ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Tuesday 30 July 2013

స్వీయ గమనిక


మనిషి కళ్లు తెరచిన నాటినుంచి ప్రపంచాన్ని గమనిస్తుంటాడు. చూస్తాడు. వింటాడు. మాట్లాడతాడు. ఆడతాడు. పాడతాడు. నదీప్రవాహంలో పడవలా, కాలవాహినిలో జీవనయానం సాగిపోతుంటుంది.

ఆధ్యాత్మిక ప్రపంచం ఒక అంతర్లోకమనే సత్యాన్ని సామాన్యులు గుర్తించరు. మనిషి వేషభాషలు, ప్రవర్తనను బట్టి అంచనాలుంటాయి. తను ఏమి చేసినా, ఎలా ఉన్నా అది సవ్యమేనన్న భావనతో మనిషి జీవిస్తూ ఉంటాడు. ఎదుటివారి లోపాలను వేలెత్తి చూపుతాడు. తనకు ఏ లోపాలూ లేవనే భ్రమలో ఉంటాడు.

లోపాలు వేలెత్తిచూపటమే పెద్దలోపం!
తల్లిదండ్రులకు, గురువుకు, సన్మిత్రుడికి మనలోని లోపాలు సరిదిద్దే హక్కు ఉంటుంది. ఇతరులు కేవలం మనల్ని అవహేళన చేయటానికే మనలోని లోపాలు వేలెత్తి చూపుతారు. ఇవి మేలుకన్న కీడు ఎక్కువగా చేస్తాయి. ఎందుకంటే, మనసు పసిపాపలాంటిది. ప్రేమగా చెబుతే వింటుంది. నిందిస్తే ఎదురు తిరుగుతుంది. ఎంత మంచి సలహా అయినా తియ్యగా చెప్పాల్సిందే. అప్పుడే మనసు దాన్ని స్వీకరిస్తుంది.

శ్రీకృష్ణుడు 'సత్యం ప్రియం హితం' అనే సూత్రాన్ని మనకు సూచించాడు. ఇది ప్రజా సంబంధాల్లో ప్రాణప్రదమైనది. సత్యమే చెప్పాలి. ప్రియంగా చెప్పా లి. హితం ఉండాలి. ఇది పాటిస్తే మనకు ఎదురుండదు. నిందను మనం భరించలేం కదా... ఇతరుల్ని నిందించే హక్కు మనకెక్కడిది?

బాల్యావస్థలో తల్లిదండ్రులు, గురువులు మన జీవనశైలికి మెరుగులు పెడతారు. ఎన్నెన్నో మందలింపులు, సూచనలు, సలహాలు వారి నుంచి మనకు లభిస్తాయి. వాటిని మహాప్రసాదంగా భావించి స్వీకరించిన వారందరూ జీవితంలో ప్రయోజకులైనవారే. ఉన్నత స్థాయికి చేరుకున్నవారు తమ బాల్యస్మృతుల్ని గర్వంగా చెప్పుకొంటారు. కోట్లు గడించినవారూ ఒకప్పుడు తాము తిండికి లేని వారమని చెప్పుకొనేందుకు సిగ్గుపడరు. వాల్మీకి ఒకనాటి బోయవాడే! కాబట్టి, జీవితసోపానాలు నేలమీద మొదలవుతాయి. మన సంకల్పం, పాదాల శక్తిని బట్టి శిఖరాన్ని చేరుకోగలుగుతాం.

ఆధ్యాత్మిక ప్రయాణంలో స్వీయ గమనిక అత్యుత్తమ విధానమని అనుభవజ్ఞులు చెబుతారు. మనిషి తనను తాను ప్రతిక్షణమూ గమనించుకోవడమే స్వీయ గమనిక. రోజూ అనేకసార్లు అద్దంలో మన ముఖారవిందాన్ని చూసుకుని మురిసిపోతుంటాం. అదే విధంగా బుద్ధిని అంతర్దృష్టిగా మార్చుకోవాలి. అప్పుడు మనం రెండుగా విడిపోతాం. ఒకటి కర్మ శరీరం. రెండోది జ్ఞానదేహం. రెండోది ప్రారంభ దశలో కేవలం మనల్ని గమనిస్తుంటుంది. పోను పోను మనలోని లోపాలు సరిదిద్దే గురువుగా మారిపోతుంది.

పసివాడిగా ఉన్నప్పుడు మనకు తల్లి స్నానం చేయిస్తుంది. పెద్దయ్యాక మనమే శరీర శుభ్రతకు స్నానం చేస్తాం. ఇదీ ఇంచుమించు అలాంటిదే. మనలోని కాలుష్యాలను మనమే తొలగించుకునేందుకు స్వీయగమనిక గొప్ప యోగసాధనగా మనం గ్రహించాలి.

ఒకసారి స్వీయ గమనికకు అలవాటుపడ్డాక మనలో చాలా చాలా మార్పు వస్తుంది. ఆత్మప్రకాశం మనకు అనుభవంలోకి వస్తుంది. అంతర్యామితో మన బంధం బలపడుతుంది. అదే స్వీయగమనిక అసలు ప్రయోజనం.                                                             - కాటూరు రవీంద్రత్రివిక్రమ్‌ 

No comments:

Post a Comment