి కాల నియమం ఉంటుంది. కానీ పారమార్థికం అలా కాదు.

సత్కర్మలు చేస్తూ ఫలితాన్ని భగవంతుడికి అర్పించి, ఆయన ఇచ్చే ప్రసాదం కోసం వేచి ఉండటమే మనం చేయవలసిన, చేయగలిగిన పని.

అయితే ఈ అనుభూతి ఏమిటి? అది పొందాలని ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగిన ప్రతివారికీ ఉంటుంది కదా? నిజానికి అదే కదా మనిషి పొందవలసింది. అయితే ఎందులో ఉంది... ఆ అపురూప అనుభూతి? ఏ సత్కర్మలో ఉంది, ఏ గొప్ప సాధనలో ఉంది? దీనికి గొప్ప కర్మలు చేయవలసిన అవసరం లేదు. అది గొప్ప కర్మచేసే సందర్భంలో కావచ్చు. లేదా ఆ కర్మ తాలూకు నిరామయ గాఢ నిశ్శబ్దంలో కావచ్చు. లేదా ఈ రెండూ కాని సాధారణ స్థితిలోనూ సంభవించవచ్చు.

మనలోని భగవదున్మత్తత, ప్రేమ, పరితాపం ఏ క్షణంలో, ఏ కణంలో, ఏ కోణంలో దాన్ని మనకు అందిస్తుందో తెలీదు. భగవంతుడిపట్ల భక్తి, అనురక్తి అధికమయ్యే కొలదీ ఆయన తాలూకు పరిమళాన్ని మనకు పంచేందుకు ప్రకృతిలో సర్వత్రా, సర్వకాల సర్వావస్థల్లోనూ అవకాశం కాచుకొనే ఉంటుంది. భక్తుడు ఆయనను పొందాలనే తీవ్ర పరితాపంతో తపించిపోతున్నప్పుడు పంచ భూతాత్మకమైన ఈ ప్రపంచంలోని ఏ భూతమైనా ఆ అనుభూతిని ఇవ్వగలదు. ఒక చల్లని గాలి తెర భగవత్‌ స్పర్శలా అనుభూతిని ఇవ్వవచ్చు. అరచేతిలోని ఔపోసనా జలం భగవంతుణ్నే లోపలికి సేవిస్తున్న అపూర్వానుభూతిని కలిగించవచ్చు. ఒక సాధారణ దీపంలో ఆ పరంజ్యోతి స్వరూపాన్నీ దర్శించవచ్చు.

రామకృష్ణ పరమహంస తన ధర్మపత్ని అయిన శారదాదేవిలో ఆ పరదేవతను కనుగొన్నారు. వారి చిన్నతనంలో ఒక దేవతను కొలిచే కార్యం మీద వూరి స్త్రీలతో కలిసి పొలాల మధ్యలో వెళ్తూండగా ఆకాశంలోని పక్షల బారును చూసి గొప్ప ఆధ్యాత్మిక పారవశ్యానికి లోనయ్యారు. రాధ నెమలిని చూసినా, నీలి మేఘాన్ని చూసినా కృష్ణ భావంతో మైమరచిపోయేది. త్యాగరాజు తన సంగీతంతో భగవదనుభూతి పొందారు. అన్నమయ్య వేంకటేశ్వరుని భక్తిపూర్వక కీర్తనల్లోనే గాక స్వామి శృంగార రసపోషణనూ ఆధ్మాత్మికానందంగా మలచుకున్నారు. ఇందులో అసంబంద్ధం ఏమీ లేదు. సర్వత్రా దైవాన్ని భావించేవారు, ఆశించేవారు ఎల్లెడలా దర్శించగలరు. స్పర్శించగలరు. అణువణువునా భగవదనురక్తితో తపించేవారు ఒక యుగళగీతంలోని స్వర సంచలనానికి కూడా ఆధ్యాత్మికానుభూతితో కళ్లు అరమోడ్పులై పులకలు పోగలరు. లేగదూడను చూసి గోవు పొదుగు చేపినట్లు భగవంతుడి స్మరణమాత్రం చేతనే (ఒక్కోసారి అది కూడా లేకుండానే) ప్రకృతిలోని ప్రతి అణు స్పందనలోనూ, స్పర్శలోనూ, శబ్దంలోనూ, నిశ్శబ్దంలోనూ భగవంతుని అనుభూతి చెందగలడు భక్తుడు. 
                                                                          - చక్కిలం విజయలక్ష్మి 

Wednesday 28 August 2013

శ్రీకృష్ణ జన్మాష్టమి


హావిష్ణువు భూమిపై శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు, భూలోకం వైకుంఠం కన్నా అధిక తేజస్సుతో వెలిగింది. ఆయన సాన్నిధ్యం, ఆయన నడిచే చోటును జ్యోతిర్మయం చేసింది. శ్రీకృష్ణుడు జరిపిన రాసలీలను బ్రహ్మతోపాటు శివుడు వీక్షించి, ఆ అద్భుత నృత్యకేళి గురించి పార్వతితో చెప్పాడట. ఇతరుల భార్యలతో శ్రీకృష్ణుడు ఎలా నాట్యం చేశాడని పార్వతి సందేహం వెలిబుచ్చింది. చాలామందికి సామాన్యంగా కలిగే సందేహమే అది. అప్పుడు శివుడు 'మొత్తం విశ్వమంతా నారాయణుడి శరీరమే. ఆయన గోపికల్ని స్పృశించినప్పుడు, తనకు తానే స్పృశించినట్లు అవుతుంది. గోపికలను శ్రీకృష్ణుడు కౌగిలించుకోవడం పరమాత్మ జీవాత్మను కౌగిలించుకొన్నట్లే అని అర్థం చేసుకోవాలి. శ్రీకృష్ణుడిపై గోపికలకు గల అపారభక్తి వారి మోక్షానికి కాంతి ద్వారాలు తెరిచాయి' అని పార్వతికి విశదం చేశాడు.
'రసం' అంటే రుచి. అన్నింటికన్నా మించిన మాధుర్యం గల రసస్వరూపుడు నారాయణుడే అని ఉపనిషత్తులు వర్ణించాయి. నిజానికి అన్ని రసాలు (రుచులు) ఆయనలో రాశీభూతమైనాయి. భగవంతుడు ఆనందం ఇస్తాడు. అదే రాసలీల. అదొక అలౌకిక సౌందర్యలీలా ఖేలన మనోజ్ఞ ప్రాభవం!

భగవంతుడు భక్తికి లొంగిపోతాడు. యశోద ఆయన్ని చిన్నతనంలో రోలుకు బంధించింది. విశ్వపరివ్యాప్తుడైన భగవంతుణ్ని ఎవరైనా తాడుతో కట్టగలరా? ఆయన సమ్మతి లేకుండా మనం ఆయన్ని తాళ్లతో బంధించగలమా? యశోద పట్ల ప్రేమవల్ల ఆయన యశోద చేతిలో బందీ అయ్యాడు. భక్తులు తమ గుండెల్లో బంధిస్తామన్నా ఆయన ఆనందంగా ఒప్పుకొంటాడు. యశోద ఆయన్ని బంధించినప్పుడు, తాడు పొడవు రెండు అడుగులు తగ్గింది. అందువల్ల ఆయన తన దేహాన్ని కుదించుకొని, యశోద కట్టడానికి అవకాశం కల్పించాడని చెబుతారు.

తాడు రెండడుగులే తగ్గడానికి వెనక పరమార్థం ఒకటి ఉన్నది. భగవంతుణ్ని చేరడానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి భక్తి. రెండోది అనుష్ఠానం. నిర్ణీత సాధన చేసి తీరాలి. మనలో గర్వాహంకారాలు అణిగినప్పుడే మనలో జ్ఞానం వికాసం చెందుతుంది. సృష్టిలో ప్రతి వస్తువు, ప్రతి ప్రాణి ఆయనే అనే భావం కలిగినప్పుడు, మనకు ఆయన దాసుడు అవుతాడు. తాను అవతారమైనా అర్జునుడికి రథసారథి అయ్యాడు. ఆ రథాశ్వాలకు స్నానం చేయించాడు. స్నేహితుడు సుదాముడు తన వద్దకు వచ్చినప్పుడు అతణ్ని సింహాసనంపై కూర్చోబెట్టాడు. సుదాముని పాదాలను కడగమని రుక్మిణిని అడిగాడు. సుదాముని పాదస్పర్శతో ఆ జలాలే పవిత్రమయ్యాయని శ్రీకృష్ణుడు రుక్మిణికి చెప్పాడు. భక్తుల మధ్య ఆయన అమితానంద పరవశుడవుతాడు. భక్తులు ఏ పేరు పెట్టి పిలిచినా ఆనందంగా పలుకుతాడు.

అన్ని లోకాలు శ్రీకృష్ణుడిలోనే ఉన్నాయి. ఆయన కాలి మువ్వలు పాతాళం, రసాతలం, ఆయన మోకాళ్ల ప్రదేశం మహాతల లోకం. ఆయన హృదయం సురలోకం. ఆయన నాభి అనంతాకాశం. ఆయన శిరస్సు సత్యలోకం. శ్రీకృష్ణుడు చల్లదనం ఇచ్చే సూర్యుడని పరమ భక్తాగ్రేసరుడు వేదాంత దేశికులు అన్నారు. శుకబ్రహ్మ శ్రీకృష్ణుడి జాతక చక్రం పూర్తిగా అందివ్వలేదు. శ్రీకృష్ణుడు జన్మించిన మాసం, నక్షత్రం మాత్రం ఇచ్చాడు. కానీ, స్వామి దేశికులు వృషభ లగ్నంలో శ్రీకృష్ణుడు జన్మించాడని, ఆయన అవతరించినప్పుడు సూర్యుడు, చంద్రుడు, కుజుడు, శని, బుధుడు అనుకూలమైన శుభకూటమిగా ఏర్పడినట్లు వివరించాడు. సాధువుల హృదయాలు ఆనందంతో పరవశించాయి. నదీజలాలు కాలుష్యాలు తొలగి పవిత్ర ప్రవాహాలయ్యాయి. చెట్లు పుష్కలంగా తియ్యని ఫలాలు అందించాయి. సూర్యుడికి గ్రహణం రావచ్చు. శ్రీకృష్ణుడనే సూర్యుడికి మాత్రం ఏనాటికీ గ్రహణం రాదు. ఆయన గీత విశ్వగీతమై అనేకమంది రాతలు మార్చింది. ఆయన అవతార అమృత కిరణాలు భూమిని ఎన్ని యుగాలైనా తేజోమయం చేస్తూనే ఉంటాయి.
                                                                                         - కె.యజ్ఞన్న 

Tuesday 27 August 2013

అమృతరసం


మూలం నుంచి శాఖాగ్రం వరకు వ్యాపించి ఉండే వృక్షరసాన్ని- అది యథాతథంగా ఉన్నప్పుడు అనుభవించడం సాధ్యంకాదు. ఆ వృక్షరసాన్నే ఫలరూపంలో అనుభవించడం సులభం. కనుకనే లోకం ఫలాన్ని ఆశిస్తుంది. క్షీరంలో నెయ్యి సర్వవ్యాప్తంగా ఉంటుంది. కానీ, నెయ్యిలో ఉండే కమ్మదనాన్ని క్షీరంలో పొందలేం. పాలను తరచి నెయ్యి వేరు చేసిన తరవాతే రసానుభూతి కలుగుతుంది.

అదేవిధంగా భక్తి జ్ఞాన వైరాగ్య స్థాపనకై వేదవ్యాస మహర్షి వేదాల నుంచి భాగవత సారం తీసి, లోకానికి ప్రసాదించాడు. భాగవతం అంటే భగవంతుడి గురించి తెలియజేసేది. భగవద్భక్తులను భాగవతులు అంటారు. భగవంతుడు భాగవతుల్లో వ్యక్తమవుతాడన్న భావన భాగవత గ్రంథానికి పునాది. పద్దెనిమిది వేల శ్లోకాలతో, పన్నెండు స్కంధాల్లో భాగవత మహాపురాణ రచన ఉంటుంది.

ప్రప్రథమంగా ఈ మహాపురాణాన్ని, తన నాభి కమలంలో ఆసీనుడై సంసార భయకంపితుడైన బ్రహ్మకు- కరుణారస హృదయంతో శ్రీమన్నారాయణుడు వినిపించాడు. ఇది ఆదిలోను, అంతంలోను వైరాగ్యయుక్తమైన గాథలతో, భగవల్లీలా కథామృత ప్రవాహరూపమై భక్తకోటికి మహదానందాన్నిస్తూ విరాజిల్లుతోంది. దీంట్లో ధర్మం, నిష్కలుషంగా, నిష్కంటకంగా నిరూపితమైంది.

విష్ణుభక్తులకు తరగని మూలధనమైన భాగవతం- పురాణాల్లో నుదుటి తిలకం వంటిది. భాగవత శ్రవణాసక్తి జనించిన మరుక్షణంలోనే ఆ మనిషి హృదయవీధిలో శ్రీకృష్ణభగవానుడు స్థిరుడై నిలిచిఉంటాడు. అరణ్యంలో సింహగర్జన విని సాధుజంతువులు భయంతో పారిపోయినట్లు, భాగవత ఘోష వల్ల కలిదోషాలు నశించిపోతాయంటారు.

వేదవ్యాస మహర్షి దీనిలో పరమహంసలకు ఉపయుక్తమైన జ్ఞానాన్ని సర్వసమర్థంగా ఉపదేశం చేశాడు. పరిశుద్ధాంతఃకరణంతో, భక్తిశ్రద్ధాసమన్వితుడై భాగవత పఠన, మనన, ధ్యానాలు చేసేవారికి మోక్షం కరతలామలకమవుతోందని చెబుతారు. అగ్నిహోత్రం అనేకానేక కాష్ఠాలను దహించేవిధంగా- భాగవతం సర్వపాపాలను హరించివేస్తుందని అంటారు.

భాగవతాన్ని భక్తితో ఏకాగ్రతతో ఇతరులకు వినిపించేవారి హృదయం పవిత్రమవుతుంది. నిత్యం భాగవతపఠనం జరిగే గృహం తీర్థరూపం పొందుతుంది. అక్కడ నివసించేవారు పాపప్రక్షాళన చేసుకొని పరిశుద్ధులవుతారు. గంగా, గయా, కాశీ, పుష్కర, ప్రయోగాది నదులు ఇవ్వలేని పుణ్యఫలం భాగవతం ఇస్తుందని ప్రతీతి.

