ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Saturday 5 April 2014

ధర్మాన్ని కాపాడు!


రుల ధర్మానికి విరుద్ధంగా నిలిచే ఏ ధర్మమైనా అది కుధర్మమే- అని పంచమ వేదమైన మహాభారతం చెబుతుంది. ధర్మమార్గంలో నడవాలని మానవుల్ని హెచ్చరిస్తోంది. మానవ జీవితాన్ని నియమపూర్వకంగా ముందుకు నడిపిస్తుంది ధర్మం. మానవులంతా సమష్టిగా ఉండాలనీ అది ఉద్బోధిస్తోంది. వైరుధ్యంతో కూడిన విశ్వాసాలను, భావాలను అదుపులో పెట్టుకొని, వాటిని అధిగమించాలని హితవు పలుకుతోంది. సంయమనాన్ని పాటించమంటుంది. సహనాన్ని అలవరచుకోమంటుంది. సామరస్యపూర్వకంగా ఐక్యతను సాధించుకోమని సలహా ఇస్తోంది.
పర ధర్మంలో ఉండే విశిష్టతలను స్వీకరించమని ధర్మం చెబుతుంది. పొరపాటు చేసినవారిని మన్నించమని అంటుంది. మానవులంతా సమానమే అని, ఆపదలో ఉన్నవారిని ఆదుకోమని, తెలియజేస్తుంది. పొరుగువారిని ప్రేమించమని చెబుతుంది. కబీరుదాసు కూడా పరులకు మేలు చేసేదే ధర్మమని చెప్పాడు. ధర్మం మానవులందర్నీ సమానంగా భావిస్తుందని, అది ఎవరికీ హాని చేయదని, ఎవరితోనూ కలహించదని తేటతెల్లం చేశాడు.

ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది అనేది ఆర్యోక్తి. మన కర్తవ్యం ప్రకారం నడవడాన్ని ధర్మం అంటారు. ధర్మం ప్రకారం నడుచుకొంటే కాపాడినట్టే అని గ్రహించాలి. అంటే మనం చేసే పనులు న్యాయబద్ధంగా ఉండాలన్నమాట. ఇలాంటి సందర్భంలోనే 'ఎవరి హద్దుల్లో వాళ్లు ఉండా'లనే మాటను వాడుతూ ఉంటాం. హద్దు దాటి ప్రవర్తిస్తే ధర్మాన్ని అతిక్రమించడం అవుతుంది. అలాంటప్పుడు ఇతరులు తమ ధర్మాన్ని, విధుల్ని తాము సక్రమంగా నిర్వర్తించలేరు. ఇతరుల్నీ వాళ్ల పనులు వాళ్లను చేసుకోనివ్వాలి మనం. అప్పుడే వాళ్ల ధర్మాన్ని మనం కాపాడిన వాళ్లమవుతాం. అంతేకాదు, మన ధర్మాన్ని మనం పాటించినవాళ్లమవుతాం. ఇతరులు కూడా తమ విధి నిర్వహణలో తాము ఉంటూ మన ధర్మానికి అడ్డు రాకుండా ఉండగలుగుతారు.

అగ్రజునికి రాజ్యాన్ని అప్పగించాలనే దశరథుడి విధి నిర్వహణను భంగపరచడంలో, రాముడికి చెందవలసిన రాజ్యాధికారాన్ని తన కొడుకు భరతుడికోసం లాక్కోవడంలో కైకేయి తన ధర్మాన్ని తాను విస్మరించింది. అంతే కాకుండా ఎదుటివారి (దశరథుడి) ధర్మ నిర్వహణకు అడ్డు తగిలింది. అందువల్ల కైకేయికే కాకుండా ఆ కుటుంబసభ్యులందరికీ కలిగిన కష్టనష్టాల్ని రామాయణంలో మనం చూస్తాం. కైకేయి ధర్మాన్ని కాపాడలేదు కాబట్టి ధర్మం ఆమెను కాపాడలేదన్నది స్పష్టమవుతోంది. రాముడి సొత్తును (సీతాదేవిని) రావణుడు అపహరించాడు. అధర్మ మార్గంలో చరించాడు. ధర్మ రక్షణమనే తన కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా ధర్మానికి హాని కలిగించాడు. అందుకే ధర్మం కూడా అతణ్ని రక్షించలేదు.

