ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Monday 18 November 2013

గోవిందుడే గమ్యం


 ఎప్పుడూ కల్లోల పరిస్థితుల్లోంచి కమనీయత జనిస్తుంది. కన్నీటి మడుగులోంచే కమలాలు ఉద్భవిస్తాయి. శ్రీ కృష్ణుడి ముఖతా యుద్ధమధ్యంలోంచి భగవద్గీత ఆవిర్భవించింది. అంపశయ్యలోంచే భీష్ముడు విష్ణు సహస్ర నామాన్ని లోకానికి అందించాడు. ముళ్ల మీది నుంచి ముళ్లను వొత్తిగించుకుని వచ్చి వికసిస్తుంది గులాబీ పుష్పం. చీకట్లను చీల్చుకునే వెలువడుతుంది కాంతిపుంజం. మథనం, గరళం తరవాతే జనించింది అమృతం. నిజానికి అందువల్లే దేనికైనా వన్నె, విలువ పెరుగుతాయి.
కల్లోలం, కన్నీళ్లు అనివార్యాలు. నిజానికి అవసరాలు. అవి అనివార్యాలనీ, అవసరాలనీ గుర్తించినప్పుడు కన్నీళ్లు కళ్లను శుభ్రం చేస్తాయనీ, గుండెమంటలు ఆర్పుతాయనీ, కల్లోలాలు అమృతోద్భవం ముందు గరళం వేసే చిందులనీ అర్థం చేసుకుంటాం. భగవంతుడు సంతోషాన్ని, సౌందర్యాన్ని ఇనుమడింపజేయడానికే వ్యక్తిరిక్త, విభిన్న అంశాలను పక్కపక్కనే, లేదా వెంటవెంటనే సృజించాడు. సర్వత్రా వర్జనీయమైన 'అతి'ని నియంత్రించేందుకే మంచైనా చెడైనా... దేన్నయినా దీర్ఘం నుంచి లఘువుగా మలిచాడు.

మనిషి ముల్లు విరిగిందని నడక ఆపడు. ముల్లు తీసుకుని తిరిగీ నడుస్తాడు. ఎండ ఉందని, వర్షం వచ్చిందని పనులు ఆపుకోడు. గొడుగు పట్టుకుని వెళ్లి పనులు ముగించుకుంటాడు. అతి చిన్న అవసరాలను, ఆటంకాలను కూడా ఇంత శ్రద్ధగా సరిచేసుకుని, పూడ్చుకొని ముందుకు వెళ్లే మనిషి జీవనగమ్యమైన, జీవిత సార్థక్యమైన అసలు గమనాన్ని గుర్తించకుండా కష్టాల దగ్గరే కుంగిపోయి, గొంతు కూర్చుని ఆగిపోతున్నాడు. చిన్న అవసరాలకే ఆటంకాలను అధిగమించగలిగే మనిషి అత్యంత పెద్దదీ, అసలుదీ అయిన జీవిత సార్థక్య దిశగా సాగిపోయే క్రమంలో... వచ్చే కష్టాలను, ఆటంకాలను లెక్కచేయవలసిన అవసరం ఉందా? ఓరకంట కూడా చూడరాదు. అక్కడే ఆగిపోయి అత్యంత విలువైన కాలాన్ని వృథా చేయరాదు. జీవితం సుదీర్ఘమైందే. అయితే అన్ని విషయాలకు ఇది వర్తించదు. కొన్ని పనులకు అతి స్వల్పమైంది అవుతుంది. ఈ అల్పకాలంలోనే అనల్ప కార్యాన్ని ముగించుకోవాల్సి ఉంది. అదే సాధన. పరమ పదసోపాన అధిరోహణ. గమ్యం ఎంతో దూరం. దుర్గమం. దుర్లభం. దురూహ్యం కూడా. అయినా పయనించాల్సే ఉంది. చేరుకోవాల్సే ఉంది. ఎందుకంటే, అది మనకు అనివార్యం. కాబట్టి, అత్యంత అవసరం. ఇలాంటి పయనంలో మనం ముళ్లూ రాళ్లనే కాదు. కాలనాగుల్ని, కారు చీకట్లను కూడా అధిగమించాల్సి ఉంటుంది.

ఈ లోకంలో ఏ వస్తువూ మనకు వూరకే రాదు. పొందగోరే అంశాన్ని బట్టి శ్రమో, ప్రేమో, ధనమో, మరేదో పెట్టుబడిగా పెట్టక తప్పదు.

దీపం పురుగులు దీపాన్ని ఆశించి రెక్కలు కాల్చుకుంటాయి. చాలాసార్లు ప్రాణాలే పోగొట్టుకుంటాయి. నిజానికి తాను ఆశిస్తున్నది తనకు ఉపయుక్తమైందేనా, లభించి తీరేదేనా అనే జ్ఞానం, భరోసా వాటికి లేవు. అయినా ప్రయత్నం ఆపవు. మరి మనకో? భగవంతుడనే ఓ జ్ఞానదీపం, అమృత కలశం, వాడని పుష్పం, సర్వ కాలాల్లో, సకల లోకాలను కాచే సర్వశ్రేష్ఠుడు... ఉన్నాడు. మనకు అంది తీరుతాడు. మన శాశ్వత ఆనందం, పరిణామం, ప్రమాణం- ఆయనలో ఐక్యతే. మరెందుకు మనం ప్రయత్నించం, ప్రయాణానికి సన్నద్ధం కాము? ఈ ప్రయత్నం, ప్రయాణం కష్టమే. కఠినమే. అయినా మధురమైనవి. పరిమళభరితమైనవి. ప్రమాదరహితమైనవి. భరోసా ఉన్నది. అన్నింటికంటే ముఖ్యంగా అనివార్యమైనది. మనం ప్రయత్నం మొదలుపెడదాం. ప్రయాణం ప్రారంభిద్దాం. యుద్ధం సాగనీ, మథనం జరగనీ, అంపశయ్య సిద్ధమై ఉండనీ, గరళం గొంతు దిగనీ, బురద పీకలలోతు దింపనీ, కంటకాలు హింసించనీ... జానేదో- ఔను. జానేదో. మనసు మాధవుడితో నిండిపోయినప్పుడు, గమ్యం గోవిందుడైనప్పుడు మనం ప్రహ్లాదులమైపోతాం- నీరు ముంచదు, అగ్ని కాల్చదు, విషం చంపదు!
- చక్కిలం విజయలక్ష్మి 

No comments:

Post a Comment