దీన్ని అధ్యయనం చేయడంవల్ల ధీశక్తీ, సామ్రాజ్యం, ధనాధిపత్యం, పాపవిముక్తీ కలుగుతాయని పురాణవచనం. ఈ గ్రంథాన్ని ఆశ్రయించినవారికి వేరొక శాస్త్రంగాని, తరుణోపాయ సాధనంగాని అవసరంలేదంటారు. భాగవత పారాయణమే జ్ఞానయజ్ఞంగా చెబుతారు. శ్రీశుకాది మహాజ్ఞానులంతా భాగవత పఠన రూపమైన జ్ఞానయజ్ఞం ఆచరించినవారే.

శాపగ్రస్తుడైన పరీక్షిన్మహారాజు ప్రాయోపవేశం చేసిన సమయంలో శుకమహర్షి- ఆ రాజర్షికి ఆత్మతత్వ ప్రతిపాదకమైన భాగవత తత్వం వినిపిస్తాడు. భాగవతం భూలోక అమృతరసం అనీ, ఇటువంటిది స్వర్గ సత్య కైలాస వైకుంఠాది లోకాల్లో లభ్యంకాదనీ అభివర్ణిస్తాడు.                                                                                                 - భరణి 

Monday 26 August 2013

సహజమార్గం


 మనిషి ఈ భూమిపైన మరిమరి వూపిరి పోసుకోవటానికి కారణం- కర్మఫలం అనుభవించటానికే. ఆ మాటే నిజమైతే- ఆలోచించటానికి మనసు, ఎలాగైనా జీవించాలన్న ఆలోచన, మనసులో ఏ భావం ఉన్నా దాన్ని కట్టడి చేసి నలుగురు మెచ్చుకునేలా మాట్లాడే వాక్‌చాతుర్యం, కంటితో ప్రత్యక్షంగా చూడగలగడం, చెవితో పరోక్షంగా వినగలగడం- వీటితో పనేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం- కర్మ కోసమే కాకుండా ఈ జన్మలో ఆత్మోన్నతి సాధించటమే ముఖ్యమైన కారణమని చెప్పక తప్పదు. అలాంటి ఉన్నతమైన ఆదర్శం లేకపోతే, మనిషి కావటంకన్నా అడవిలో మానై నిలిచిపోవటం నయం. మనిషిగా పుట్టడమే ఒక గొప్పవరం అయినప్పుడు అది శాపం కాకుండా కాపాడుకుంటూ, జీవితంలో ఉన్నతశిఖరం అందుకోవటం ఎంతో ముఖ్యం. ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగుతూ, శిఖరాగ్రం చేరుకోవటానికి ఈ శరీరాన్ని, మనసును, అందుబాటులో ఉన్న జీవితావకాశాల్ని తెలివిగా ఉపయోగించుకోవాలి. అందుకు ఏం చేయాలి? ఇది రెండో ప్రశ్న.

రుషులు, దార్శనికులు ఇందుకు తగ్గ మార్గనిర్దేశం ముందుగానే చేశారు. ఇప్పుడు మనం చేయవలసిందల్లా, ఆ మార్గదర్శకాలను జీవితంలో అమలుపరచటమే. మనకు శ్రమలేకుండా, వేదవేత్తలు నాలుగు ఆశ్రమధర్మాలను అందజేశారు. బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం- ఈ నాలుగింటిని శిఖరాగ్రం చేరటానికి మేడమెట్లలా ఉపయోగించుకోవాలి.

మనిషి ఒక జీవితకాలంలో ఇహమైనా పరమైనా సాధించాలనుకుంటే, ఒక లక్ష్యం ముందుగానే నిర్ణయించుకోవాలి. ఒక పథకం ప్రకారం ఆ లక్ష్యం వైపు సర్దుబాట్లు, దిద్దుబాట్లు చేసుకుంటూ- అడుగు ముందుకు వెయ్యాలి. ఈ పనిని నిర్దుష్టంగా, నిర్దిష్టంగా చేపట్టడానికి బ్రహ్మచర్యాన్ని మించిన అవకాశం లేదు. జిజ్ఞాస, జ్ఞానసముపార్జన, పరిశీలన, విశ్లేషణ... ఇవన్నీ నిర్విఘ్నంగా చేయటానికి ఏ చీకూచింతా లేని బ్రహ్మచర్య ఆశ్రమమే ఆదర్శప్రాయమైన సమయం. గార్హస్థ్యంలో ఒక కుటుంబ యజమానిగా సంసార సాగరం ఈదటంవల్ల జీవితంలోని లోతుపాతులు తెలుసుకోవచ్చు. అంతకుమించి, అనుభవపూర్వకంగా ఇంద్రియాల లాలస, విషయభోగాల స్వభావం గ్రహించవచ్చు. భోగించి యోగించటమే ఉత్తమమైందని, జీవితాన్ని కాచి వడబోసిన వేమన తన వేదంలో చెప్పాడు. అసలైన వైరాగ్యానికి సిసలైన వేదిక గృహస్థ జీవితమే. మూడోదైన వానప్రస్థం మహాప్రస్థానానికి ఒక ఉపోద్ఘాతంగా చెప్పుకోవచ్చు. సహనం దాని సారాంశం. రాజులు రాజర్షులై భర్తృహరిలా సుభాషితాలు, హితబోధకాలైన గ్రంథరచనలు, ధర్మ, న్యాయసూత్రాలు సృష్టించింది ఈ స్థితిలోనే. చరమ పాదమైన సన్యాసం జీవన పరిసమాప్తికోసం నిర్దేశితమైంది. కర్మఫలాన్ని ఆశ్రయించకుండా కర్తవ్యకర్మ ఆచరించేవాడే నిజమైన సన్యాసి, యోగి అంటోంది గీత. ఒక సమన్వయకర్తగా మనిషి ఎదుగుదలకు నిదర్శనమే సన్యాసం. అలాంటి నిఖార్సయిన సన్యాసి కాషాయం కట్టి, సిగచుట్టి, విభూతిపెట్టి, కమండలం పట్టి వూరూ, వాకిలీ వదిలి వెళ్లవలసిన అవసరం లేదు. మనలాగే మన మధ్యనే ఉంటూ, తామరాకుపైన నీటిచుక్కగా నిలవటమే జీవిత సాఫల్యం. ఈ జీవన్ముక్తి వివేకమే సర్వగమ్య మోక్షానికి సహజమైన మార్గం.
                                                                           - ఉప్పు రాఘవేంద్రరావు

Sunday 25 August 2013

హీనంగా చూడకు దేన్నీ!


   'కొంచెముండుటెల్ల కొదవ కాదు' అన్నాడు వేమన. పరిమాణం ప్రమాణం కాదు. పొట్టివాళ్లెందరో గట్టివాళ్లు అనిపించుకున్నారు. ఆకారాన్నిబట్టి, ఆస్తిపాస్తులనుబట్టి- మనుషుల ఔన్నత్యాన్ని అంచనా వేయలేం. ఒకప్పుడు భూమిపై రక్కసి బల్లులే రాజ్యమేలాయి. విపరీతమైన దేహపరిమాణంతో లోకంలో ఎదురులేకుండా సంచరించాయి. వాటితో పోలిస్తే తాబేళ్లు అల్పజీవులు. ఒక్క గ్రహశకలం తాకిడితో భువిపై ఉన్న రక్కసి బల్లులన్నీ మట్టిలో కలిసిపోయాయి. కానీ, తమలోకి తామే ముడుచుకుపోయే స్వభావంగల అల్పప్రాణులైన తాబేళ్లు మాత్రం ఆ ధూళి ప్రళయం నుంచి తప్పించుకుని నిక్షేపంగా నేటికీ నడయాడుతున్నాయి.

ప్రపంచంలో ఏ ఇతర జంతువుల కాటువల్ల మరణిస్తున్నవారికన్నా దోమకాటువల్ల ఎక్కువమంది చనిపోతున్నారు. ఆకారాలనుబట్టి మంచి చెడులను బేరీజు వేయలేమని స్పష్టమవుతోంది కదా! సమాజంలోని హీనులను దీనులను మహాత్ములు మరింత ఇష్టపడ్డారు. దీన నారాయణసేవే జీవిత ధ్యేయంగా కాలం గడిపారు. రామకృష్ణ పరమహంస, రమణమహర్షి వంటివారి జీవితాలే ఇందుకు నిదర్శనం.

ప్రాణులన్నింటికీ ముసలితనం తప్పదు. వాళ్లు పనికిరానివాళ్లని, పోషించడం దండగనీ భావించకూడదు. వయసులో వారు చేసిన సేవలు మరువకూడదు. శారీరక శక్తి లేకున్నా, అనుభవాలను పంచిపెట్టగల సమర్థులు వాళ్లు. అపార యుక్తిసంపద వాళ్ల సొత్తు.

ఒక వృద్ధ వృషభం పొరపాటున పాడుబడిన బావిలో పడిపోయింది. వూళ్లోవాళ్లు దాని అరుపులు విని, వచ్చి చూశారు. లోపల ముసలి ఎద్దు మోరచాచి దీనంగా చూస్తూ కనిపించింది. పెద్దపెద్ద మోకుల సాయంతో దాన్ని బయటకు లాగమని యువకులకు ఒక పెద్దాయన సలహా చెప్పాడు. కుర్రవాళ్లు తలా ఒకవిధంగా అన్నారు.

'చావబోయే ముసలి ఎద్దును పైకి తీసి ఏం లాభం? అది చనిపోయిన తరవాత ఎలాగూ మేళతాళాలతో మోసుకుపోయి, పెద్ద గొయ్యి తీసి పూడ్చిపెట్టాలి! ఇప్పుడే ఈ బావిని పూడిస్తే ఆ పని పూర్తవుతుంది గదా' అన్నాడొక యువకుడు. అందరూ పాడుబావిని పూడ్చడం మొదలుపెట్టారు. లోపలున్న ముసలి ఎద్దు తనపై పడిన మట్టిని విదిలించుకుంటూ మట్టిపైకి ఎక్కడం మొదలుపెట్టింది. క్రమంగా బావి గట్టుదాటి బయటపడింది. 'అరే, ఎందుకూ పనికిరాదనుకున్న ముసలెద్దుకు ఎన్ని తెలివితేటలున్నాయి! జీవితంలో ఢక్కామొక్కీలు తిరిగిన ముసలివారి అనుభవ జ్ఞానాన్ని తెలుసుకొంటే ఆపదలనుంచి బయటపడవచ్చు గదా!' అనుకున్నారు యువకులు.

సృష్టిలో పనికిరాని వస్తువేదీ లేదు. ఒకరికి నిష్ప్రయోజనకరమైన వస్తువు ఇంకొకరికి అత్యంత విలువైనది కావచ్చు. తలుపు గొళ్లెం... హారతి పళ్లెం- దేని విలువ దానిదే! చిన్నప్పుడు రాసిన కలాన్ని ప్రాణప్రదంగా జీవితమంతా భద్రపరచుకునే వాళ్లెందరో ఉన్నారు. సీతాదేవి అరణ్యవాసం చేసేటప్పుడు సంచరించిన భూములను, అయోధ్యకు తిరిగివచ్చిన తరవాత కూడా, 'తిరిగి ఒక్కసారి చూసిరావాలి' అని శ్రీరాముణ్ని కోరుకుంటుంది! సంపదలకంటే మధురానుభూతులకే మానవ హృదయం ఎక్కువ స్పందిస్తుంది.


ఒక ధనవంతుడికి సంతానం కలగలేదన్న చింత పీడిస్తూ ఉండేది. పెద్దవయసులో ఆ దంపతుల నోములు ఫలించి ఒక బిడ్డ పుట్టాడు. అయితే అతడు బుద్ధిమాంద్యంతో జన్మించాడు. ఆ వృద్ధ దంపతులు ఒక దాదిని నియమించి ఆ శిశువును అత్యంత ప్రేమతో పెంచారు. దాది తన కన్నకుమారుడిలా బాలుణ్ని పెంచింది. పదేళ్ల ప్రాయంలోనే ఆ బాలుడు స్వర్గస్థుడయ్యాడు. వృద్ధ దంపతులు దిగులుతో మంచంపట్టి మరణించారు. వాళ్ల వీలునామా ప్రకారం ఆస్తిని వేలానికి పెట్టారు. మొదట చనిపోయిన బాలుడి చిత్రపటాన్ని బయటకుతీసి వేలం ప్రారంభించారు. 'పాడు బొమ్మ... ఇదెవరికి కావాలి! భవనం, వస్తువులు, భూములు వేలానికి వచ్చినప్పుడు పాడదాం' అని ఎవరూ చిత్రాన్ని కొనడానికి ముందుకు రాలేదు. అక్కడే నిలుచుని ఉన్న దాది తాను పోగుచేసుకున్న డబ్బంతా ఇచ్చి, ఆప్యాయంగా ఆ బొమ్మను స్వాధీనపరచుకొంది. 'ఈ పనిమనిషికి పిచ్చా? పనికిమాలిన బొమ్మ కొనుక్కుంది!' అని అంతా అవహేళన చేశారు. అప్పుడు- అధికారులు ఒక కవరు తీసి దాని లోపల ఉన్న చీటీని చదివి వినిపించారు. 'మా అబ్బాయి చిత్రపటాన్ని దక్కించుకున్నవారికే మా ఆస్తినంతా స్వాధీనం చేయవలసింది!' అని రాసిఉంది అందులో!
                                                              - డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు 

Saturday 24 August 2013

లోకం ఒక కుక్కతోక!


తడొక బీదవాడు. బీదరికం నుంచి విముక్తి పొందాలన్నది అతడి తీవ్రమైన కోరిక. ఒక భూతాన్ని వశపరచుకొంటే దాని ద్వారా కోరినదంతా తెచ్చుకోవచ్చుననుకొన్నాడు. సమీపంలోని అడవిలో ఆ వశీకరణ మంత్రాన్ని అనుగ్రహించే మహాత్ముడున్నాడని తెలుసుకొని వెళ్లి, అతడి కాళ్లమీద పడ్డాడు. భూతాన్ని వశం చేసుకునే మంత్రాన్ని ఉపదేశించమని బతిమాలాడు. మహాత్ముడు ఆలోచించి 'నీకెందుకయ్యా భూతం? దానితో వ్యవహారం చాలా కష్టం. నీవిప్పుడు సుఖంగా ఉన్నావు. పేదరికంలో మనశ్శాంతి ఉంటుంది. సంపద పెరిగితే తాపత్రయాలు పుట్టుకొస్తాయి. నీవు కష్టాలపాలవుతావు. నెమ్మదిగా ఇంటికెళ్లు' అన్నాడు.