ఇతరుల హక్కునీ, అధికారాన్నీ మనం గౌరవించాలి. వాళ్ల సొత్తును, సంపదను కబళించాలని ప్రయత్నించకూడదు. ధర్మాన్ని తప్పి ప్రవర్తించకూడదు. ధర్మానికి భంగం కలిగించే పనులు చేస్తే ఎన్నెన్నో ఆపదలు, కష్టాలు మనకు వస్తాయి. పాండవుల సంపదను, రాజ్యాన్ని లాక్కోవడంతో దుర్యోధనుడు ధర్మం తప్పాడు. ధర్మానికి హాని కలిగించాడు. అందుకే ధర్మం కూడా అతణ్ని కాపాడలేదు. ఫలితంగా సర్వనాశనమయ్యాడు.

ప్రజలకు సుఖవంతమైన జీవితాన్ని అందివ్వడం పాలకుడిగా ప్రభువు ధర్మం. ఈ ప్రభు ధర్మాన్ని రాముడు పాటించాడు కాబట్టే 'రామరాజ్యం'గా ఆయన పాలన జనరంజకమైంది.

అమృతాన్ని పొందాలని దేవదానవులు క్షీరసాగర మథనం జరిపారు. ఆ సందర్భంలో బయటపడిన భయంకర విషం తన పెనుమంటలతో లోకాన్ని బూడిద చేస్తుంటే, ప్రభు ధర్మాన్ని పాటించిన పరమశివుడు ప్రజాహితం కోసం ఆ విషాన్ని పానం చేశాడు. ప్రజల్ని కాపాడి ప్రభుధర్మాన్ని పాటించమని పార్వతీమాత కూడా తన భర్తను ప్రోత్సహించింది. ధర్మాన్ని కాపాడినందువల్లనే పార్వతీ వల్లభుడు శుభాలనొసగే శంకరుడిగా స్తవనీయుడయ్యాడు.

భగవంతుడు మనకు ప్రసాదించిన ఆర్థిక, శారీరక, విద్యా బలాలను నిస్వార్థ బుద్ధితో సాటి మానవులకు వినియోగించి మానవ ధర్మాన్ని మనం పాటించాలి. అప్పుడే ధర్మం మనల్ని కాపాడుతుంది.
- కాలిపు వీరభద్రుడు

Friday 4 April 2014

అభయం


డుస్తున్న చంటి పిల్లవాడు... లాలించే యత్నంలో ఉన్న అమ్మను చూసి వూరట చెందుతాడు. సవాలక్ష ప్రశ్నలతో అత్తారింటి గుమ్మంలోకి అడుగుపెట్టిన పెళ్ళికూతురు మనసు- పెళ్ళికొడుకు ప్రసన్నంచేయడంతో కుదుటపడుతుంది. అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధుడికి వైద్యుడి మాటలు ఉపశమనం కలిగిస్తాయి. ఇవన్నీ అంతర్గతంగా అభయహస్తం అందించిన ఉదాహరణలే!
శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడితో 'ఓ సవ్యసాచీ! శత్రువులను జయించు. వాళ్ళంతా ఓడిపోయినవాళ్ళే. నీవు నిమిత్తమాత్రుడవు' అనడం వెనక 'అభయం' ఉంది.

మనసును మంచి కార్యాల్లోకి, ఆచరణల్లోకి మళ్ళించగలిగితే, ప్రక్షాళన పొంది కార్యశూరులుగా నిలబడతాం. అప్పుడు పట్టుదల పెరిగి ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. విశ్వంలో ఎన్ని అవకతవకలు, అన్యాయాలు జరుగుతున్నా శ్రమ, ధర్మం, నీతి, నిజాయతీకి కట్టుబడ్డవారికి 'అంతర్యామి' పరిధిలో సాయం ఉంటుంది. అలా నమ్మకం పెంచుకుంటే 'భరోసా'తో ఆత్మవిశ్వాసం విస్తరించి పనిలో నాణ్యత, క్రమశిక్షణ, జవాబుదారీతనం పెరుగుతాయి. పేదలపట్ల దయాగుణంతో వ్యవహరించాలి. వారికోసం మన చక్షువుల్లో కొంత 'తడి'ని కేటాయించాలి. అంటే, వారి కోసం ఏడవమని కాదు. అభిమానంతో మెలిగితే, ఆర్ద్రత అనివార్యమై మనమే వారికి అభయహస్తంగా నిలబడతాం. అదొక గర్వకారణంగానూ, మానసిక పరిణతిగానూ రూపాంతరం చెందుతాయి.

