ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Thursday 12 September 2013

రామానుజుల భక్తిమార్గం


తాను బోధించే 'అష్టాక్షరి మంత్రా'నికి తన శిష్యుడు అర్హుడవునా కాదా అన్న సందేహం వచ్చిందా గురువుకు. ఇంకెవరికీ చెప్పనని మాటిస్తేనే ఆ మంత్రాన్ని ఉపదేశిస్తానన్నాడు గురువు. అతడుగ్గపట్టుకున్నది ఒక్కరోజు మాత్రమే! మర్నాడు గ్రామం మధ్యనున్న గుడిగోపురమెక్కి గొంతెత్తి ఆ మంత్రాన్ని వూరివారందరికీ వినిపించాడా శిష్యుడు.
గురువు కోపంతో మండిపడ్డాడు. 'నువ్వు చేసిన ఘోరానికి నరకానికి పోతా'వని దూషించాడు. 'ఈ మంత్ర ప్రభావంవల్ల వేలమంది స్వర్గానికి వెళ్ళగలిగితే నేను నరకానికి పోవటానికి సిద్ధమే గురువర్యా!' అని శాంతంగా జవాబిచ్చాడు శిష్యుడు.

శ్రీపెరంబుదూరులో వైష్ణవ కుటుంబంలో పుట్టిన శ్రీరామానుజులే ఆ శిష్యుడు. ఆయన గురువు యాదవ ప్రకాశ్‌. తన శిష్యుని జ్ఞానసంపద, భావప్రకాశం, చిత్తశుద్ధికి తనకంటే అతనెక్కడ ఎక్కువ కీర్తి సంపాదిస్తాడో అన్న అసూయాభయాలతో చంపించాలనుకున్నాడు గురువు. కానీ, కారణజన్ముడైన రామానుజులు చేయాల్సిన మహత్కార్యాలెన్నో ఉండబట్టి అలాంటి కుయత్నాలనుంచి తప్పించుకున్నాడు.

రామానుజులకు కులవిచక్షణ అంటే గిట్టేది కాదు. తక్కువ కులంవాడైనా కంచీపూర్ణుడనే సాధువును ఒక రాత్రి తన ఇంటికి పిలిచి అతని కాళ్ళు కడిగి ఆతిథ్యమిచ్చాడు. ఒక సద్బ్రాహ్మణుడీ పని చేయటమేమిటని కంచీపూర్ణుడు సిగ్గుపడిపోయాడు. 'సచ్ఛీలుడైన భగవద్భక్తుడెవరూ కులహీనుడు కాడు' అన్నాడు రామానుజులు.

ఆయన విశిష్టాద్వైత మతాన్ని స్థాపించాడు. మనుషులందరిలోనూ ఉండేది ఏకైక భగవత్స్వరూపమే! బ్రహ్మం, జీవాత్మ, ప్రకృతి ఈ మూడూ అవినాభావ సంబంధం కలిగినవి. జీవాత్మలన్నీ ఆ పరబ్రహ్మ స్వరూపం నుంచి చింది వచ్చిన తేజస్వాంశలే! మనిషి చేయాల్సింది కేవలం భక్తిమార్గంలో తన మూలాన్ని వెతుక్కోవటమే! అన్నింటికీ మూలపురుషుడు శ్రీమన్నారాయణుడు. ఈ జగత్తుకు విష్ణువు తండ్రి. లక్ష్మి తల్లి. మనమంతా వారి అంశలమే!

రామానుజులు శ్రీవైష్ణవ మత సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి సర్వప్రయత్నాలూ చేశాడు. హిందూమత పునరుద్ధరణే ధ్యేయంగా చూపిస్తూ తాము అవలంబిస్తున్న శ్రీవైష్ణవంలో కులాలకు ప్రాధాన్యం లేదని భక్తిచేతనే ఎవరైనా భగవంతుని కరుణకు పాత్రులనీ, అన్ని కులాలవారు సమానులని ఆలయ పూజాసంప్రదాయాల్లో పాలుపంచుకోవటానికి అవకాశం ఉందని చాటాడు. వెనకబడిన జాతులవారిని ప్రోత్సహించటం, హోమాదుల్లో వారు పాల్గొనే అవకాశాలు కలిగించటం, స్త్రీలకూ ఆచార విషయాల్లో ప్రాముఖ్యం కల్పించటం హిందూమతంలోని అన్ని కులాలవారు కలిసికట్టుగా ఉండటానికి దోహదకారి అయింది. రాజులు, రాజ్యాధికారులు, వ్యాపారులు ఇచ్చిన దానధర్మాలు, దేవాలయాలను ఆచార్యులు తీసుకోకుండా వాటిని దేవుడికే అందజేసే సత్సంప్రదాయం అప్పట్నించీ మొదలైందే.

రామానుజులు బ్రహ్మసూత్రాలు, గీతాభాష్యం, శరణాగతి గద్యంవంటి అనేక విశిష్టాద్వైత ప్రపత్తి గ్రంథాలను రచించాడు. దేశాటన చేసి తిరుపతి దేవాలయంలో లాగానే, కర్ణాటకలోని మెల్కోటేలో చెలువ నారాయణ మందిరం వంటి అనేక దేవాలయాల్లో నిర్దిష్ట పూజాసంప్రదాయాలను నెలకొల్పి... భగవంతుడికి మనుషులకు మధ్య ఉండే సంబంధం కేవలం భక్తిమార్గం తప్ప మరొకటి ఏదీ కాదని, లేదని ప్రబోధించాడు!
- తటవర్తి రామచంద్రరావు 

No comments:

Post a Comment