బీదవాడు వినలేదు. అతడి దైన్యాన్ని గమనించి మహాత్ముడు 'నేను చెప్పిన మంత్రాన్ని ప్రతిదినం ఉదయం జపించు. భూతం నీ వశమవుతుంది. నీవు చెప్పిన పనులన్నీ చేస్తుంది. కానీ జాగ్రత్త... భూతం చాలా భయంకరమైనది. దానికి సదా పని కల్పిస్తుండాలి. తగినంత పని కల్పించకపోతే అది నీ ప్రాణాలు తీస్తుంది' అన్నాడు. బీదవాడు ఉబ్బితబ్బిబ్బయ్యాడు.

'స్వామీ, తమ సూచన మేరకు కావలసినంత పని కల్పిస్తాను' అంటూ కొన్ని రోజులు శ్రద్ధగా మంత్రాన్ని జపించాడు. వారం రోజుల తరవాత పెద్ద భూతం ప్రత్యక్షమైంది.

'ఇదో వచ్చాను. నీ మంత్రంతో నన్ను వశపరచుకొన్నావు. ఇకమీద, నాకు ఎప్పుడూ ఏదో ఒక పని కల్పించి తీరాలి. పని చెప్పకపోయావో నిన్ను చంపేస్తాను' అన్నది.

'అయితే నాకో రాజ భవనం కట్టించు' అన్నాడు. తన మనసులో భూతానికి పెద్దపనే కల్పించాననుకొన్నాడా బీదవాడు. రాజభవనం నిర్మించడానికి చాలాకాలం పడుతుందిలే అనుకొన్నాడు. చూస్తుండగానే రాజభవనం, ఉద్యానవనం అన్నీ తయారయ్యాయి. 'మరేం చేయాలో చెప్పు' అన్నది భూతం.

'సమీపంలోని అడవిని కూల్చి ఒక మహా నగరాన్ని నిర్మించు' అన్నాడు బీదవాడికేమీ తోచక. నగర నిర్మాణం కొన్నేళ్లు పడుతుందనుకొన్నాడు. భూతం కొన్ని నిమిషాల్లోనే అద్భుతమైన నగరాన్ని సృష్టించింది.

బీదవాడు వణికిపోయాడు. మరేం పని చెప్పాలో పాలు పోలేదు. దిక్కుతోచక నేరుగా మహాత్ముడి వద్దకు వెళ్లాడు. 'స్వామీ, నన్ను కాపాడండి' అంటూ ఏడ్వసాగాడు. 'ఎంత కష్టమైన పని చెప్పినా క్షణాల్లో పూర్తిచేస్తుంది. పని చెప్పమంటుంది. నేను ఏమీ చెప్పలేకున్నాను. స్వామీ నన్ను కాపాడండి' అని పాదాలపై పడ్డాడు. ఆయన- 'అయితే, ఆ కుక్కను పట్టుకో. దాన్ని తీసుకెళ్లి దాని తోకను నిటారుగా ఉంచమని చెప్పు' అన్నాడు మహాత్ముడు.

బీదవాడు ధైర్యంగా ఆ కుక్కను పట్టుకెళ్లి భూతం చేతికిచ్చాడు. 'వెంటనే ఈ కుక్క తోకను నిటారుగా చెయ్యి' అన్నాడు. భూతం 'ఇదేం పెద్దపని!' అంటూ కుక్క తోకను తన రెండు చేతులతో నిలబెట్టి చేతులు తీయగానే వంకర! భూతం ఎన్నిసార్లు యత్నించినా ఏం లాభం, మళ్ళీ వంకరే! వారం రోజులు చేసినా సాధ్యం కాలేదు. బీదవాడి దగ్గరకు వెళ్లి, 'ఈ కుక్క తోకను నిటారుగా పెట్టించే పని మాన్పించు, నేను నిర్మించిన వాటినన్నింటినీ నీకే అప్పగిస్తాను. నిన్ను చంపనని ప్రమాణం చేస్తాను' అన్నదా భూతం.

బీదవాడు సమ్మతించాడు. బతికాను అంటూ భూతం కాళ్లకు బుద్ధి చెప్పింది. బీదవాడు మహాత్ముడి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి తన రాజమందిరం చేరాడు.

ఈ కథను స్వామి వివేకానందులు తమ కర్మయోగంలో చెప్పారు. ఈ ప్రపంచాన్ని దిద్దడానికి మనం యత్నించరాదు. మనకొక ప్రయోజనం ఉంది. ముందు మనసును స్థిరంగా ఉంచుకోవాలి. దాని వంకర పోతుంది. స్థిరమైన మనసుతో మంచి పనులు చేపట్టాలి. అప్పుడే మనసుకు శాంతి లభిస్తుంది. లోకం సుఖంగా ఉండగలదు. 'మనసు మర్మమెరిగినవాడె ఘనుడు' అన్నారు త్యాగరాజస్వామి.
                                                         - డాక్టర్‌ జానమద్ది హనుమచ్ఛాస్త్రి 

Friday 23 August 2013

ప్రవర్తన


మంచి ప్రవర్తనం, మంచి ఆలోచనం, నిశ్చలమైన మనసు మనల్ని సన్మార్గంలో పయనింపజేస్తాయి. ఎల్లప్పుడూ ఆనందాన్నిస్తాయి. మన సదాలోచనలు బలాన్ని, ధైర్యాన్ని చేకూరుస్తాయి. మంచి వర్తనం వల్ల మితంగా, మృదువుగా మధురంగా మాట్లాడటం అలవడుతుంది. మృదు భాషణం మనపట్ల గౌరవం పెంచుతుంది. నిజం చెప్పడం, రుజుమార్గంలో పయనించడం అవసరం. నిజం చెబితే నిష్ఠురం అనుకోవచ్చు. నేటి పరిస్థితులు అలాగే ఉన్నాయి. కొన్నాళ్లకు వాస్తవం తెలిశాక నిష్ఠురం సామెత మటుమాయం అవుతుంది. దైవాన్ని నమ్మడం వల్ల, పాపభీతితో నిజాయతీ అలవడి మనల్ని మంచిమార్గంలో నడిపిస్తుంది. మన సత్‌ ప్రవర్తనం ఇతరుల్లో ఆనందనర్తనం చేయించాలి.

పరమశివుడు జటలు ముడివేసుకుంటాడు. ఆ జటలు విప్పుకోవాలంటే మొదలు తుది తెలియవు. అందుకే జటిలసమస్య అనే మాట ఉద్భవించింది. జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి జటిల సమస్యా మనకు ఓ గుణపాఠం నేర్పుతుంది. ఆ పాఠం నేర్చుకుంటే ఇతరులకు నేర్పవచ్చు. మాన్యులైన పెద్దల సలహాలనూ సూచనలనూ సామాన్యులమైన మనం పాటించడం అలవరచుకోవాలి. ఉపన్యాసాలు దంచడం కాదు. అవి ఆచరించి చూపగలగాలి.

ఒక పావురాన్ని డేగ వెంటాడుతుంటే- ఆ పావురం శిబి చక్రవర్తిని ఆశ్రయించి శరణు కోరుతుంది. ఆ పావురం బరువు ఎంత తూగుతుందో, అంత మాంసాన్నీ తన శరీర భాగంలోంచి కోసి ఇస్తానంటాడు శిబి చక్రవర్తి. అంతేకానీ, శరణు కోరిన పావురాన్ని విడిచిపెట్టనంటాడు. పావురాన్ని కాటాలో వేస్తే అదే ఎక్కువ బరువు తూగుతుంది. చివరకు తానే వెళ్లి కాటాలో కూర్చుంటాడు. అంతటి త్యాగశీలి, దానశీలి శిబి. ఆ 'శిబి' చక్రవర్తిని బట్టే నేడు రక్తదాన 'శిబి'రాలు ఏర్పడ్డాయి. ఇప్పుడవి విజయవంతంగా సాగుతున్నాయి. మనం ఇచ్చే దానాలు అంత గొప్పవి కాకపోయినా అటువంటి పురాణ గాథలు మనకు స్ఫూర్తినిస్తాయి. మన ఆదాయంలో ఎంతోకొంత దీన జనోద్ధరణకీ, జీర్ణ దేవాలయాల సముద్ధరణకీ ఖర్చుపెట్టాలి.

ఏదైనా నదికి కాని, చెరువుకి కాని ఉన్న ఒడ్డును కూలం అంటారు. మనం ఈవలి ఒడ్డున ఉండటం అను'కూలం'; ఆవలి ఒడ్డున ఉండటం ప్రతి'కూలం'. మనం సంఘజీవులం కనుక అందరితోనూ అను కూలంగా ఉండాలి. మన ప్రవర్తనం అలా ఉండాలి. మనకు ప్రతికూలంగా ఉన్నవారు ఎటువంటి దుష్టపదజాలాన్ని ప్రయోగించినా, మనం ఆ 'జాలం'లో పడక, ఆవేశం చెందక, శిష్టపదజాలంతోనే సమాధానం చెప్పాలి. అప్పుడు వారే తమ ధోరణి మార్చుకుంటారు. మన నడవడిలో 'వడి' తగ్గాలి. మన తరవాతి తరానికి ఒరవడి కావాలి!                                                                                                                                   - బులుసు-జీ-ప్రకాష్‌ 

Thursday 22 August 2013

సర్వవ్యాపక దైవం


ప్రపంచమంతటా పరమాత్మ పరివ్యాప్తమై ఉన్నాడని ఈశావాస్యోపనిషత్‌ చెబుతుంది. విచిత్రమేమిటంటే ఆ పరాత్పరుని చూసే శక్తి మన ఇంద్రియాలకు ఏమాత్రం లేదు. అనంత రూపాలు, నామాలు కనిపిస్తాయి కానీ ఆయన దివ్య సాన్నిధ్యం అనుభూతికి రాదు.

భగవంతుడి సర్వజ్ఞత్వాన్ని, సర్వశక్తిని, సర్వవ్యాపకత్వాన్ని ఆయన యోగమాయా మహత్యం దాచిపెడుతుంది. భగవంతుడి గొప్పతనాన్ని తెలుసుకున్న వారికి సైతం ఆయన వ్యక్తంకాడు. ఆయన్ని కళ్లారా తిలకించాలంటే సాధన కావాలి. అదృష్టం ఉండాలి. ఆయన కారుణ్యం కావాలి. భగవంతుడి దర్శనానికి సాధన ఒక సుదీర్ఘ ప్రస్థానం. అది కష్టసాధ్యమని అనుకుంటే భగవంతుడు ఈ ప్రకృతిలో దొరకడు. ఎన్ని యుగాలైనా సాధనచేస్తే తప్పక కనిపిస్తాడన్న ఉత్సాహం ఉండాలి. కష్టసాధ్యమైన ఆవిష్కరణలు ఎన్నో మనిషి ఈ జన్మలోనే సాధిస్తున్నాడు.

మన ఇంద్రియాలు, మనసు, మేధ ప్రాపంచిక వస్తువులను, అందచందాలను జీవితకాలమంతా చూసినా ఆ తృప్తికి అంతు ఉండదు. వీనులకు మధుర ధ్వనులు వినిపిస్తుంటాయి. కళ్లు ప్రాపంచిక సౌందర్యాలను తనివితీరా చూస్తుంటాయి. ఈ అనంత విశ్వం అనంత మనోజ్ఞత్వం మనసును పరవశింపజేస్తుంది. ప్రపంచంలో అంతులేని బంధాలు ఏర్పరచుకుంటాం. ప్రాణికోటికి అతీతంగా, వస్తువులకు ఆవల దివ్యసాన్నిధ్యాన్ని చూసే శక్తి జ్ఞానం ద్వారా లభిస్తుంది. ఈ విశ్వమంతా భగవంతుడి దివ్య లీలా ప్రాభవంగా జ్ఞానికి గోచరిస్తుంది. ఇంద్రియాలకు అంతులేని తృప్తి ఉన్నట్లు, ఆత్మకు అంతులేని ఆనందం ఉంది. అదే దైవం.

ఈ లోకంలో అవతార మూర్తులు, సాధువులు, పుణ్యపురుషులు ఉన్నారు. వారు ఎప్పుడూ ఉంటారు. కొందరి దృష్టిలో కుహనా అవతారులు, దొంగ సాధువులు కనిపిస్తుంటారు. భక్తులు అవతారాలుగా వారిని ఆరాధిస్తుంటే, వారి తెర వెనుక 'లీలలు' ఆరా తీస్తుంటారు కొందరు. భగవంతుడు అంతటా ఉన్నప్పుడు కొందరు భావిస్తున్నట్లు కుహనా అవతారాల్లో కూడా ఆయన ప్రకాశిస్తూనే ఉంటాడు. వాల్మీకి దొంగగా, వేటగాడిగా ఉన్నప్పుడు సైతం రాముడు ఆయనలో శోభిల్లుతున్నాడు. వాల్మీకి తపస్సువల్ల రాముడు మరింత స్పష్టంగా, పూర్ణంగా కనిపించాడు. స్త్రీ వ్యామోహంవల్ల రావణాసురుడు శివభక్తి తత్పరుడు కాకుండా పోయాడా?

భగవంతుడు ఆయా ఉపాధులకు తగినట్లు, అంతంతమాత్రంగా జీవుల్లో అదృశ్యుడై ఉంటాడు. పూర్ణ అవతార స్వరూపంలో ఆయన నిండుగా ప్రకాశిస్తాడు. యుగానికి ఒక్కడిగా, ఒక రాముడిగా, ఒక కృష్ణుడిగా, ఒక బుద్ధుడిగా మనకు దర్శనమిస్తుంటాడు.