పూర్వకాలంలో మతపెద్దలు 'ప్రార్థన'కు కొన్ని నియమనిబంధనలు రూపొందించారు. వాటిని పాటించడంవల్ల భగవంతునిపట్ల విశ్వాసం పెరిగి, ధర్మం కోసం ఆలోచనల్లో పడతాం. ఆ కృషి ఫలితమే 'సంతృప్తి' రూపంలోకి మారి మనసు పులకిస్తుంది. సంతృప్తిని మించిన ధనాగారం లేదు కదా! నవ్వును మించిన ఆరోగ్యసూత్రం లేనేలేదు. ఎక్కడో పుడతాం. ఎక్కడో పెరుగుతాం. ఎక్కడో తనువు చాలిస్తాం. ఈ జీవన పరిణామక్రమంలో ఎన్నో సంఘటనలు, సుఖదుఃఖాలు మనల్ని ప్రభావితం చేస్తాయి. ఆ ప్రక్రియలో మనం 'దోషులు'గా నిలబడే సందర్భాలూ ఉంటాయి. మనం సున్నిత హృదయులమైతే ఆ పరిస్థితి పునరావృతం కాకుండా ప్రాయశ్చిత్తం చేసుకుంటాం. అప్పుడు మనోద్వారాలు వికసించి 'ప్రయత్నించు నేనున్నాను' అనే సందేశం వినిపిస్తుంది. ఆ మంత్రంతో కార్యం సులభతరమవుతుంది.

మనం గుడిమెట్లు ఎక్కుతున్నప్పుడు దేవుణ్ని దర్శించాలన్న ఆరాటం ఉంటుంది. మెట్లు దిగుతున్నప్పుడు మనసు, శరీరం తేలికవుతాయి. మనం చేసిన 'నివేదన' అంతర్యామికి అందిందన్నమాట! నివేదించుకోవటం, అభయహస్తం పొందటం రెండూ ఇచ్చి పుచ్చుకోవడాలన్న మాట. దేవుడికి నైవేద్యంగా నీ 'మంచి'ని చూపించుకుంటే 'అభయం' అనే ప్రతిఫలాన్ని పొందుతావు. 
ఆ భావతరంగిణిలో జన్మ సఫలమైందని భావించడమే మోక్షమార్గం.

సూర్యోదయానికి ముందు స్నానాదులు ముగించుకొని దేవుడి గదిలో మంచి మనసుతో దీక్షగా ఆలోచిస్తూ ప్రార్థన కొనసాగిస్తే హాయిగా ఉంటుంది. అలా చేస్తున్నప్పుడు తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల, విద్యాభ్యాసం నేర్పిన గురువు పట్ల, తనతో ఏడడుగులు నడిచిన భార్య పట్ల, సాటి మనుషుల పట్ల తన విధివిధానాల్లో సాయంగా ఉంటానని అనుకోవడం నిరాశా నిస్పృహలను దూరం చేస్తాయి. ఆ 'అభయం'తో శేషజీవిత అనుభవాలు శాంతిగా, ముక్తిమార్గంగా, జీవనమార్గంగా మారతాయి. అదే విజయం!
- గుడిమెట్ల గోపాలకృష్ణ 

