ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Thursday 8 May 2014

ధన్యజీవులు

  మనిషి ఏ రంగంలోనైనా ఎదగవచ్చు. తన అభిరుచి మేరకు ఉద్యోగ, వాణిజ్య, రాజకీయ, ఆధ్యాత్మిక రంగాల్లో దేనిలోనైనా, లేదా అన్నింటా ఎదుగుదలకు ప్రయత్నించవచ్చు. అయితే, తాను ఎన్నుకున్న రంగంలో మనిషి ఒక ఉన్నత స్థితికి చేరుకునేసరికి, వ్యక్తిగా కూడా ఎదుగుదలను తప్పక సాధించాలి. వ్యక్తిగతంగానూ ఔన్నత్యం సాధించి, ఒక రకమైన హుందాతనాన్ని సంతరించుకున్న మనిషిని ఈ సమాజం బాగా గౌరవించి, ఆయన్ను అనుసరిస్తుంది. పెద్ద రాజకీయ నాయకుడయ్యేసరికి, లేదా బాగా డబ్బున్నవాడయ్యేసరికి ఆ మనిషికి పెద్దమనిషి తరహా అలవడాలి. వయసొచ్చినంత మాత్రాన ప్రతి వ్యక్తీ పెద్దవాడవుతాడని లేదు. చాలామంది ముసిలాళ్ళవుతారు. కొందరే పెద్దవాళ్ళవుతారు.
వ్యక్తిగతంగా ఉన్నత స్థితిని సాధించిన మనిషి ఆలోచనల్లో- ఒకానొక సామాజికపరమైన, సాంస్కృతికపరమైన హుందాతనం కనపడుతుంది. లోకానికి హితం చేకూర్చే సద్భావన ఆ ఆలోచనల్లోంచి తొంగిచూస్తుంది. ఆ రకమైన లోపలి ఎదుగుదల లేకుండా మనిషి ఈ లోకంలో గొప్పవాడైపోతే, ఆత్మ లోకంలో ఘర్షణ ఎదురవుతుంది. లోపల ఒక రకంగా, బయటకు మరోరకంగా ఉన్న మనిషిని ఆత్మలోకపు దివాలాతనం వెక్కిరిస్తుంది. నూటికి తొంభైమందిలో ఈవేళ మానసిక అశాంతికి ముఖ్య కారణం ఇదే! సమాజంలో ఉన్నతస్థితిలోనే ఉన్నా, వ్యక్తిగతంగా ఔన్నత్యం లోపిస్తే మనిషికి మనశ్శాంతి కరవవుతుంది. సమాజంలో పెరుగుతున్న కీర్తిప్రతిష్ఠలు- మనిషికి నీడ వంటివి. నీడ మనిషిని మించిపోతోందంటే- సూర్యాస్తమయానికి సమయం సమీపించిందని అర్థం. ఆపై మిగిలేది చీకటే! కనుక కీర్తి కన్నా, ప్రాచుర్యం కన్నా మనిషి స్వీయ వ్యక్తిత్వం తప్పక ముందుండాలి. ఆ రెండింటి మధ్యా సమతుల్యం ఏర్పడాలి.

మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్పేదిదే! ఆత్మలోకపు ఎదుగుదల లేకుండా బయట సమాజంలో మాత్రం పెద్దమనిషిగా చలామణీ అయిపోయేవాళ్లను 'మిస్టర్‌ జకిల్‌-మిస్టర్‌ హైడ్‌'గా వర్ణిస్తారు. పైకి ఉదారవాదాన్ని వినిపిస్తూ, నీతి గురించి ప్రవచించే వ్యక్తి- 'మిస్టర్‌ జెకిల్‌!' లోలోపలి తప్పుడు ఆలోచనలకు ముసుగు తొడిగి ఉన్న అదే వ్యక్తి పేరు 'మిస్టర్‌ హైడ్‌'! మనకు రోజూ ఎదురయ్యేవాళ్ళలో చాలామంది ఇలాంటివాళ్ళే. సభల్లో, బారుల్లో, క్లబ్బుల్లో యూనియన్ల నేతల్లో- ఎక్కువమంది వారే కనబడతారు. ముఖ్యంగా రాజకీయ నేతల్లో వీరి శాతం మరీ ఎక్కువగా ఉంటుంది. దురదృష్టకరమైన విషయం ఏమంటే- అప్పుడప్పుడు అద్దంలో చూసుకుంటున్నప్పుడు కూడా!