ఒక రాజు ఉండేవాడు. ఆయన సాధువుల్లో తేడాలు చూడకుండా, అందరినీ మంచివారిగానే తలచి గౌరవించేవాడు. మంత్రి మాత్రం ఒక మంత్రగాడు రోడ్డుపై ఇంద్రజాల విద్యలను ప్రదర్శించడం గమనించాడు. అతడు దొంగ సాధువు అని మంత్రికి తెలుసు. కానీ, ఆ సాధువు రాజునుంచి బహుమతి అందుకొన్నాడు. మంత్రి రాజును నమ్మించడానికి సాధువు చేసే ఇంద్రజాల విద్యల్ని చూపించాడు. రాజుమాత్రం నిశ్చలంగా ఉండి- 'ఈ దొంగ సాధువులో కూడా నాకు భగవంతుడి దివ్య సాన్నిధ్యం కనిపిస్తోంది' అన్నాడు. అతిలోక రమణీయమైన గులాబీ పువ్వులోనూ, ఎవరూ గమనించని గడ్డిపువ్వులోనూ, గడ్డిపరకలోనూ భగవంతుడు ఒదిగి ఉన్నాడు. కంటికి కానరాని తొలి జీవి అమీబాలో దైవత్వం లేకపోతే, అద్భుతావహమైన పరిణామం జరిగి మానవుడు ఈ మట్టిలో పుట్టి ఉండేవాడు కాడు!
                                                                                         - కె.యజ్ఞన్న 

Wednesday 21 August 2013

దైవాన్వేషణ


దైవాన్ని అన్వేషించాలా? అన్వేషణ అన్వేషణ అంటారు. ఎంతవరకు అది సరైన మాట? దొరకనిది వెదుక్కోవాలి, పట్టుకోవాలి. సంతోషించాలి. దైవం దొరకడా, అంతదూరాన ఉంటాడా, ఎక్కడ ఉంటాడు? కొండపైన, లోయలోన, ఆకాశం అంచున, సముద్రంలో దాక్కుని ఉంటాడా? మన శక్తి సరిపోతుందా ఆయనను వెదకడానికి? ఒక వస్తువో, మనిషో అయితే ఎవరో ఒకరు వెదికి సంపాదించుకుంటారు. అందరిలో ఉంటాడంటారు. అంతటా ఉంటాడంటారు. ఆయనను వెదుక్కోవాలా? దొరికాడు అని అరిచి లోకానికి చెప్పుకోవాలా? విడ్డూరంగా ఉంది కదూ. వింతగా అనిపిస్తోంది కదూ. మన మాటలు కోటలు దాటతాయి. మన ఆలోచనలు గాలిలో ఎగురుతుంటాయి. వాస్తవం భిన్నంగా ఉంటుంది. 

 సరే. ఒక శుభముహుర్తాన దేవుణ్ని వెదకడం మొదలుపెట్టాం. మనం వెదికే సమయానికి ఆయన మనకు చేరువలో ఉంటాడా, దూరంగా ఉంటాడా? అసలు ఈ అన్వేషణ ఎందుకు? ఆయనకు తెలియకుండా చేసేబదులు, చెప్పి చేస్తే మంచిది కదా. సరే చెప్పడం మొదలు పెడదాం. ఎలా? దేవుడికి చెప్పటం అంటే ఏమిటి? ప్రార్థన చెయ్యడమే కదా. నేను వెదుకుతున్నాను... నువ్వు దొరుకు అని చెప్పాలా? నన్ను పెద్ద కష్టపెట్టకుండా నాకు కనిపించు అనా? వెదుక్కో వెదుక్కో అని ఎందరో చెప్పారు, అందుకే వెదుకుతున్నాను. నాకు కూడా ఆ భాగ్యం కలిగించమనా? ఏదో ఒకటి, మన మనసు ఎలా ప్రేరణ కలిగిస్తే అలా.

ఇప్పుడు మొదలుపెడదాం అన్వేషణ. దేవుడికి చెప్పుకొన్నాం కదా. భక్తులెందరికో పట్టుబడినట్లు మనకీ పట్టుబడతాడని అనుకుందాం. ఈ అన్వేషణలో ఎన్నో అడ్డంకులు. చెట్టు, పుట్ట, పాము, పక్షి కనబడినట్లు ఆయన కనపడటం లేదు. మరి ఎలా కనిపిస్తాడు? దేవుడికి ఒక రూపం ఉంటుందా? ఉంది కదా. ఇంతకుముందు కనిపించాడు కదా. త్రేతాయుగంలో రాముడిగా, ద్వాపరయుగంలో కృష్ణుడిగా... ఇంకా ఇంకా ఎన్నో రూపాల్లో కనిపించాడు కదా. ఆయనకు ఇష్టమైన రూపంలో ఎలా బాగుంటే అలాగే కనపడనీ. కానీ, గుర్తుపట్టడం ఎలా? ఇంతకు ముందు చూసినవాణ్ని, అలాగే కనిపిస్తే గుర్తుపట్టొచ్చు. కానీ రూపం మార్చుకుని ఏ బిచ్చగాడిగానో, మరోలాగానో కనిపించడు కదా. ఆయనకు ఇష్టమైన రూపంలో ఎలా బాగుంటే అలాగే కనిపిస్తే మనకు సాధ్యమవుతుందా ఆయనను గుర్తించడం? పెద్దచిక్కే... ఎలా? అన్వేషణ అయితే మొదలుపెట్టేశాం. ఎన్నో సందేహలు... ఇవన్నీ ఎవరు తీరుస్తారు?

తెలిసినవాళ్లని అడగాలి. దేవుణ్ని చూసినవాడిని కలుసుకోవాలి. ఆయనముందు మన గోడు విన్నవించుకోవాలి. కథ మళ్ళీ మొదటికొచ్చినట్లుంది. మనకు మనం ఈ అన్వేషణ మొదలుపెడితే ముందుకు సాగడం కష్టమే. ఆ దేవుణ్ని సాక్షాత్కరించుకున్నవాడిని కలుసుకోవాలి. ఇంతకీ ఆయనెక్కడుంటాడు? దేవుణ్ని చూసినవాడు అంత సులువుగా మనకు దొరుకుతాడా? ఏం చెయ్యాలి! ఎలా ఈయన్నీ ప్రసన్నం చేసుకోవాలి? అసలు మనకు ఎందుకు ఆయన దర్శనం ఇస్తాడు? మనం ఆయనకు చేసింది ఏమిటి? ఏమీ లేదు. మరి ఆయనెందుకు సహాయపడతాడు? అన్వేషణ ఉత్సాహం తప్ప మనదగ్గర ఏం లేదు. దేవుణ్ని వెదుక్కోవాలి అన్న ఆరాటం తప్ప మరేం లేదు. దేవుణ్ని పట్టుకుని- 'ఏమయ్యా? ఇంతకాలం ఎందుకు దాక్కుని ఉన్నావు?' అని నిలదియ్యాలనే ఆవేశం తప్ప... ఇంకేం లేదు.

దేవుణ్ని చూసినవాళ్లు ఎలా ఉంటారు, మనలాగే ఉంటారా? మనలాగే తింటారా, మనలాగే నిద్రపోతారా, రాగద్వేషాలు మనలాగే ఉంటాయా? వాళ్లలో ఏం మార్పులు ఉంటాయి. వాళ్లను ఎలా గుర్తుపట్టడం?

దైవాన్వేషణలో కూడా దైవాన్ని చూడాలంటే ముందు వివేకం అనే చూపు కావాలి. ఆ వివేకం ఎలా వస్తుంది? జ్ఞానం వల్ల. ఆ జ్ఞానం ఎలా వస్తుంది? అది ఎవరిదగ్గర ఉందో వాళ్లవల్ల. వాళ్లు మనకు ఆ జ్ఞానం ఇస్తారా? తప్పకుండా. శ్రీకృష్ణుడు ఆ చూపే ఇచ్చి అర్జునుడిలో ఉన్న విషాదాన్ని తొలగించి, విశ్వరూప దర్శనం ఇచ్చి కార్యోన్ముఖుణ్ని చేశాడు. చూపు లేకపోతే ఏమవుతుంది? అంధకారంలో తిరుగుతాం. జ్ఞానం లేకపోతే ఏమవుతుంది? దైవాన్వేషణకు దారి దొరకదు. అంటే... ఇంతేనా? జీవితమంతా పశుతుల్య జీవనం గడపాల్సిందేనా? జన్మజన్మలు ఇలా వృథా అయి పోవాల్సిందేనా... అని కన్నీరు విడిచి, తపించి తపించి తల్లడిల్లిపోతుంటే- ముందుకు వస్తాడు. ఎవరు? భగవంతుడు కాదు. మానవ రూపంలోనే గురువు. అక్కడితో మన అన్వేషణ ఫలించినట్లే. ఆనందం అవధులు దాటినట్లే.
                                                                           - ఆనందసాయి స్వామి 

Tuesday 20 August 2013

శ్రావణ పూర్ణిమ


ర్షంతో సర్వత్రా హర్షం వెల్లివిరిసే తరుణం. మేఘమాలికలు బారులుతీరి మురిపించే సమయం. ప్రకృతి సస్యశ్యామలమై పులకరింతలతో పరిఢవిల్లే కాలం... అదే ఈ వర్ష రుతువులో అడుగడుగునా పర్వదినాలతో శోభిల్లే శ్రావణమాసం. స్థితి కారకుడైన విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణం. ఈ నక్షత్రం పూర్ణిమనాటి చంద్రునితో కూడిన మాసం కనుక శ్రావణమని ప్రఖ్యాతి చెందింది. మన సంస్కృతీ సంప్రదాయాల్ని శ్రావణమాసంలోని పండుగలు విశేషంగా ప్రతిఫలిస్తాయి. ఆ పరంపరలోనిదే శ్రావణపూర్ణిమ. సౌభ్రాతృత్వం, సామరస్యం, సహజీవన మాధుర్యం, సౌమనస్యాలకు ఈ పర్వదినం ప్రతీక. కలిమిలేములకు, వర్గ విచక్షణలతో సంబంధం లేకుండా ఆసేతు హిమాచలం ఆనందోత్సాహాలతో దీన్ని నిర్వహించుకుంటారు. భారతీయ కుటుంబ బాంధవ్యాల్లోని మధురిమలకు ఇది ప్రతిబింబం. సోదర సోదరీమణుల ప్రేమానుబంధానికి చిహ్నం రక్షాబంధన ఉత్సవం. శ్రావణ పూర్ణిమనే రక్షికా పూర్ణిమ, జంధ్యాల పున్నమి, రాఖీపూర్ణిమ, నూలిపున్నమి, నారికేళ పున్నమి అనే పేర్లతోనూ వ్యవహరిస్తారు.

ప్రాచీన భారతీయ విద్యావిధానంలో అధ్యయన ప్రక్రియ శ్రావణ మాసంలోనే ప్రారంభమయ్యేది. వేదాధ్యయనానికి బ్రహ్మోపదేశం తప్పనిసరి అని చెబుతారు. బ్రహ్మోపదేశ స్వీకరణకు సూచికగా యజ్ఞోపవీత ధారణ చేస్తారు. గురుకులాల్లో విద్యార్థులు వేదపాఠం మొదలయ్యేముందు చేపట్టే సంవిధానాన్ని 'శ్రావణి' అంటారు. ఆ శ్రావణిలో భాగంగా దీక్షాకంకణాన్ని రక్షాబంధనం పేరిట ధరించే సంప్రదాయం ఏర్పడింది. కాలక్రమంలో రక్షకట్టుకోవడం ధార్మికపరమైన చర్యగా స్థిరపడింది. సమాజంలో కుటుంబ విలువలకు, సంస్కృతీ సంప్రదాయాలకు విఘాతం వాటిల్లినప్పుడు ఒకరికొకరు రక్షకులమై ఉంటామని చాటిచెప్పేదే రక్షాబంధనం. పరస్పర రక్షణ ద్వారా సమాజ పరిరక్షణ ఏర్పడుతుంది. దీనిద్వారా ధర్మరక్షణ సాకారమవుతుందని ఈ రక్షికా పూర్ణిమ సందేశమిస్తుంది.

భవిష్య పురాణంలో రక్షాబంధన ప్రాశస్త్యం వివరంగా ఉంది. ధర్మరాజుకు శ్రీకృష్ణుడు దీని విశేషాన్ని వెల్లడించినట్టు పురాణం పేర్కొంటోంది. మహాతేజోవంతుడు, దానశీలుడు, రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని దేవతల అభీష్టం మేరకు శ్రీహరి తన శక్తితో బంధించాడంటారు. 'నా శక్తిని రక్షాబంధన రూపంలో నిన్ను చుట్టుముడుతూ బంధిస్తుంది. ఈ బంధం నిన్ను ఎల్లవేళలా రక్షిస్తుంది. ఇది నీకు స్థిరత్వాన్ని కలిగిస్తుంది' - అని బలిచక్రవర్తికి విష్ణుమూర్తి అభయాన్ని ప్రసాదించినట్టు పురాణోక్తి. శ్రావణ పూర్ణిమనాడు లక్ష్మీనారాయణుల ఆరాధనం విశేష ఫలితాల్ని అందిస్తుందని ధర్మసింధు చెబుతోంది.

మరాఠాయోధుడైన ఛత్రపతి శివాజీ- భవానీదేవి కృపానుగ్రహంవల్ల ఖడ్గాన్ని, దానితోపాటు రక్షాకంకణాన్ని స్వీకరించాడంటారు. వీటిద్వారా శివాజీ మహరాజ్‌ ఎన్నో విజయాలందుకున్నాడని ప్రతీతి. మొగలాయీ పాలకులు ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించే తరుణంలో రాజపుత్ర వనితలు తమ ఆత్మాభిమానంకోసం, మాన సంరక్షణకోసం ఈ రక్షాబంధన ఆచారానికి విశేష ప్రచారం కల్పించారంటారు. శ్రావణ పూర్ణిమని పాల్కురికి సోమనాథుడు 'నూలి పున్నమి'గా పేర్కొన్నాడు. నూలుతో వడికిన జంధ్యాల్ని మంత్రపూర్వకంగా ధరించడం ఈ పున్నమి ప్రత్యేకత. ఈ పూర్ణిమనాడే కొత్తగా ఉపనయనం అయినవారికి ఉపాకర్మను నిర్వహిస్తారు. కర్ణాటకలో ఈ పర్వదినాన్ని నారికేళ పున్నమిగా జరుపుకొంటారు. సముద్రానికి గోక్షీరం, ఫలపుష్పాలు, కొబ్బరికాయల్ని నివేదిస్తారు. జలసిరుల్ని కురిపించే సముద్రుడికి కృతజ్ఞతలు చెప్పడమే ఈ ప్రక్రియలోని ఆంతర్యం.