Thursday 3 April 2014

ఆనందోపాసన

     ఆనందం అనే అనుభూతి ఎంతటిదో నిఘంటువులు చెప్పలేవు. అది ఉపాసకుడికి తెలుస్తుంది. సుఖం, సంతోషం, ఆనందం వంటివన్నీ నిఘంటువుల్లో పర్యాయపదాలుగా కనపడతాయి. వాస్తవానికి అనుభూతిస్థాయిలో అవి వేరువేరు. ఆధ్యాత్మికంగా చూస్తే వాటిమధ్య అంతరాలు చాలా పెద్దవి. లోకంలో 'ఆనంద బాష్పాలు' అనే మాట వినబడినంత విరివిగా- సుఖ బాష్పాలు, సంతోష బాష్పాలు వంటి పదాలు మనకు వినపడకపోవడానికి కారణం వాటిమధ్య స్పష్టమైన తేడాలున్నందునే! మండుటెండలో తిరిగి తిరిగి వచ్చిన మనిషికి చల్లని చెట్టునీడ ఎంతో ఉపశమనాన్నిస్తుంది. అప్పుడు కలిగే సంతృప్తిని సుఖం అని చెప్పుకోవచ్చు. చెట్టు నీడలోనో, శీతల మందిరాల్లోనో సేద తీరేటప్పుడు మనిషికి సుఖంగా అనిపిస్తుంది. అంటే, అది దేహానికి సంబంధించినది. అలా ఇంద్రియాలకు సంబంధించిన ఒకానొక సంతృప్తిని సుఖంగా మనం అర్థం చేసుకోవాలి.
సంతోషమనేది దీనికంటే పైస్థాయిది. సుఖానుభూతిలో శరీరానికి లేదా ఇంద్రియాలకు మాత్రమే ప్రమేయం ఉంటుంది. మనసుకు సైతం సంతృప్తిని కలిగించేదాన్ని సంతోషంగా చెప్పుకోవచ్చు. లేకలేక బిడ్డ కలిగినప్పుడో, కొడుక్కి మంచి ఉద్యోగం దొరికిందని, కూతురికి చక్కని సంబంధం కుదిరిందని వార్త విన్నప్పుడు మానసికంగా ఎంతో ఉత్తేజం కలుగుతుంది. అలా మనసులో పొటమరించే సుఖానుభూతిని, సంతృప్తిని మనం సంతోషంగా భావించాలి. ఒక్కమాటలో సుఖం- శారీరకం! సంతోషం- మానసికం!

సంతోషకరమైన స్థితిలో అటు మనసు, ఇటు శరీరమూ రెండూ ఉల్లాసంగా ఉంటాయి. కనుక, సుఖంకన్నా సంతోషం కాస్త పైస్థాయికి చెందినదిగా చెప్పుకోవచ్చు. 
ఆనందం అనేది ఆత్మకు సంబంధించిన సుఖానుభూతి. ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే, దైవం మెచ్చుకునే పనులు చక్కపెట్టినప్పుడు వరంగా లభించే సంతృప్తి పేరు- ఆనందం! లోకహితం కోరి కృషిచేసే సజ్జనులకు ఆనందం అనుభవమవుతుంది. ఆనందం అనేది ఆత్మలోకపు దినుసు. అందుకే ఆనందమయ స్థితిలో అప్పుడప్పుడూ కళ్లు చెమరిస్తాయి. సుఖం అనే స్థితిలో ఉన్నవాడెవడూ కంటతడి పెట్టడు. కాబట్టే లోకంలో ఆనందాశ్రువులనే మాటే తప్ప, సుఖాశ్రువులన్నది స్థిరపడలేదు.

సుఖసంతోషాలది శాక్రిన్‌ తీపి అనుకుంటే- ఆనందానిది పట్టుతేనె మాధుర్యం. ఆనందానుభూతిని చవిచూసినవారికి సుఖసంతోషాలతో సరిపెట్టుకోవడం కిట్టదు. మందారమకరంద మాధుర్యాన్ని రుచిచూసిన తేనెటీగ ఉమ్మెత్తపూల జోలికి ఎలా పోగలుగుతుందని ప్రశ్నించాడు పోతన్న. ఆనందోపాసకుడు కాబట్టే ప్రవరుడు సుఖానుభూతిని కోరిన వరూధినిని తృణీకరించాడు. ఆనందమనేది అంత ఉన్నతమైనది కనుకనే బ్రహ్మానందం అన్నమాటే తప్ప- బ్రహ్మసుఖం, బ్రహ్మసంతోషం అనే మాటలు వాంగ్మయంలో మనకు కనపడవు. సుఖం, సంతోషం, ఆనందాల్లోని స్థాయీ భేదాలను గుర్తించిన మనపెద్దలు 'ఆనందోబ్రహ్మ' అని తేల్చి చెప్పేశారు. వేదాంతులు గొప్పగా వర్ణించే అలాంటి అత్యున్నత స్థితిని సాధించాలనుకుంటే మనిషి స్వీయవాస్తవిక స్థితిని చేరుకోవాలని 'మాస్లో' వంటి మానసిక తత్వశాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు.