'విజయమా, విలువలా... దేనికి మీ ప్రాధాన్యం?' అని ప్రసిద్ధ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌ను అడిగితే ఆయన 'ఓటమి ఎరుగని మనిషిని అనిపించుకోవడం కన్నా- విలువలు వదులుకోని వ్యక్తిగా ఉండటమే నాకు ఇష్టం' అన్నాడు. మహాత్ముడు చెప్పిందీ అదే! ఏం సాధించావు అనేదాని కన్నా, ఎలా దాన్ని సాధించావు అనేది ప్రధానం అనే అర్థంలో బాపూజీ 'సిద్ధి కన్నా సాధనలు ముఖ్యం' అని నిర్వచించారు. విలువల కోసం తాపత్రయపడ్డారు కనుకనే అలాంటివారు చరిత్రలో నిలిచారు. ఎదిగే క్రమంలో ఓడిపోయినా ప్రమాదం లేదుగానీ, విలువలు జారిపోతే మాత్రం- అటు వ్యక్తికీ, ఇటు సమాజానికీ చేటు కలుగుతుంది. కనుక మనిషి బయటే కాదు, లోపలా 'మిస్టర్‌ జెకిల్‌'గానే ఉండాలి. 'హైడ్‌'తో స్నేహం వదులుకోవాలి. అప్పుడే మనిషిలో ఘర్షణ ఆగిపోయి, ప్రశాంతత ఏర్పడుతుంది.

మనిషికి లోపలా బయటా స్థిరపడుతున్న సమతూకాన్ని ప్రముఖ కవి షేక్‌స్పియర్‌ కవితాత్మకంగా వ్యాఖ్యానిస్తూ 'నువ్వు బయటకు ప్రదర్శిస్తున్నదానికన్నా నీలో విషయం ఎక్కువ ఉండాలి. ప్రపంచానికి నీవు చెబుతున్నదానికన్నా నీకు ఎక్కువ తెలిసి ఉండాలి' అన్నాడు. లోకంలో దీనికి విరుద్ధంగా జరుగుతోంది కాబట్టే మనిషికి ఒత్తిడి పెరిగిపోతోంది. లోపల సంఘర్షణ చోటుచేసుకుంటోంది. దీనికి విరుగుడుగా పెద్దలు నాలుగే మాటల మంచి మంత్రాన్ని మనకు సూచించారు. దాని పేరు 'చిత్తశుద్ధి'! ఆ ఒక్కదాన్ని మనిషి కాపాడుకుంటే చాలు. రాజకీయ, వాణిజ్య, ఆధ్యాత్మిక రంగాల్లో మనిషి ఎన్నెన్ని ఎత్తులకు ఎదిగినా- చిత్తశుద్ధిని ఆధార కుడ్జమంగా నిలుపుకొన్ననాడు ఆ మనిషిలో ఘర్షణ ఉండదు. దివాలాకోరుతనం ఉండదు. జీవనరాగం శ్రుతి తప్పదు. అశాంతికి చోటు ఉండదు. బయటా లోపలా మనిషి 'మిస్టర్‌ జెకిల్‌'గానే ఉండగలగడం అంటే- జీవితాన్ని జయించడమని అర్థం. దానికి చిత్తశుద్ధి మూలం. అప్పుడు మనిషి సాధించినదానికన్నా అతడి అర్హత ఇంకా పై స్థాయిలో ఉంటుంది. లోకంలో ప్రాచుర్యంకన్నా, కీర్తికన్నా- అసలు మనిషి ఇంకా ఎత్తులో ఉంటాడు. అలాంటి మనుషుల్నే ధన్యజీవులంటారు.
- ఎర్రాప్రగడ రామకృష్ణ 

No comments:

Post a Comment