శ్రావణ పూర్ణిమనే హయగ్రీవ జయంతిగా వ్యవహరిస్తారు. వేదాపహారియైన రాక్షసుణ్ని హయ(గుర్రం) వదనంతో మూర్తీభవించిన హయగ్రీవుడు సంహరించాడంటారు. వేదోద్ధారకుడైన హయగ్రీవుడు సర్వవిద్యలకు ఆధారభూతుడు. లౌకిక పారమార్థిక విద్యలు సిద్ధించేందుకు హయగ్రీవార్చన దోహదపడుతుందంటారు. అందుకే హయగ్రీవ స్వామి స్తుతితోనే అమరకోశం ఆరంభమవుతుంది. సంస్కృత భాషా దినోత్సవంగానూ శ్రావణ పూర్ణిమ విఖ్యాతి పొందింది. సామాజిక, లౌకిక, ఆధ్యాత్మిక, పారమార్థిక, ప్రాకృతిక, చారిత్రక అంశాలు ఎన్నో శ్రావణ పూర్ణిమతో ముడివడి ఉన్నాయి. సంప్రదాయాలు, ఆచారాలేవైనా దేశవ్యాప్తంగా నిర్వహించుకునే రాఖీపూర్ణిమ వేడుక భిన్నత్వంలో ఏకత్వానికి సంకేతమై నిలుస్తోంది. విశేషపర్వదినమై వెలుగుతోంది.
                                                                - డాక్టర్‌ కావూరి రాజేశ్‌పటేల్‌

Monday 19 August 2013

జీవితం


  మనిషి ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ బతకడానికే ఇష్టపడతాడు. ఆ మాటకొస్తే ప్రతి ప్రాణీ అంతే! యాచక వృత్తి చేపట్టవలసి వచ్చినా అందులోనూ ఆనంద మకరందాన్ని ఒడిసిపట్టుకునే ప్రయత్నం చేస్తాడు మనిషి. జీవితం అన్న మూడక్షరాల పదం విభిన్న రుచుల మేళవింపు. ఒకరికది మధురం... మరొకరికి జీవితం ఓ పీడకల. ఇంకొకరికి అతి సామాన్యం. ఎందరికో అది దాట శక్యం కాని వైతరణి. అందనంత ఎత్తులకు ఎదిగినది మాత్రమే జీవితం కాదు. ఓ యాచకుడిది, ఓ భయానక దీర్ఘ రోగిదీ సైతం జీవితమే! ఓ దేహధారిగా అమ్మ కడుపు నుంచి బయటపడ్డాక మనిషి జీవయాత్ర ప్రారంభమవుతుంది. బాల్యంలో తల్లిదండ్రుల వాత్సల్యామృత ధారలో, యౌవనంలో భాగస్వామి ప్రేమైక జీవన సాహచర్యంలో, వృద్ధాప్యంలో కన్నబిడ్డల సంరక్షణలో గడుస్తుంది.

చాలీచాలని బతుకులు గడిపే సమయంలో ఎన్నో ప్రలోభాల విషవలయాలు చుట్టుముడతాయి. నేర్పుతో, ఓర్పుతో ఆ చక్రవ్యూహాల్ని ఛేదించుకు పోగలిగితే సరి! లేకపోతే పద్మవ్యూహాన్ని దాటి రాలేని అభిమన్యుడి అనుభవమే ఎదురవుతుంది. యోగ విద్య వల్ల మనిషి దీర్ఘాయువు, ఆనందమయ జీవితం సాధించగలడేమో కానీ- ధనం, అది సమకూర్చే సౌకర్యాల వల్లకాదు. దేహం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనసూ ఆరోగ్యవంతమవుతుంది. అందుకు అనుగుణంగానే ఆలోచనా సరళి ఉంటుంది. ఆలోచనలు సక్రమంగా సాగినప్పుడు ఇహంలోని అనేక సామాజిక రుగ్మతలకు ఔషధం దొరికినట్లే. సోమరిగా ఉంటూ మనసును పిశాచాలకు నెలవు చేసినప్పుడు ఉగ్రవాదం, తీవ్రవాదం, ఆర్థిక సామాజిక నేరాలు సహజంగానే పుట్టుకొస్తాయి.

మనిషి ప్రవర్తన వల్ల తన జీవితకాలాన్ని తానే నిర్దేశించుకుంటాడు. ఏం తినాలి, ఎలా జీవించాలి, ఏ క్రమశిక్షణ తాను గమ్యం చేరడానికి ఉపకరిస్తుంది, తన ధనం తనకు నిజంగా మేలు చేస్తుందా, తన గురించి పొరుగువారు ఏమనుకుంటారు? ఈ ఆలోచన చేసిన నాడు తన పోకడలో లోపం ఉంటే మనిషి సరిదిద్దుకునే వీలు కలుగుతుంది. సమాజానికి చీడపురుగులా తయారైన మానవుడు తన పతనం తానే కొనితెచ్చుకుంటాడు. అందరూ మహాత్ములు కాలే రు. అందరూ కొంగొత్త జీవిత ఆవిష్కరణలు చేయలేరు. నిజానికి అందరూ అందనంత ఎత్తులకు ఎదగగలిగే అవకాశమూ రాదు. మహాత్ములు ఏర్పరచిన బాటలో తమ గమ్యాన్ని నిర్దేశించుకున్న సాధకులు ధన్యులు. సాధనలో కృతకృత్యులైన సామాన్యులూ శ్రేష్ఠతములే!

'జీవితం మనిషికి ఒక్కసారే లభిస్తుంది. సరిగ్గా మలచుకుంటే నిజానికి ఈ ఒక్క జన్మచాలు, సార్థకత పొందవచ్చు!' అంటుంది 'మీ వెస్ట్‌' అనే పాశ్చాత్య కళాకారిణి.

'చాలామంది పేరుకు జీవిస్తారు. కొందరు మాత్రమే జీవితాన్ని జీవితంలా జీవించడంలో సఫలీకృతులవుతా'రన్నది ఆస్కార్‌ వైల్డ్‌ అభిప్రాయం.

మానవజీవితం జీవనదీ ప్రవాహంలాంటిది. ఆ ప్రవాహలక్ష్యం సాగర సంగమమైనట్లు, మానవ జీవిత ఏకైక లక్ష్యం మోక్షం కావాలంటాడు విదురుడు. సూర్యోదయ సూర్యాస్తమయాలు ప్రతి జీవితానికీ ఆద్యంతాలు ఉంటాయని హెచ్చరిస్తాయి. అల్పాయుష్కుడైన మనిషి తాను జీవించి ఉన్న కొద్దికాలంలో తన బతుకు ఎవరికీ భారం కాకుండా మంచిని పూయించి జీవన మకరందాన్ని పొంది ఆనందించే ప్రయత్నం చేయాలి. పదుగురికీ ఆదర్శప్రాయంగా జీవించగలిగినప్పుడే మానవ జీవితం సార్థకమవుతుంది.                                                                       - గోపాలుని రఘుపతిరావు

Sunday 18 August 2013

ముహూర్త భేదాలు


   కార్యసాధకుడికి మనోనిశ్చయమే ప్రధానం. శుభాశుభ ముహూర్తాల విచారణ అవసరం లేదు. ఈ దేహం పతనమవుతున్నా సరే, మనోనిశ్చయంతో కార్యాన్ని సాధించాలన్నది తైత్తరీయోపనిషత్‌ సందేశం. కార్యం పవిత్రమైనదే అయితే ఆ కార్యసాధకుడు ముహూర్తబలం కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదని మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో అంటాడు.

రాయబారానికి వెళుతున్న శ్రీకృష్ణునితో ప్రయాణానికి ముహూర్తం బాగాలేదని పాండవులు సూచిస్తే... 'అయిననూ పోయి రావలె హస్తినకు' అంటాడు కృష్ణుడు. మనం తలపెట్టిన కార్యం స్వప్రయోజనానికి కాకుండా సమాజానికి అవసరమైనదైతే చాలు- అలాంటి కార్యాన్ని ఎప్పుడు ప్రారంభించినా అదే సుముహూర్తమవుతుంది.

కాలం అనేది ప్రాపంచికమైనది. కాలానుగుణంగా తిథి వార నక్షత్రాలు మారుతుంటాయి. పరంలో కాలమనేదే లేదు. ఇహ పరాల్లోని అన్నీ బ్రహ్మమేనని ఉపనిషత్తులు చెబుతున్నాయి. కాలం సైతం బ్రహ్మమే కనుక సుముహూర్తమనీ, దుర్ముహూర్తమనీ భేదాలు లేవు. యద్భావం తద్భవతి అన్నట్లుగా భావాన్ని అనుసరించి మాత్రమే కాలం మనకు గోచరమవుతుంది.

కర్రతో గుర్రం వంటి ఆకారాన్ని తయారుచేసి ఉంచారనుకుందాం. కొంతదూరం నుంచి గమనించినవారికి అది నిజమైన గుర్రంగానే కనిపిస్తుంది. ఆ సమయంలో మన దృష్టికి కర్ర కనబడదు. కర్ర అనే పదార్థం గుర్రం ఆకారంలో లీనమై ఉంటుంది. మనం దగ్గరకు వెళ్లి చూశామనుకోండి. అప్పుడు ఆ ఆకారం మొత్తం కర్రమయమై కనిపిస్తుంది. అంతవరకు కనిపించిన గుర్రం ఆ కర్రలో లీనమైపోతుంది. అదేవిధంగా ఈ భూమిపైన కాలంలో సుముహూర్తం దుర్ముహూర్తంగా కనపడినా, నిశితంగా గమనిస్తే కాలం యావత్తు బ్రహ్మమయమై ఉంటుంది. అలాంటప్పుడు చెడు, మంచి ముహూర్తాలెక్కడివి?

కాల గమనాలన్నీ కాల్పనికాలేనని యముడు నచికేతుడికి చెప్పినట్లుగా కఠోపనిషత్తులో ఉంది. అటువంటి వాక్కుల నేపథ్యంలో తిథి, వార, నక్షత్రాల్లో మంచివి కొన్ని, చెడువి కొన్ని ఉంటాయని ఎలా చెప్పగలం?

జరాసంధుడి వధను లక్షించి శ్రీకృష్ణుడు, భీముడు, అర్జునుడు బ్రాహ్మణుల వేషంలో మగధకు బయలుదేరతారు. మగధలో అడుగు పెట్టేటప్పుడు అర్జునుడు శ్రీకృష్ణునితో అంటాడు- 'బావా! శత్రువును జయించేందుకు ముగ్గురం బ్రాహ్మణ వేషంలో బయలుదేరాం... బ్రాహ్మణత్రయం శుభం కాదు కదా' అని ప్రశ్నిస్తాడు. శ్రీకృష్ణుడు 'బావా! మూఢ నమ్మకాలు మంచివి కావు. శత్రు సంహారంవల్ల దుష్ట శిక్షణ జరుగుతుంది. జరాసంధుడి మరణ సమయమే మనకు సుముహూర్తం' అంటాడు. జరాసంధుడి వధ నిరాటంకంగా సాగుతుంది.

కాలాలు ముహూర్తాలు అనేవి అత్యంత ప్రభావం కలిగి ఉంటాయి. ముహూర్తాలు ఇలాంటివే! కాల స్వరూప స్వభావాలు ముహూర్త బలాలు ఇలా ఇంటాయని చెప్పడం కష్టమని రఘువంశంలో కాళిదాసు వివరిస్తాడు. సాధారణంగా అష్టమి నవములు మంచి తిథులు కావని భావిస్తారు. నవమి తరవాత దశమి వస్తుంది. దశమి తిథి అన్ని విధాలా మంచి రోజని చాలామంది విశ్వసిస్తారు. మరి శ్రీరామచంద్రుడు శుక్లపక్ష నవమి రోజు ఎందుకు జన్మించాడు? ఆ మరుసటి రోజు చాలా మంచిది కదా! ఇదే ప్రశ్నను దశరథుడు వశిష్ఠుని అడుగుతాడు. అందుకు ఆయన బదులిస్తూ 'రాజా! ఈ మహాపురుషుడు కారణజన్ముడు. కార్యసాఫల్యం కోసం అవతరించినవారికి జన్మించడమే ప్రధానం కాని తిథి, వార, నక్షత్రాలు కాదు. మనోనిశ్చయంతో ఉన్నవాడు కాలానికి సైతం ఎదురీదగలడు. ముహూర్తబలం కన్నా ఆత్మబలం గొప్పది కదా దశరథ మహారాజా!' అంటాడు.

జీవన్ముక్తులకు శుభాశుభ ఘడియలు ఉండవు. మూఢ నమ్మకాలు అవిద్యకు సంకేతమని రమణ మహర్షి బోధించేవారు. పూర్ణచంద్రుడు ఉదయించిన రాత్రినీ, అమావాస్య నిశినీ ఒకే రీతిలో ఆస్వాదిస్తానని ఆయన అనేవారు. 

వశిష్ఠుడు శుభ ముహూర్తమని తలచిన రోజునే శ్రీరాముడు అరణ్యవాసం వెళ్లాడు. 'మంచి రోజని రేపు తలపెట్టిన కార్యాన్ని ఈ రోజే చేసెయ్‌. ఈ రోజు తలపెట్టిన కార్యాన్ని ఇప్పుడే ప్రారంభించు' అంటాడు కబీర్‌! 

సూర్యుడు రోజూ ఉదయిస్తాడు. రాత్రి కాగానే అస్తమిస్తాడు. ఆదిత్యుడికి తిథి, వార, నక్షత్రాల పట్టింపులు లేవు. విధి నిర్వహణే ఆ ఆదిత్యుడికి ముఖ్యం. కార్యసాధకుడెప్పుడూ కాలం కోసం వేచి ఉండరాదు. కార్యం మంచిదైతే కాలం సైతం సహకరిస్తుంది. దుర్ముహూర్తం కూడా సుముహూర్తంగా మారుతుంది!
                                                                 - అప్పరుసు రమాకాంతరావు 

Saturday 17 August 2013

యాత్రలెందుకు?

దైవదర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడున్నది శిలా విగ్రహమో, చెక్కబొమ్మో అనుకోకూడదు. దానిలోని దైవత్వాన్ని మనం అనుభూతం చేసుకోవాలి. క్షేత్రాల్లో ఆధ్యాత్మిక చైతన్యం విరాజిల్లుతూ ఉంటుంది. క్షేత్రదర్శనాలకోసం చేసే ప్రయాణాలను తీర్థయాత్రలంటారు. తీర్థయాత్రలకు, విహారయాత్రలకు మధ్య చాలా తేడా ఉంది. నిత్యజీవనంలో కాస్త ఆటవిడుపుకోసం, మానసిక ఆహ్లాదంకోసం చేసేవి విహారయాత్రలు. అవి మనిషిని సేదతీరుస్తాయి. దివ్య ఆధ్యాత్మిక అనుభూతికోసం, ఆత్మసంతృప్తికోసం సంస్కారవంతమైన చిత్తం తీర్థయాత్రలను కోరుకుంటుంది. విహారయాత్రలకు వెళ్ళేటప్పుడు మనిషి మానసికస్థితి ఒకలా ఉంటుంది, పుణ్యతీర్థాలను సేవించేటప్పుడు మరొకలా ఉంటుంది.
మహాభారతం అరణ్యపర్వంలో తీర్థయాత్రలకు వెళ్ళదలచినవారికి ఉండవలసిన యోగ్యతల గురించి భీష్ముడికి పులస్త్యుడు చెబుతాడు. వ్రత నిష్ఠ, శౌచం, ధర్మశుభస్థితి, ఉపవాసదీక్ష వంటి లక్షణాలు వివరించి, అవన్నీ ఉంటే తప్ప, 'తీర్థములాడనేరరు' అంటాడు పులస్త్యుడు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళదలచినవారి మానసిక సంసిద్ధత ఎలా ఉండాలో చెబుతాడు.