దాని గురించి సరళమైన భాషలో చెప్పుకోవాలంటే- పరుగులు ఆపేసి, సాధారణంగా జీవించడం. మానవ జీవితంలో అతి సహజంగా లభించే ఆనందాన్ని గుర్తించి, ఆస్వాదించడం మనిషి అలవరచుకోవాలి. పసిపిల్లల్ని చూస్తే మనకది తెలుస్తుంది. వారికి అచ్చమైన ఆనందం కావాలంటే పెద్దపెద్ద ప్రయత్నాల జోలికి పోరు. వెన్నెల విరిస్తే చాలు, వర్షం కురిస్తే చాలు, హరివిల్లు నిలిస్తే చాలు, ఆటల్లో గెలిస్తే చాలు, పక్షులు పిలిస్తే చాలు... ఆనందం ఆవరిస్తుంది. సీతాకోకచిలుక పలుకరిస్తే, అమ్మ దగ్గరకు తీసుకుని ముద్దిస్తే, నాన్న చిన్న బొమ్మేదో కొనిస్తే... ఎంత గొప్ప ఆనందమో! అది సుఖసంతోషాలకన్నా చాలా ఎత్తయిన అచ్చమైన ఆనందం. ఆరాటాలు, ఆతృతలు, ఉద్విగ్నతలు ఏవీ లేని సహజ జీవన మకరందం. 
నిజానికి వారిది చాలా విలువైన ఉపదేశం! నిసర్గ సుందర జీవిత సందేశం! దాన్ని అలవరచుకున్ననాడు మనమంతా అచ్చమైన ఆనందోపాసకులం.
- ఎర్రాప్రగడ రామకృష్ణ 

Wednesday 2 April 2014

మరణానంతర జీవితం

                              
   నూ
రేళ్లు, వీలైతే ఇంకా ఎక్కువకాలం జీవించాలని కోరుకునేవాళ్లెందరో ఉన్నారు. ఎంతకాలం జీవించినా ఎప్పుడో ఒకప్పుడు పోక తప్పదు. ఆది శంకరాచార్యులవారు ముప్ఫై రెండేళ్లే జీవించారు! వెయ్యి సంవత్సరాల తరవాత కూడా ఆయన కీర్తి సజీవంగానే ఉన్నది. ఆయన ఆధ్యాత్మిక శక్తి అజరామరం. నిరుడు వివేకానందుల 150వ జయంతి ఉత్సవాలు దేశమంతటా వైభవోపేతంగా జరిగాయి. యువశక్తితో జాతిని జాగృతం చేయాలని ఆనాడు ఆయన పిలుపునిచ్చారు. నేటి యువతకు వివేకానందులే స్ఫూర్తి ప్రదాత. వివేకానందులు ఎక్కువకాలం జీవించలేదు. ఆయన కీర్తిశేషులైన తరవాత స్వాతంత్య్ర ఉద్యమం వూపునందుకొన్నది. తిలక్‌, గాంధీ, సుభాష్‌... వంటి స్వాతంత్య్రోద్యమ వీరులందరూ తాము స్వామి వివేకానందుల నుంచి స్ఫూర్తి పొందామన్నారు! జీవించి ఉన్నప్పటికంటే, మరణించిన తరవాతే మహాత్ములు ఎక్కువ ప్రభావం చూపిస్తారు!

మనిషి జీవించి ఉన్నప్పుడు ధనాన్నీ, అధికారాన్నీ. పేరు ప్రతిష్ఠలనూ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అతడి ధనాన్ని చూసీ, అధికారానికి ఆకర్షితులై అనేకులు 'ఎందుకైనా మంచిది' అని పొగడ్తలకు లంకించుకుంటారు. పదిమందీ పొగిడితే కీర్తి లభిస్తుంది. ఆ కీర్తిమంతులు భుజకీర్తులు తగిలించుకొని మురిసిపోతూ ఉంటారు. అధికారాంతమున జూడవలెగదా ఆ అయ్య సౌభాగ్యముల్‌- అన్నాడొక కవి. ధనం రావచ్చు, పోవచ్చు. అధికారమూ అంతే... ఇవి నిలకడగా ఉండేవి కావు. వీటిని ఎవరూ వెంట తీసుకువెళ్లలేరు. వారి మరణానంతరం కొందరైనా 'పోయినోడు మంచోడు' అనుకుంటే... వాళ్లు మరణానంతరం కూడా కొంతకాలం జీవించిఉన్నట్లే! అయితే ఆ 'కొందరు' పోయినవాడి దగ్గర అవినీతి సొమ్మును పంచుకున్నవాళ్లు మాత్రం కాకూడదు.

