ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Thursday 7 November 2013

ఆత్మావలోకనం...


త్మ పరిపూర్ణత్వాన్ని మనం అర్థం చేసుకునే వరకు, అనుభూతి పొందేవరకు అపరిపూర్ణమైన ప్రాపంచిక విషయాలపై మక్కువ కలిగి ఉంటాం. పసివాళ్లు వాళ్ల పరిమిత జ్ఞానాన్నిబట్టి వస్తువులకు ఆకర్షితమవుతారు. పెరిగి, వ్యక్తిత్వాన్ని సమకూర్చుకున్న వ్యక్తి అందుకు తగిన వస్తువుల పట్లే ఆకర్షితుడవుతాడు. పిల్లలాశపడే అర్థంలేని వస్తువుల్ని చూసి వాళ్ల అమాయకత్వానికి, అజ్ఞానానికి నవ్వుకుంటాడు. ప్రస్తుతం మన పరిస్థితీ అదే. పసివాడి పరిస్థితి. మానవజన్మ ఔన్నత్వాన్ని గ్రహించక, పరిమిత వస్తుజాలానికి ఆశపడుతూ వాటితో తృప్తిపడుతున్నాం. మనం పశుపక్ష్యాదులకంటే తక్కువ స్థాయిలో ఆలోచిస్తున్నాం. ఆశపడుతున్నాం.
పులి, సింహంలాంటి మృగాలు ఎంత ఆకలిగొన్నా గడ్డి తినవు. గోవు, ఏనుగు మాంసాహారాన్ని ముట్టవు. చకోరపక్షులెంత దాహార్తితో ఉన్నా మేఘాలు వర్షించే శుద్ధజలాన్ని తప్ప నేలమీది నీటికి ఆశపడవు. అవి అసంకల్పితంగానే, అజ్ఞాన దశలోనే వాటివాటి ఆభిజాత్యాన్ని అనుసరిస్తాయి. జాతి మూలతత్వాన్ని నిలుపుకొంటాయి. మరచిపోవు. మనిషి మాత్రమే... మానసికంగా, శారీరకంగా ఎంతో ఉన్నతదశలో ఉన్న మనిషి మాత్రమే దురదృష్టవశాత్తూ తానేమిటో, తానెవరో మరచిపోయాడు. తాహతుకు తగని అల్ప వ్యక్తిత్వంతో తగ్గిపోయాడు. చిన్నబోయాడు. చిన్నపిల్లాడు సరదాపడి పెద్దల పెద్ద చొక్కా వేసుకుంటే వినోదంగా బాగానే ఉంటుంది. కానీ, పెద్దమనిషి చిన్నపిల్లాడి దుస్తులు వేసుకుంటే పరిహాసాస్పదంగా ఉంటుంది. అసహ్యంగానూ ఉంటుంది. మన పరిస్థితి అది. అదే.

ఒక చిన్న మొలక మొలకలాగే ఉండదు. ఎదుగుతుంది. వృక్షమవుతుంది. ఫల పుష్పాదులనిస్తుంది. శీతలఛాయలు పరుస్తుంది. గోవత్సం వత్సగానే ఉండదు. గోవు అవుతుంది. లేదా కోడెదూడ అవుతుంది. వృషభం అవుతుంది. మొనగాడవుతుంది. రైతు బరువుల్ని, బాధల్ని ఒక్క మెడమీద మోస్తుంది. మూపున కాస్తుంది. శిశువుగా పుట్టిన మనిషి శరీరాన్ని పెంచుకుంటున్నాడు. శరాన్ని పెంచుకోవడం లేదు! ఆభిజాత్యాన్ని గుర్తించే శరం, ఔన్నత్యాన్ని గ్రహించే శరం... బేశరం! ఏం చూసుకుని తలెత్తుకు తిరుగుతున్నాం? అద్దంలో శరీరాన్ని చూసుకుని మురవటమేనా? లోపలేముందో గమనించవద్దా?

గుప్తనిధుల కోసం గుళ్లూ, గోపురాలూ తవ్వి చరిత్ర గుండెలు ఛిద్రం చేయటం కాదు. కొలతలకు, అంచనాలకు అందని అపారనిధి ఉంది మన అంతః మందిరంలో, అంతరంగంలో. దాన్ని తవ్వవద్దా, లోతులు తెలుసుకోవద్దా? లోపల ఏ అద్భుత, అపురూప నిధి ఉందో తెలుసుకోవద్దా? శవాన్ని కోతలు పెట్టి అవమానించటం మాత్రమే మనకు తెలిసింది. మలమూత్రాలు, రక్తమాంసాలు నిండిన తుచ్ఛశరీరమా ఇది? కాదు. ముక్కోటి దేవతల మురిపాల మందిరం. మేరుదండ విపంచిపై రుద్రవీణకులా నిట్టనిలువుగా భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాత్మక ప్రతీకలుగా నిలిచిన చక్ర సముదాయం. అధిష్ఠాన దేవతలుగా గణపతి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువుతీరిన నిటారు పవిత్ర ప్రాంగణం. శివపార్వతుల సమ్మేళన కేంద్రం సహస్రార కమలం. రాత్రింబవళ్లు, శుక్ల కృష్ణ పక్ష నియమభేదాల్లేని సూర్యచంద్రుల సదా విరాజమాన సదనాలు నయనాలు. సుషుమ్న ద్వారా ఎప్పుడు పైకెగబాకుతుందో తెలీని కుండలినీ మాత రాకకై సుషుమ్నకు ఇరువైపులా ఇడా పింగళ నాడులుగా శ్వాస అనే వింజామరలు వీస్తూ పైకీ కిందకూ లయబద్ధ విన్యాసం చేస్తున్న అదే సూర్యచంద్రులు. మానవ శరీరంలోని త్రికోణాకార మూలాధార చక్రాన్నే మణిద్వీపంగా మూడున్నర చుట్టలుగా ఒదిగి రాజసంగా నిద్రిస్తున్న దేవి. ఇవేనా? ఎన్నో. ఇదీ మన దేహం. మనం. 'నేను' అనే పవిత్రాత్మ శిలలోని జలలా, టెంక చుట్టిన నారికేళంలోని అమృత తీర్థంలా విరాజమానమై ఉన్న... దేహం.

అద్భుతమైనది ఏదైనా వ్యర్థం మధ్యే ఉంటుంది.. నిగూఢంగా. ఆత్మ అయినా అంతే. ఈ విషయం మనం గ్రహిస్తే ఈ ఆత్మ వజ్రాన్ని ధరించిన ఈ దేహాన్ని 'నేను' అనుకుంటున్న ఈ దేహశకల సముదాయాన్ని ఎంత అజ్ఞానంగా, ఎంత వ్యర్థంగా, ఎంత అర్థరహితంగా వినియోగించుకుంటున్నామో అర్థమవుతుంది. 'నేను' పరిమితం అనుకున్నప్పుడే పరిమితమైన ఆలోచనలు. అంచనాలు, కోరికలు. నేను అని భ్రమ పడుతున్న ఈ శరీరాన్ని శిశువును మోసే పవిత్ర గర్భకోశంలా వికసించనీ, విస్తృతం కానీ. అప్పుడు... తాను ఎంత పవిత్రమో, ఎంత ఘనమో, ఎంత విశాలమో, ఎంత అనంతమో అర్థమవుతుంది.
- చక్కిలం విజయలక్ష్మి 

No comments:

Post a Comment