భారతంలోనే కాదు, శ్రీదేవీభాగవతం వంటి అనేక పురాణాల్లో సైతం మనిషి ముందుగా దీక్ష తీసుకుని మరీ తీర్థయాత్రా సేవనం చేయాలని ఉంది. అలాంటివారిని అన్నమయ్య 'సువ్రతులు'గా వర్ణించాడు. భక్తితో, ఆర్తితో దేవుడి దివ్యసాక్షాత్కార అనుభవం కోసం అర్రులుచాస్తూ ఆతృతగా వెళ్ళాలన్నాడు. తిరుమల గిరుల్లోను, కొండమీద ప్రతీ అణువు పావనం, ప్రతి శిలా సాలగ్రామం, ప్రతి అంశం బ్రహ్మమయం అన్న భావనతో సంతోషంగా వెళ్ళాలి. ఆ రకమైన మానసిక సంసిద్ధతతో వెళ్ళినప్పుడు అద్భుత ఆధ్యాత్మిక అనుభూతి మనిషికి దక్కుతుంది. అంతేతప్ప- సెలవులు వచ్చాయనో, విహారయాత్రలకనో పుణ్యక్షేత్రాలకు వెళ్ళకూడదు. దేవుడి నెలవులు కనుగొనడం కోసం వెళ్ళాలి.

తీర్థయాత్రలకే కాదు, విహారయాత్రలకు సైతం ఒక పద్థతి అవసరం. మానసిక సంసిద్ధత ముఖ్యం. ప్రకృతితో మనిషి బంధం గట్టిపడేందుకు విహారయాత్రలు గొప్పగా ఉపకరిస్తాయి. ఇటీవలి కాలంలో ప్రకృతికీ మనిషికీ మధ్య వైరం బాగా పెరిగిపోయింది. మనిషి చేతిలో ప్రకృతి సర్వవిధాలా నాశనమవుతోంది. సఖ్యత పూర్తిగా చెడిపోయింది. భయంకరమైన కాలుష్యంలో మునిగిపోయి, దేహం మట్టికొట్టుకుపోయి, మన మనసు మసిబారిపోతున్న స్థితిలోంచి ఒకసారి చల్లని మంచుకొండల్లోకి, పచ్చని అడవుల్లోకి, మెత్తని ఇసుక తిన్నెలపైకి వెళ్ళి గడిపితే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో వహించండి! తీరిగ్గా కూర్చుని వరిపైరు వయ్యారాలను గమనిస్తూ చేలగట్లపై విహరిస్తే ఎంత బాగుంటుందో ఆలోచించండి!

విహారయాత్రలకు వెళ్ళడమంటే ప్రకృతి సోయగాలను ఆస్వాదించడానికి వెళ్ళాలి. ఒక సీతాకోకచిలుకను చూస్తే- అంత చిన్నజీవి ఎన్నెన్ని రంగులతో ఎంత అందంగా ఉందో కదా అనిపించాలి. ఒక్కరోజుతో తన జీవితాన్ని చాలించే పువ్వు అంత హాయిగా నవ్వుతూ ఎంత పరిమళాన్ని వెదజల్లుతోందో చూసి మనం మురిసిపోవాలి. చక్కగా అల్లుకున్న తమలపాకు తీగలకు ఈ పూటే చిగిర్చిన లేలేత చివురాకు మృదుస్పర్శకు ముందెన్నడో మొలిచిన ముదురాకుల ముతకదనానికి గలతేడా మన చేతికి తెలిసిందంటే- ప్రకృతితో ఇంకా స్నేహం మిగిలి ఉందని అర్థం. మన గుండెలో ఎక్కడో ఓ మూల కాస్త పచ్చదనం ఇంకా మిగిలే ఉందని ధైర్యం. అందుకోసం విహారయాత్రలు! మన హోదాలు, బాధ్యతలు, కష్టాలు, కాలుష్యాలు అన్నింటినీ కాసేపు మరిచిపోయి, కాస్తంత పచ్చిగాలిని హాయిగా పీల్చుకొని ప్రకృతికి ధన్యవాదాలు చెప్పుకోవడం కోసం మనం విహారయాత్రలు తలపెట్టాలి.

తీర్థయాత్రలంటే ఏవేవో నియమాలంటారు, పోనీ విహారయాత్రలన్నా ఆస్వాదిస్తున్నారా అంటే- అదీ సందేహమే! చాలామందికి విహారయాత్రలపట్ల ఆసక్తి, అవగాహన ఉండటంలేదు. గోదావరిలో పాపికొండల విహారయాత్రలకు వందలమంది నిత్యం వెళుతూనే ఉంటారు. కమ్మనిమట్టి వాసనతో మొదలై చల్లని పిల్లగాలులు, గోదావరి తరగల నురుగులు, గాలిలోంచి తేలివచ్చే పట్టిసీమ గుడిగంటల మోతలు, నదికిరువైపులా జనపచేల తెల్లని మొవ్వులు... దూరంగా ఆకుపచ్చని నునుపుకొండలు, పసుపు పచ్చని పూలతో విరగబూసిన నువ్వుచేలు... నీళ్ళను చీల్చుకుంటూ లాంచీ పోతుంటే వచ్చే లయబద్ధమైన సంగీతం, నీలిమబ్బులు, గోదావరి వయ్యారాలు... వీటన్నింటినీ ఆస్వాదించాలి. వాటిని వదిలేసి- ఖరీదైన బోట్లలోని శీతల మందిరాల్లో తలుపులు బిడాయించుకుని పేకాటతో కాలక్షేపం చేసేవాళ్లకు విహార యాత్రలు అక్కర్లేదు. మనిషి తనలోకి ఇంకెప్పుడు తొంగిచూడగలడు? తిరిగొస్తుంటే మళ్ళీ ఎప్పుడో! అన్న బెంగ పుట్టించాలి. వాలిపోయే పొద్దుకు ప్రకృతి అద్దుతున్న వర్ణాలను చూసి మురిసిపోవాలి. గోదావరిలో మునిగిపోతున్న సూర్యుణ్ని చూస్తే- అయ్యో ఈ రోజెంత త్వరగా అయిపోయిందో కదా! అనిపించాలి. తలచుకున్నప్పుడల్లా జ్ఞాపకాలు తియ్యగా చెలరేగి మనసుకు కితకితలు పెట్టాలి. విహారయాత్రలు మనిషి జీవితంలోకి ఇంద్రధనుస్సులోని రంగులన్నింటినీ ఒంపాలి. ఇన్ని వర్ణాలా అని మనిషి అబ్బురపోవాలి. అదీ విహారయాత్రల పరమార్థం! 
                              సంస్కారశుద్ధి లేకుంటే తీర్థయాత్రలు వ్యర్థం. 
                             సంతోషసిద్ధి లేకుంటే విహారయాత్రలూ వ్యర్థమే!
                                                                                                                                                                                        - ఎర్రాప్రగడ రామకృష్ణ 

సిరుల వరాల దేవి


అనంత విశ్వాన్ని 'లక్షించేది' లక్ష్మి. అందరూ లక్షించేది లక్ష్మిని. లక్షించడం అంటే చూడటమని అర్థం. అందరినీ తన కరుణామృతపూర్ణమైన చలువ చూపులతో 'కనిపెట్టుకుని', 'గమనించి' పాలించే శక్తి- అని భావార్థం. కనులు తెరవడాన్ని సృష్టిగా, మూయడాన్ని లయగా సంకేతిస్తే- ఆ రెంటి నడుమ ఉన్నది 'స్థితి'గా భావించవచ్చు. పరమేశ్వర శక్తిచే జరిగే సృష్టి స్థితి లయలే 'ఈక్షణ' శక్తిగా వేదరుషులు అభివర్ణించారు.
సర్వసాక్షియైన ఈ భగవద్దర్శన శక్తిని లక్ష్మిగా ఉపాసించడం లక్ష్మీ ఆరాధనలోని ప్రత్యేకత. అందరూ ఆనందాన్నీ, ఐశ్వర్యాన్నీ, జ్ఞానాన్నీ 'లక్ష్యం'గా పెట్టుకొనే జీవిస్తారు. ఇలా అందరికీ లక్ష్యమైన జ్ఞాన, ఆనంద, ఐశ్వర్యాల సాకార రూపమే 'లక్ష్మి'. ఈ దివ్యభావాన్ని సగుణంగా, లీలారూపంగా పురాణాలు వ్యక్తీకరించాయి. భృగు ప్రజాపతి, ఖ్యాతి దంపతులకు పరాశక్తి మహాలక్ష్మిగా ఆవిర్భవించింది. జ్యోతిషపరంగా దర్శిస్తే భృగు ప్రజాపతికి ప్రధానమైన రోజు శుక్రవారం. అందుకే దీన్ని 'భృగు'వారమనీ వ్యవహరిస్తారు. భృగు పుత్రికగా లక్ష్మీదేవికి 'భార్గవి' అని దివ్యనామం. పర్వతరాజు (హిమవాన్‌) పుత్రి పార్వతిలాగా భృగు పుత్రిక భార్గవి. ఈ లక్ష్మిని నారాయణుడికిచ్చి వివాహం చేశాడు భృగువు. నారాయణుడి సంకల్ప, దయాశక్తుల రూపం లక్ష్మి. విష్ణుదయనే ఆయా లోకాల్లో లక్ష్ములుగా, ఆరు ఐశ్వర్యాల రూపంగా వివిధ నామాలతో పేర్కొంటారు. స్వర్గలక్ష్మి, భూలక్ష్మి, గృహలక్ష్మి, వనలక్ష్మి... ఇలా విశిష్ట శోభ, సంపద కలిగిన చోట్లను లక్ష్మీస్థానాలుగా చెబుతారు. శాస్త్రాలు ప్రస్తావించిన సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి- ఒకే లక్ష్మి తాలూకు విభిన్న రూపాలివి.

సిద్ధలక్ష్మి: ఎవరు ఏ సాధన చేసినా, ఏ కార్యాన్ని తలపెట్టినా అది సాఫల్యం చెందాలని ఆశిస్తారు. ఆ సఫలతే సిద్ధి. ఆ సిద్ధి- సాధన దశలో లక్ష్యంగా, సిద్ధదశలో ప్రాప్తి(ఫలం)గా ఉంటుంది. కార్యానికి ప్రయోజనం సిద్ధి. చేసిన పని వ్యర్థంకాకుండా ఫలింపజేసే భగవత్కారుణ్యం సిద్ధలక్ష్మి. ఆధ్యాత్మిక సాధనలే కాక, భౌతిక సాధనలకూ సిద్ధి కావాలి కదా! అందుకే కార్యసాధకుల ఉపాస్య దేవి ఈమె. సిద్ధి లభించేలా సాధనకు ఉత్తేజాన్ని, వనరులను, శక్తిని అనుగ్రహించే దేవి ఈ సిద్ధలక్ష్మి. యోగాలు, కర్మలు ఈ తల్లి వల్లనే ఫలిస్తాయంటారు.

మోక్షలక్ష్మి: తత్వపరంగా- ప్రాపంచికమైన అజ్ఞాన బంధనం నుంచి 'విడుదల' చెంది, పరమాత్మతో తాదాత్మ్యం చెందడమే మోక్షం. ఈ మోక్షమనే సంపదను, మోక్షానికి అవసరమైన యోగ, విచారణాది జ్ఞానశక్తులను ప్రసాదించే ఈశ్వరశక్తి- మోక్షలక్ష్మి. నిష్కాములైన యోగులకు గమ్యమైన తత్వం ఈ మూర్తి.

భౌతికదృష్టితో చూస్తే- దుఃఖాల నుంచి, పాపాల నుంచి, సమస్యల నుంచి 'విడుదల' (ముక్తి) అనుగ్రహించే దేవి ఈ లక్ష్మి. 
జయలక్ష్మి: జయమంటే గెలుపు. ప్రతివారూ తామున్న రంగంలో అందరికంటే గొప్పగా ఉండాలని కోరుకోవడం సహజం. అలా 'పైచేయి'గా, 'మించి' ప్రకాశించే విధంగా ఉండటమే జయం. అంతేకాక- ధర్మార్థ కామమోక్షాలు అనే పురుషార్థాలను సాధించడాన్ని 'జయం' అంటారు. ఈ రెండు అర్థాలు జయ శబ్దానికి ఉన్నాయి. ఈ రెండు రకాల 'జయా'లను ప్రసాదించే తల్లి జయలక్ష్మి. అవరోధాలను దాటగలగడమే నిజమైన జయం. భౌతిక ప్రగతికీ, ఆధ్యాత్మికోన్నతికీ ఆటంకాలైన వివిధ అవాంఛనీయ శక్తులను నెగ్గుకు రాగలిగే స్త్థెర్యాన్నీ, శక్తినీ ప్రసాదించి గెలుపునిచ్చే దేవత ఈ దేవి. 'విజయలక్ష్మి'గానూ కీర్తిస్తారు.

సరస్వతి: జ్ఞానరూపమైన సంపద (లక్ష్మి) సరస్వతి. విద్యాలక్ష్మిగా ప్రసిద్ధిచెందిన దేవత. ఐహిక జీవనానికి పనికివచ్చే అనేక విద్యలు, సూక్ష్మమైన యజ్ఞవిద్యలు- ఈ సరస్వతి 'అపరావిద్యల' రూపాలు. ఆత్మజ్ఞానాన్ని అందించే బ్రహ్మవిద్య 'పరావిద్యా' స్వరూపం. ఈ విద్యల రూపంలో ఉన్న జ్ఞానవిజ్ఞాన రూప ఐశ్వర్యమే ఈ మాత.