కళాకారుల జీవితంలో ఎక్కువ భాగం కష్టాలతో గడుస్తుంది. ఎక్కువ కష్టాలు అనుభవించినవారి కీర్తి, వారి మరణానంతరం ఎక్కువగా వ్యాపిస్తుంది. సంగీతం, సాహిత్యం, శిల్పం, చిత్రం... అన్ని కళలకూ ఈ సూత్రం వర్తిస్తుంది. వాళ్లు కష్టాలు అనుభవించారని మనం భావించి బాధపడతామే గాని, ఆ మహాత్ములు మాత్రం ఆనందంగానే జీవితం గడిపారు. వేమన వీధులవెంట వెర్రివాడిలాగా తిరిగాడు. ఆయన చెప్పే ఆటవెలదుల్ని పిచ్చిమాటలనుకున్నారు. కానీ... కాలం గడిచేకొద్దీ ప్రజల నాలుకలపై ఆయన ఆటవెలదులు నాట్యం చేశాయి. ప్రజల హృదయాల్లో వేమన సజీవమూర్తిగా నిలిచాడు. 'కవులు హాలికులైతేనేం? అడవుల్లో కందమూలాలు తిని బతికే వాళ్లయితేనేం? కష్టపడి భార్యాబిడ్డల్ని పోషించుకోవడంలో తప్పులేదు' అని చాటిన పోతన పేదరైతు. తెలుగు సాహిత్య సరస్వతికి వెలలేని భాగవత రత్నహారాన్ని సమర్పించిన సంపన్నుడు! శ్రీ కైవల్యసిద్ధి కోసం ఆయన భాగవతాన్ని రచిస్తే, ఆ భాగవత పఠనం తమకు శ్రీ కైవల్యం కలగజేస్తుందని అనునిత్యం పోతన భాగవత పద్యాలను పఠించేవాళ్లెందరో ఉన్నారు.

హంపీ శిల్పాలను చూద్దాం. ఏ శిల్పి చెక్కాడో తెలియదు. సరిగమలు పలికే రాతిస్తంభాల్లో నాటి శిల్పులు జీవించే ఉన్నారనిపిస్తుంది! సృజనాత్మక ప్రతిభకు మరణం లేదు. యోగివేమన, భక్తపోతన, త్యాగయ్య పాత్రలకు ప్రాణం పోసిన మహానటుడు చిత్తూరు నాగయ్య చలనచిత్ర ప్రపంచంలో సజీవుడే! భగవద్గీతను తాదాత్మ్యంతో గానం చేసిన ఘంటసాల అమర గాయకుడే!

జగ వీర పాండ్య కట్ట బ్రహ్మన- తమిళనాడులో ఒక చిన్న పాళెగాడు. స్వాతంత్య్ర సమరయోధుల్లో ప్రథమశ్రేణిలో ఎన్నదగినవాడు. రవి అస్తమించని బ్రిటిష్‌ పాలనను ఎదిరించి నిలిచాడు. తుదకు మేజర్‌ సర్‌ బానర్‌మన్‌ వంచనతో కట్ట బ్రహ్మనను బంధించాడు. ఒక చింతచెట్టుకు ఉరి తీశాడు. ఉరితాడు తగిలించుకునే ముందు కట్ట బ్రహ్మన పలికిన పలుకులు- 'ఇప్పుడుపోయే నా వూపిరి నుంచి లక్షలాది దేశభక్తులు వూపిరి పోసుకుంటారు!' కట్ట బ్రహ్మన భౌతికంగా మరణించినా, కోట్లాది దేశభక్తుల హృదయాల్లో జీవించే ఉన్నాడు!
- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు

Tuesday 1 April 2014

జీవన సూత్రం

 శ్రీకృష్ణదేవరాయలు రాసిన జాంబవతీ కల్యాణం అనే సంస్కృత నాటకంలో భరతవాక్యం ఈ రీతిగా ఉంటుంది.
'నా సామ్రాజ్యాన్ని ప్రజలు ఎన్నటికీ మరిచిపోకుండా ఉండాలి. నేను నా ప్రజల సౌకర్యం కోసం ఇచ్చిన కానుకలు చిరకాలం కొనసాగాలి'

అదే రాయల జీవన సూత్రమైంది. అదే ఆయనను చిరస్మరణీయుణ్ని చేసి సాహితీ సమరాంగణ సార్వభౌముణ్ని చేసింది. ఎంత అద్భుతమైన జీవన సూత్రం ఇది!

రాజ్యం ఏలే చక్రవర్తికాని, ప్రజలు ఎన్నుకునే నాయకుడు కాని ప్రజాక్షేమం గురించి ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకున్నప్పుడే ఆ వ్యక్తి చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతాడు. ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది.

రఘువంశం రాసిన కాళిదాసు రఘువంశీయుల గొప్పతనాన్ని, ఆ రాజుల జీవనసూత్రాన్ని ఇలా కీర్తిస్తాడు. 'సముద్రం నుంచి నీరు తీసుకున్న సూర్యుడు ఆ నీటిని తనలో దాచుకోకుండా వాన రూపంలో మళ్ళీ భూమి మీదకు వర్షిస్తాడు, ప్రజలకు మంచినీటి కొరత తీరుస్తాడు. సూర్యుడు ఉప్పునీటిని తాను స్వీకరించి ఆ నీటిని శుభ్రపరచి అందరికీ ఉపయోగపడేటట్లు మంచినీటిని అందిస్తున్నాడు'

ఆ విధంగానే రఘువంశంలో పుట్టిన దిలీపుడు కూడా ప్రజలకు సేవచేయడానికి మాత్రమే పన్నులు విధించి వసూలు చేసేవాడు. ఎవరు కట్టగలరో ఎవరు కట్టలేరో చూసి వారి నుంచే పన్నులు వసూలు చేసేవాడు. సేకరించిన సొమ్మును ప్రజాప్రయోజనాలకు వినియోగించేవాడని రఘువంశంలో పుట్టిన దిలీపుడి గొప్పతనాన్ని వర్ణిస్తాడు కాళిదాసు.

అందుకే రఘువంశరాజుల కీర్తిప్రతిష్ఠలు చిరస్థాయిగా నిలిచి పోయాయి. కలిసి రక్షించుకుందాం. కలిసి భుజిద్దాం. కలిసి శక్తిమంతులవుదాం. మనకు తేజస్సు కలగాలి. మనం ద్వేషించుకోం. ఒక్క మాటలో చెప్పాలంటే కలిసి ఉంటే కలదు సుఖం అని అర్థం. ఇదే వేదం చెప్పిన జీవనసూత్రం. ఐకమత్యం గొప్పతనాన్ని వేదం ఎంత గొప్పగా చెప్పిందో! అంతేకాదు. వేదం మనిషి ఎలా బతకాలో చెప్పింది.

మనిషి నూరేళ్లు బతకాలి. అదీ ఎలా అంటే చక్కగా చూస్తూ, చక్కగా వింటూ, మంచి మాట్లాడుతూ, ఎవరికీ ఆధీనుడు కాకుండా బతకాలి. ఇలా ఎవరైనా ఉంటే వందేళ్లు బతుకుతారని అర్థం. వేదం శాంతి సౌభాగ్యాల గురించి చెప్పింది. ఎవరి ధనాన్నీ దొంగిలించవద్దని చెప్పింది. ద్వేషం లేని ప్రేమైక సమాజం జాతికి వెలుగునిస్తుందని చెప్పింది. అందుకే వేదం అంటే జ్ఞాన ప్రవాహం. ఇది మనిషి మనసులోని మలినాలను దూరం చేస్తుంది.

అహింసా సిద్ధాంతంతో ముందుకు సాగిన గాంధీజీ జీవనసరళి ఎంత నిరాడంబరమైనదో! ఆ జీవనసూత్రంతోనే ఆయన పురోగమించి కొన్ని కోట్లమందికి ఆరాధ్యులయ్యారు.

నేడు మనిషికి కావలసినది మతాలు, మొక్కుబళ్లు కావు. కావలసినది దయ, ధర్మం. అవే మనిషిని మహోన్నతుణ్ని చేస్తాయి.

ఈ తమోమయ ప్రపంచంలో ఆత్మకు సుఖశాంతులు ప్రసాదించేవి ధన, కనక, వస్తు వాహనాదులు కానే కావు. అందరినీ ప్రేమించాలి. మనకు ఉన్నదాన్ని పదిమందికి పంచాలి. దరిద్రనారాయణుల సేవలో పాలుపంచుకోవాలి. ఇవే మనిషికి జీవనసూత్రాలు కావాలి.

ఈ జీవనసూత్రాలు ఆచరిస్తూ మనిషి ముందుకు సాగితే ఈ సమాజమే నందనవనమవుతుంది. ఆ మనిషి మహోన్నత మానవమూర్తిగా నీరాజనాలందుకుంటాడు.
 - విశ్వనాథ రమ