శ్రీలక్ష్మి: శ్రేష్ఠత్వాన్నీ, శోభనీ సూచించే శబ్దం శ్రీ. అదే విధంగా రుగ్విజుసామాత్మకమైన వేదవిద్యకూ 'శ్రీ' అని పేరు. అన్ని లోకాల్లోని గొప్పతనాలు, శోభలు, ఉత్సాహానందాది రూపాలను 'శ్రీ' అనే పదం (అక్షరం) ద్వారా బోధిస్తారు. మరొక భావనలో- 'శ్రీ' అంటే ఆశ్రయించేది, ఆశ్రయంగా ఉన్నది- అని రెండర్థాలు. జ్యోతిని కాంతిలా, బెల్లాన్ని తీపిలా- పరమేశ్వరుని ఆశ్రయించుకున్న ఆతని అవిభాజ్య స్వాభావికశక్తి 'శ్రీ'.సర్వజీవులకు ఆశ్రయంగా, ఆధారంగా ఉన్నది కనుక శ్రీ.

వరలక్ష్మి: 'వర' శబ్దానికి 'కోరుకున్నది' అని అర్థం. అందరూ కోరుకొనే సంపదలు వరాలు. వాటిని ఇచ్చేదీ, వాటి రూపంలో ఉన్నదీ వరలక్ష్మి. 
వారివారి ప్రజ్ఞాస్థాయీ భేదాల రీత్యా ఒక్కొక్కరికీ ఒక్కొక్కటి వరం. కోరినవేవి కావాలన్నా భగవత్సంకల్పం లేనిదీ, ఆయన దయ రానిదీ పొందలేం. అసలు ఆనందం, సంపద లేని వస్తువును మనం కోరుకోం. అలా మనం కోరుకునే వాటిలో ఆనందరూపంగా ఉన్నదీ, ఆనందాలను ప్రసాదించేదీ ఈ వరలక్ష్మి. వాస్తవానికి ఈ వరలక్ష్మిలో మిగిలిన అయిదు లక్ష్ములనూ సమన్వయించి చరమ నామంగా చెబుతారు. 

'ప్రతి స్త్రీలోనూ లక్ష్మీకళ ఉన్నది' అని ఆర్ష వాక్యం. అందుకే స్త్రీలను లక్ష్మీరూపాలుగా ఆరాధించడం, స్త్రీలు లక్ష్మీరూపాన్ని అర్చించడం- ఈ శ్రావణ వరలక్ష్మీ వ్రతం దివ్యత్వం.
                                                                        - సామవేదం షణ్ముఖశర్మ

Thursday 15 August 2013

దివ్య జీవనదీప్తి



'ఈ భూమిపై భగవంతుడు శాశ్వతంగా భాసిస్తుండాలి. అందుకే నా తపస్సు' అని అరవిందులు ప్రవచించారు. దివ్య జీవనమే ఆయన సందేశం. దివ్య జీవనమే ఆయన సంగీతం.

భగవంతుని ప్రసక్తిలేని ప్రపంచం, జీవితం అపరిపూర్ణం. పరిమితం. సత్యచైతన్యమనే వినూతన చేతస్సును సాధించడం ద్వారా అందమైన, ఆనందమయమైన, పరిపూర్ణ సామరస్య మాధుర్యమయమైన జీవితం గడపవచ్చునని అరవిందులు పూర్ణయోగం ద్వారా గ్రహించారు. ఆ సత్య చైతన్యాన్ని తనలో సుస్థిరం చేసుకోవడానికే తన యావజ్జీవితం శ్రమించారు. చాలామంది మేధావులకు, ద్రష్టలకు ఈ ప్రపంచం వివిధ రకాలుగా, వివిధ కోణాల్లో అర్థమైంది. వారు ఎన్నో ప్రవచనాలు, దర్శనాలు అందించి వెళ్లారు. అవన్నీ మానవాళి శ్రేయం కోసమే. ఇన్నిఉన్నా- ఎందరో ప్రవక్తలు, అవతారమూర్తులు వచ్చివెళ్లినా, ఈ భూమి మారలేదు. సృష్టి తిరిగి అర్థంకాని ఒక క్లిష్టప్రహేళికగా, ఒక దుష్ట ప్రహసనంగా, మానవమారణ హోమాగ్ని జ్వాలల్లో (అరవిందులు తపస్సు చేస్తున్న సమయానికి) దిక్కులేక ఆహుతి అయ్యే అనాథ లాగా మారిపోయింది. ఆమెను రక్షించే హస్తాలు ఎక్కడ? యుగయుగాల మానవాళి అశ్రురాశికి, భగ్నమైపోతున్నవారి కలలకు, అందరినీ చిత్రహింసలు పెడుతున్న దుర్విధికి మూలకారణం ఏమిటి? ఒక మహోన్నత సమాజస్థాపనలో మానవ అపజయాలకు, వైఫల్యాలకు అసలు కారణం ఏమిటి? పూర్ణయోగ చైతన్యశిఖరంలో ధ్యాన నిమగ్నమైన అరవిందులకు ఆ ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి. ఎక్కడైతే అన్ని యోగాలు, దర్శనాలు ఆగిపోయాయో, అక్కడినుంచి పూర్ణయోగ ప్రస్థానం ప్రారంభమైంది.

ఈ భూమి పరివర్తన, మానవ చైతన్య పరివర్తన అరవిందుని యోగప్రణాళికలో ప్రధాన అంశాలు. మనిషి చిన్న ఆశాదీపికలు వెలిగించుకుని పెనుచీకటిలో ప్రయాణం సాగిస్తుంటాడు. మహాసత్యం నుంచి రాలిన చిన్న శకలం జగద్రక్షక కాంతిసర్వస్వం అనుకుంటాడు. అన్ని సత్యాలను అధిగమించి, అతీతంగా మెరిసే మహోజ్జ్వల సత్యాన్ని అతను తిరస్కరిస్తాడు. అన్ని వెలుగులకు మూలమైన మహాజ్యోతిర్నివహాన్ని తోసిపుచ్చుతాడు.

'అంతిమ మహా సత్యం పూర్ణ సాక్షాత్కారం పొందినప్పుడే భూమి పరివర్తన సుసాధ్యమవుతుంది. అంతవరకు నా ప్రయత్నం, నా పోరాటం ఆగవు. భగవంతుని సంకల్పాన్ని నెరవేర్చేవరకు నేను విశ్రాంతి పొందను'- ఇదీ అరవిందుల వజ్రసంకల్పం.

'ఈ భూమి మారదు. స్వర్గం రాదు. నువ్వు ఆరాధించే మహాసత్యం లేనే లేదు. అది అభూతకల్పన. నీ ప్రయత్నం నిష్ఫలం' అని దుష్టులు, దురాత్ములు పరిహసించినా ఆయన నిరాశ చెందలేదు. భగవంతుని నీరవతలో ఇంతవరకు ఎవరికీ దృగ్గోచరంకాని సత్యాలెన్నో ఆయన వీక్షించారు. మానవ జీవనగర్భంలో భవిష్యత్‌ దేవత రూపుదిద్దుకుంటున్నది. మన మర్త్యత్వం బలహీనతలనుంచే ఒక చిరంతన శక్తి ప్రభవించనున్నది. తొలి జీవకణంలో బంధితమైన దైవత్వం అమృతత్వం వైపు అధిరోహిస్తోంది. అదే పరిణామ రహస్యం. అంతులేని బాధాగ్నితో నిండిన కాలస్రవంతిలో ఈ భూమి ఒక దుస్స్వప్నం కాదు. భగవంతుడే ఈ భూమిని సృష్టించాడు. ఈ భూమి తనలో భగవంతుణ్ని సృష్టించి (ఆవిష్కరించి) తీరుతుంది. దేవతలాంటి పూర్ణమానవుడు- అరవిందుని స్వప్నం! భువిపై స్వర్గం- ఆయన సమున్నత ఆదర్శం! దివ్యజీవన ఆవిర్భావం- ఆయన యోగ పరమావధి!                                                                                          - కె.యజ్ఞన్న

శ్రావణ శుక్రవారం సౌభాగ్యదేవతకు స్వాగతం..

వరాలిచ్చే వరలక్ష్మి

ర్షాకాల వైభవంలో శ్రావణమాసం పవిత్రమైన దేవపూజలకు తరుణం. శ్రావణమాసం శుక్లపక్షంలో పున్నమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ‘వరలక్ష్మీ వ్రతం’ జరుపుకుంటాం. ఇది ఒక ఆచారం మాత్రమే కాదు. దీని వెనుక పురాణ ప్రాశస్త్యమూ ఉంది.వరలక్ష్మీ వ్రతం రోజున ముఖ్యంగా మహావిష్ణువు భార్య లక్ష్మీదేవిని సర్వమంగళ సంప్రాప్తి కోసమేగాక పుత్ర పౌత్రాదులను, ఆరోగ్య ఐశ్వర్యాలను కలిగించమని ప్రార్థిస్తూ పూజిస్తాం. ‘నిత్య సుమంగళి’గా ఉండాలని కోరుతూ పుణ్యస్త్రీలు దీనిని ఆచరిస్తారు. తమ భర్త ఆరోగ్యంగా, ఆనందంగా జీవితాంతం అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉండాలనీ వ్రతం చేసే స్త్రీలు కోరుకుంటారు.శుద్ధసత్వ స్వరూపంతో భాసించే జగజ్జనని శ్రీలక్ష్మి.

కొందరు అష్టలక్షులుగా, కొందరు షోడశ లక్షులుగా భావిస్తున్నా ఆమె మాత్రం అనంతలక్ష్మి. చంద్రకాంతి, సూర్యకాంతి, పుష్పిత సౌందర్యం, అగ్నిదీప్తి, క్షేత్రాల పచ్చదనం, భూమిగరిమి, జలం శీతలత, ఫలశోభ, ఆరోగ్యం, ఉత్సాహం, గగనపు వైశాల్యం, సమువూదాల గాంభీర్యం, కంఠాన పలుకు, శరీరంలో చైతన్యం, విద్యా విజ్ఞానం -ఇలా అనంతమైన లక్షణాలు ఆమెలో ఎన్నో! ‘స్త్రీలకు సర్వసౌభాగ్యాలను, పుత్ర పౌత్రాదులను, సుఖ జీవితాన్ని ప్రసాదించే వ్రతం ఏద’ని పరమేశ్వరుడిని పార్వతి అడిగినప్పడు ఆ దేవదేవుడు ‘వరలక్ష్మీ వ్రతాన్ని’ వివరిస్తాడు. శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు దీనిని చేయాలి. ఈ సందర్బంలోనే మహాశివుడు పార్వతీదేవికి చారుమతిదేవి కథను వివరిస్తాడు.

మగధ దేశంలో కుండినంబు అనే ఒక పట్టణం ఉంది. అక్కడ బంగారు ప్రాకారాలు, బంగారు గోడలతో నిర్మితమైన ఇండ్లు ఉంటాయి. ఆ పట్టణంలోనే ‘చారుమతి’ అనే ఒక స్త్రీ ఉంది. ఆ వనితామణి రోజూ ఉషఃకాలంలోనే మేల్కొని, స్నానం చేసి, పెద్దలకు అనేక విధాల ఉపచారాలు జేసి, ఇంటి పనులను జేసుకొనేది. అనంతమైన భక్తివూపపత్తులు గల ఆమె పట్ల మహాలక్ష్మికి అనుక్షిగహం కలుగుతుంది. ఒకనాడు లక్ష్మీదేవి ఆమెకు కలలో కనిపించి, ‘శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు తనను పూజిస్తే కోరిన వరాలు ఇస్తానని’ అంటుంది. నిద్ర మేల్కొన్నాక ఇంట్లో అమ్మవారు కోసం చూస్తుంది. వరలక్ష్మీ దేవి కనిపించకపోవడంతో ‘జరిగింది కల’గా తెలుసుకుంటుంది. తర్వాత భర్త, మామ మొదలయిన వాళ్లకు స్వప్నం వృత్తాంతం చెప్పి, వ్రతాన్ని ఆచరిస్తుంది. అలా చారుమతితోపాటు ఇతర స్త్రీలంతా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తూ సకలైశ్వర్యాలను పొందినట్లు పెద్దలు చెబుతారు. ఆ పరమేశ్వరుని అనంత శక్తులే లక్ష్మీదేవతలు. ఇన్ని శక్తులను వెదజల్లే ఏకైక పరమేశ్వర శక్తిగానూ వరలక్ష్మిని వేద పండితులు అభివర్ణిస్తారు. అనేకానేక వరాలను కురిపించే ఆ తల్లి వరలక్ష్మిని శ్రావణమాసంలోని ఈ పవిత్ర శుక్రవారం రోజున అనంతమైన భక్తితో పూజించిన వారి జన్మ ధన్యమయినట్లే. వారు కోరిన వెంటనే వరాలనిచ్చే ఆ మహాలక్ష్మీ ఈ వరలక్ష్మీ స్వరూపం.

వరలక్ష్మీ వ్రతం రోజున హైందవ మహిళలు వేకువనే లేచి, ఇంటిని శుభ్రపరిచి, గుమ్మాలకు మామిడి ఆకుల తోరణాలు కడతారు. స్నానాదులను ముగించి, కొత్త వస్త్రాలు ధరించి, పుష్పాక్షతలచే దేవిని పూజిస్తారు. లక్ష్మీదేవిని పూజకు స్థాపించే ప్రదేశంలో పిండితో నేలపై గోమాత పాదాలు, పద్మాన్ని వేస్తారు. బంగారు, వెండి మరేదైనా లోహపు కలశానికి పసుపు రాసి, గంధం పూసి, ఆపై కుంకుమ బొట్టు పెడతారు. కలశాన్ని నీటితో నింపుతారు. దానిలో మామిడి ఆకులు, అక్షతలు ఉంచి, పైన కొబ్బరికాయను పెట్టి పిండితో వేసిన పద్మంలో కొత్త రవికెల గుడ్డను పరుస్తారు. ఆ వస్త్రంపై బియ్యం పోసి, దానిపై కలశాన్ని స్థాపిస్తారు. కొందరు వరలక్ష్మీ దేవిని కొబ్బరికాయకు పసుపు రాసి, పిండితో ముక్కుచెవులను చేసి, కాటుకతో కళ్ళను దిద్ది, బొట్టు పెట్టి కలశంలో దేవి విగ్రహాన్ని స్థాపిస్తారు. ఈ విగ్రహాన్ని బంగారు లేదా వెండి ఆభరణాలతో అలంకరిస్తారు. అలాగే, మరి కొందరు కొబ్బరికాయకు బంగారు లేదా వెండి ముఖాన్ని అమర్చి శుభ్రమైన పూలు, ఆభరణాలతో దేవిని అలంకరిస్తారు.ముందుగా విఘ్ననాయకుడైన వినాయకుని పూజించి, తరువాత వరలక్ష్మీదేవిని ఆహ్వానించి, సకలోపచారాలతో పూజిస్తారు. తొమ్మిది పోసలు వేసి, తొమ్మిది గ్రంథులతో కూడిన తోరాన్ని దేవికి సమర్పిస్తారు. ఆ దేవి రక్షాబంధనంగా తమ ఎడమ చేతికి దానిని కట్టుకుంటారు. లక్ష్మీ అష్టోత్తర శత నామాలతో దేవిని పూజించి తొమ్మిది రకాలైన పిండి వంటలతో మహా నైవేద్యాన్ని సమర్పిస్తారు.ఆ రోజు ఇళ్లన్నీ ఆధ్యాత్మిక కళతో అలరారుతాయి. ఇంటిల్లిపాదీ షడ్రసోపేతాలతో భోజనాలు చేస్తారు. పెళ్లయిన మహిళలు పూజ తర్వాత ముతైదువులకు తాంబూలాదులు ఇచ్చి, వారి దీవెనలు అందుకుంటారు. మంగళహారతి గీతాలను పాడి వరలక్ష్మీ కృపను కోరుకుంటారు. ఇలా, శ్రావణమాసం వచ్చిందంటే చాలు, సౌభాగ్యదేవత ఎందరి ఇళ్లను పావనం చేస్తుందో.
                                                                  - వనిత విజయకుమార్ ద్యాప

Wednesday 14 August 2013

మాటలో మాధుర్యం


జ్ఞాలు అనేకరకాలు. అందులో 'వాక్‌ యజ్ఞం' ఒకటి. జీవితంలో వాక్కును యజ్ఞసమంగా వినియోగించటం వాగ్యజ్ఞం. 'యజ్ఞ సమం' అంటే- వాక్కుతో యజ్ఞం చేస్తామా, అదెలా?! యజ్ఞం అతి పవిత్రమైంది. దేన్ని భగవంతుడికి అర్పించాలో దాన్ని అగ్ని ద్వారా మంత్రయుక్తంగా సమర్పించటం. దేవతల ప్రీత్యర్థం చేసేది. కోరికలు లేని వరం కోసం కూడా యజ్ఞం చేసేవారున్నారు. పూర్వ రుషులు అలాంటివారు. యజ్ఞం ఆసాంతం అతి పవిత్రం. అత్యంత శుభప్రదం. శోభాయమానం.

జీవితంలో, జీవితాంతం వాక్కుతో యజ్ఞం చేసేవారున్నారు. హరిశ్చంద్రుడు అలా చేశాడు. నోట్లోంచి వెలువడిన ప్రతి మాటను సత్యంగా మలచుకున్నాడు. ఆ క్రమంలో- చక్రవర్తి హరిశ్చంద్రుడు రాజ్య సర్వాన్నీ పోగొట్టుకున్నాడు. భార్యాబిడ్డలను కోల్పోయాడు. కాటికాపరి అయ్యాడు. కుమారుడికి స్వయంగా శవదహనం చేసేందుక్కూడా సిద్ధమయ్యాడు. ఆయన సత్యాన్ని మాత్రమే మాట్లాడాడు. మాట్లాడిన ప్రతి మాటను సత్యం చేశాడు. కోల్పోయినది లెక్కకాదు. సత్యాన్ని పాలించటమే లెక్క.

రఘువంశ రాజులూ రాజ్యంతోపాటు సత్యవాక్కునూ పరిపాలించారు. అందువల్లే ఒకరాజు ధర్మపత్నినే రుషికి అప్పగించేందుకు సిద్ధపడ్డాడు. మరోరాజు ప్రాణాధికమైన కుమారుడు రాముని అడవులకు పంపేందుకూ ఒప్పుకొన్నాడు. వాక్కు అంటే కేవలం నాలుక మీంచి వచ్చేది కాదు. వట్టి నోటిమాట కాదు. వాక్కు శబ్ద బ్రహ్మ... ఓంకారంలా. మనం దాన్ని అలాగే భావించాలి. అలాగే భాషించాలి. నోట్లోంచి వెలువడిన ప్రతి మాట, ప్రతి అక్షరం ఒక యజ్ఞ ఆహుతిగా, సమిధగా పరమాత్మ ప్రీత్యర్థం మనం చేస్తున్న వాక్‌ యజ్ఞకుండంలో సమర్పించాలి. మన హృదయంలో, కంఠస్థానంలోని విశుద్ధి చక్రంలో పరమాత్మ కొలువై ఉన్నాడంటారు. జిహ్వమీద సాక్షాత్‌ జ్ఞాన ప్రదాయిని సరస్వతీదేవి ఆసీనురాలై ఉందంటారు. నాభి స్థానంలోంచి బయలుదేరిన వాక్‌ ప్రవాహధార వూర్ధ్వ ముఖంగా ఎగసి నాలుకమీది నుంచి బయటికి రావాలి. హరిపాదాల పుట్టి, శివుని అభిషేకించి, స్ఫటిక సదృశ ప్రవాహంగా భువివైపు ప్రవహిస్తూ వస్తున్న గంగాదేవికి, ప్రవాహ వేదికగా నిలిచిన దేవభూమిలాంటి మన 'దేహభూమి' వాక్కు ప్రవహించే అతిపవిత్ర వేదికగా, భూమిగా, భూమికగా ఉంది. దీన్ని మనం ఏం చేస్తున్నాం? ఎలా వాడుకుంటున్నాం? అబద్ధం, కటుత్వం, కుటిలత్వం, స్వార్థం, అసభ్య పదజాలం లాంటి వ్యర్థ పదార్థాలు కలగలిసిన మురుగు కాలువలు ప్రవహించాల్సిన ప్రవాహ స్థానాలా దేవతా నిలయాలు!? మనం ఆలయాలలో దేవతా విగ్రహాలను గంగాజలంతో గోక్షీరంతో, గోదధితో, గోఘృతంతో, అగ్నితప్త భస్మంతో, పరిమళ ద్రవ్యాలతో అభిషేకిస్తాం. మనలోని స్వయంభువులైన దేవతలను స్పృశిస్తూ, అభిషేకిస్తూ బయటికి రావలసింది మలినమైన వాక్‌ ప్రవాహమా? దుర్వాసనలు వెదజల్లే వాడిన పువ్వులా? తాజా పువ్వులను పసుపు, కుంకుమ, చందనం అద్ది భగవంతుని పాదాలవద్ద ఉంచుతాం. గంగాజలంలోనైనా తులసిదళాలు వేసిగానీ ఆ జలాన్ని వినియోగించం. ఎంత శుభ్రమైన, పవిత్రమైన వస్తువులనైనా 'అపవిత్ర: పవిత్రోవా...' అంటూ మళ్ళీ మంత్రాచ్ఛాదిత జలంతో ప్రోక్షణంతో పవిత్రం చేసిగానీ పూజకు ఉపయోగించం.

మన వాక్కు సహజంగానే ఓ అభిషేక జలం. గంగాజలం. అగ్నిపూతమైన ఓ పుష్పం. రూపం లేని వాయు సంబారం. ఆకాశ సదృశం. పూజకు ఇంతకంటే పవిత్రమైన సంబారం ఉందా? యజ్ఞానికి ఇంతకంటే ఉపయుక్తమైన ఆహుతి ఉందా? పారిజాతాన్ని పేడలో అద్ది పూజకు పెడతామా? నారికేళానికి మసి దిద్ది దేవుడి ముందు కొడతామా? ఏమిటీ అజ్ఞానం! అసత్యాలు, పరుష వాక్యాలు, పెడమాటలు... వీటితోనా మాటలను నిర్మించటం!

మాట ఒక పువ్వులా ఉండాలి. ఒక వెన్నెల రేఖలా ఉండాలి. రాముడిలా మాట్లాడాలి. హనుమలా భాషించాలి. కోకిల గానంలా సంభాషించాలి. మనకు కావలసింది స్వరమాధుర్యం కాదు. భావ మాధుర్యం, మార్దవం, మన్నన, సత్యం. ఔను. వాక్కుకు సత్యం వెన్నెముక కావాలి. హృదయం కావాలి. అదే స్వరం కావాలి. సర్వం కావాలి. మాట ఒక మంత్రం కావాలి. వాగ్యజ్ఞానికి అదే సంబారం. అదే సమిధ. అదే ఆహుతి. అదే పూర్ణాహుతి!                                                                           - చక్కిలం విజయలక్ష్మి

Tuesday 13 August 2013

దుఃఖం


నసు, శరీరం రెండూ ప్రతీరోజూ కాకపోయినా ఎప్పుడైనా దుఃఖిస్తాయి. జీవకోటికి అందులోనూ జ్ఞానం ఎక్కువగాగల మనిషికి భగవంతుడు ఏర్పరచిన మానసిక స్పర్శే దుఃఖం. జీవనంలో ఏర్పడుతున్న కష్టాలను గంభీరమైన సముద్రపు ఒడుదొడుకులతో, ఆటుపోట్లతో పోల్చి 'దుఃఖసాగరం' అని పిలుస్తుంటారు.

దుఃఖాన్ని మనిషి తనకుతానుగా ఆపాదించుకొని కన్నీటి ద్వారా బహిర్గతపరచుకుంటాడు. నిజానికి దుఃఖంలో కన్నీరు బయటపడటం మంచిదేనని వైద్యులూ అంగీకరించారు. అదేపనిగా కాకుండా అప్పుడప్పుడు కన్నీరు బయటపడటం కంటివ్యవస్థను శుభ్రపరుస్తుంది. అలాగే జీవకోటి కన్నీటిని జాతివ్యవస్థను శుభ్రపరచే ఆయుధంగా అనుకోవాలి. అదొక విజయానికి నాందీవాచకమవుతుంది. చైతన్యప్రక్రియ ఆరంభమవుతుంది. దుఃఖంలోనే దేవుడి స్మరణ ఎక్కువ కావడానికిదే కారణం. ఆత్మీయులు తమకు బాధ కలిగిస్తే దుఃఖం తెరలుతెరలుగా పొరలుపొరలుగా బయటకు వస్తుంది. సాటివారి ఓదార్పు స్వీకరించలేని స్థితిలో కట్టలు తెగిన ఆనకట్టలా దుఃఖం విజృంభిస్తుంది.

ఒకప్పుడు దర్జాగా బతికిన మనిషి నడిరోడ్డున పడ్డప్పుడు విచారవదనంతో భవిష్యత్తుపై అంచనా ఆరంభిస్తాడు. అప్పుడు కచ్చితంగా అంతర్యామి మంచిని ఉద్బోధించి కార్యోన్ముఖుణ్ని చేస్తుంది. అదే చైతన్యదీపిక అవుతుంది. గుండెల్లో దీపం వెలిగిస్తుంది. ఆ దుఃఖం అలా బయటపడి ఉద్వేగం ఉపశమించి, ఏర్పడ్డ 'పొంగు' తగ్గాక ప్రేమస్పర్శ మళ్ళీ మొదలవుతుంది. అంతా మాయలా అనిపించి ఒక వెలుగుకిరణం చూపించిన దారిలో నడిచి దుఃఖం చెంతనే సుఖం ఉందని అర్థం చేసుకొని వేదాంతిగా మారతాడు. దేవుడు తనకు ఉపశమనం కలిగించాడని ఆకాశం వంక చూసి మొక్కుతాడు. మనసును కష్టమనే నిప్పుమీద కాల్చినప్పుడే నిజాలు బహిర్గతమవుతాయని శ్రీకృష్ణుడు 'గీత'లో ప్రవచించాడు. కానీ, మానవమాత్రులు అవన్నీ పెడచెవిన పెట్టి నిరంతరం పొందనివాటికోసం నిత్యం దుఃఖిస్తూ తమకుతాము వ్యాకులత చెందుతూ బతుకు దుర్భరం చేసుకుంటారు. ప్రకృతి ప్రసాదించిన చిరునవ్వుకు దూరమై తెలీని ఉన్మాదం వైపు అడుగులేస్తారు. కీడు కొనితెచ్చుకుంటారు. పక్కవాడు బాగుపడిపోతున్నాడని అసూయ, విచారంతో కాలం గడిపేస్తాడే తప్ప, అవతలివాడి కష్టానికి దేవుడు సాయం పలికాడని భావించడు. శరీర గాయాల్ని వైద్యుడు నయం చేస్తాడు గానీ మానసిక గాయాలకు మందులు అంతవేగంగా పనిచెయ్యవు. క్రమశిక్షణ, ప్రకృతి ఆరాధన, భగవన్నామ స్మరణం వంటి అంశాలతో మనోవైకల్యం నుంచి బయటపడగల వీలుంది. వెలుగునీడల్లా సుఖదుఃఖాలు పక్కపక్కనే ఉంటాయన్న నిజం మరిచిపోకూడదు. అలా అనుకోవడమే పెద్ద ఓదార్పు.

శ్రీకృష్ణుడు భగవద్గీతలో సుఖదుఃఖాలను, వెలుగునీడల్ని కలిపి ఉద్దేశించడంలో ఎంతో నిగూఢ అర్థముంది. ఇది జీవనసత్యాల వడబోతగా గుర్తించాలి. ఆ 'జ్ఞానగుణం' అజ్ఞానగుణాన్ని తరిమికొట్టి ప్రపంచాన్ని జయించే మహారుషిగా నిలబెడుతుంది. కఠోరమైన మానసిక వ్యాయామం వల్ల దుఃఖం వెన్నలా కరిగిపోయి నెయ్యి అనే పౌష్టికం మిగులుతుంది. మనిషికి సుఖం ఎంత ఇష్టమైనా దుఃఖం కూడా స్వీకరించక తప్పదు. మనిషి విర్రవీగకుండా దుఃఖం మళ్ళీ జీవనరేఖమీదకు తెస్తుంది. 'గీత' గీయిస్తుంది. అంతర్యామి చేసే అద్భుతమే అది.

అంతర్లీనంగా గాలి ద్వారానో, మాట ద్వారానో, నీటి ద్వారానో, మరేదైనా ధాతువు ద్వారానో జీవనసందేశం మనిషికి అందడం వెనక అంతర్యామి సహకారం ఉండనే ఉంటుంది. అందుకే దుఃఖం కలిగితే సహృదయులతో పంచుకొని వీలైతే ఏడ్చేసి బరువు దించుకొని, దుఃఖాన్ని బుజ్జగించి, లాలించి పంపేయడం నేర్చుకోవాలి. అప్పుడు అది నిన్ను చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది.

నిజానికి దుఃఖాన్ని జయించడమే సుఖం!
                                                                         - గుడిమెట్ల గోపాలకృష్ణ