ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Tuesday 14 May 2013

వినయం

  అతి వినయం ధూర్త లక్షణం అన్నారు. అదెంతవరకు నిజమో తెలియదు కాని ఈ కాలంలో కాగడా పట్టుకుని వెదికినా వినయం కనిపించదు. ప్రతి ఒక్కరూ మహారాజే. తప్పనిసరి అయితేనే తలవంచుతారు. ఆ తరవాత బోర విరుచుకుని తిరుగుతారు. మంచి-చెడ్డ, నీతి-న్యాయం, పెద్ద-చిన్న అనే మాటలకు అర్థాలు మారిపోయాయి. కాలానుగుణంగా మార్పులు వస్తాయి, స్వీకరించాలని అందరూ అంటూ ఉంటారు. అదెంతవరకు నిజం?
      బతుకులో ఒక అయోమయం ఉంది. అయోమయంలో ఒక్కో బతుకు ఉంది. ఈ పరిస్థితి ఇలా కొనసాగితే మానవ సంస్కృతి అటకెక్కిపోతుంది. పురాణాలు కథలుగానైనా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందా? ధర్మాలు శాసనాలకు పరిమితమైపోయి మ్యూజియంలో మగ్గుతుంటాయి. దేవుడు అనే పదానికి అర్థం లేకుండాపోతుంది. మతం బూజు పట్టిపోతుంది. మంచితనం కనుమరుగై పోతుంది.
        పెద్దవాళ్లను గౌరవించకపోవడం కాలానుగుణంగా వచ్చిన మార్పా? ధర్మాత్ములను శ్లాఘించకపోవడం ప్రకృతిలో చోటుచేసుకున్న పరిణామమా? విచ్చలవిడితనం, ఆకతాయితనం, దుర్మార్గత్వం జీవనశైలిలో వచ్చిన సహజమైన మార్పులా? కానే కాదు. ఏది సహజమో ఏది అసహజమో తెలుసుకోవాలి. ఏది అపరాధమో, ఏది స్వయంకృతాపరాధమో గ్రహించాలి. స్వార్థం లోంచి పుట్టినవేవో, త్యాగమే ఆలంబనగా లోకంలో కొనసాగుతున్నవేవో జల్లెడ పట్టాలి.
       వినయ విధేయతలు కలిగినవాళ్లు, కపటం లేనివాళ్లు, నిజాయతీతో కూడిన ధర్మాచరణ కలిగినవాళ్లే దైవసమానులని పూజలందుకుంటారు. దైవం చేత గుర్తింపు పొందుతారు. వినయం బానిసత్వ చిహ్నమని, వూడిగం చేసేవాళ్ల లక్షణమని అనుకుంటే అది మన తప్పు. వినయమే విద్యాసంపన్నుల లక్షణం. వినయమే నిజమైన పాండిత్యానికి భూషణం. వినయం లేని ఏ విద్యా ప్రకాశించదు. వినయం వల్లనే సమస్తం మన ఆధీనంలోకి వస్తుంది. ఎంత గొప్ప స్థితికి చేరినా వినయం విడిచిపెట్టనివారే అసలైన గొప్పవారు. గొప్పవాళ్లుగా చాటుకునేవాళ్లు, లేనిపోని గొప్పతనం తెచ్చిపెట్టుకుని సొంత డబ్బా వాయించుకునేవాళ్లు- వినయాన్ని నటిస్తారు. వాళ్లు ఎన్నటికీ శాశ్వతమైన కీర్తిని సంపాదించలేరు. సహజంగా వినయగుణం కలిగినవారు ఎదిగినకొద్దీ ఒదుగుతారు. ఒదిగిన కొద్దీ ప్రకాశిస్తూ ఉంటారు.
        సూర్యుడు ఎంతో గొప్పవాడు. సూర్యోదయం ఎంత ఆనందకరంగా ఉంటుంది. కాని, ఆయన లోకంలోకి వస్తున్నాడంటే ఏ మేళతాళాలూ ఉండవు. ముందు వెనక ఎర్రలైట్లు తిప్పుకొంటూ వాహనాల హడావుడి కనిపించదు. ఎంతో నిరాడంబరంగా సాదాసీదాగా తన పని తాను చేసుకుపోతాడు. ఇంద్రాది దేవతల్లో తాను ఒకడిగానే ఉన్నాడు. అష్టదిక్పాలకుల్లో తాను ఒకడిగానే ఉన్నాడు. నవగ్రహల్లో తాను ఒకడిగానే ఉన్నాడు. ఇంద్రుడి ముందు తలవంచుతాడు. భూమికి కావలసిన శక్తి పంచుతాడు. వినయంగా ఉండి ప్రకాశించడం ఎలాగో- సూర్యుణ్ని చూసి తెలుసుకోవాలి. చంద్రుడు, వాయువు, వరుణుడు, అగ్ని... అందరూ ఇంతే. మహామహాశక్తులే విష్ణువు ముందు తలవంచుతాయి. వినయ విధేయతలు ప్రదర్శిస్తాయి.
         మరి, మనకెందుకు గర్వ అహంకారాలు? ఏం చేసుకోవాలి వాటితో? అందరూ మనలను వదిలిపోవడానికా? వానపాముల్లాంటి వాళ్లు కూడా తాచుపాముల్లా ఉందామనుకుంటారు. తాచు పామైనా వానపాములా ఉంటే చంపేస్తారని అందరి భావన. అదెంతవరకు నిజం?
     మంచితనానికి మించిన భూషణం లేదు. వినయానికి మించిన సంపద లేదు. పారిజాత పుష్పానికి ఇచ్చే గొప్పదనం గడ్డిపువ్వుకు లేకపోయినా, దాని స్థానంలో అది గొప్పదే కదా. ఎవరి స్థానంలో వాళ్లు ఉంటూ ఇతరుల స్థితిని గుర్తించాలి. గౌరవించాలి. అది తప్పుకాదు. అలా మనం ఒక రోజున ఉన్నత స్థితికి చేరుకుంటాం.
      వినయ విధేయతలు లేకుండా పనిచేసే సేవకుణ్ని ఒక యజమాని ఎంతవరకు భరిస్తాడు? అసలెందుకు భరించాలి? బుద్ధిచెప్పి దార్లోకి తీసుకువస్తాడు. లేదంటే 'నీ కర్మ' అని వాణ్ని వదిలేస్తాడు. అలాంటి 'పని'వాడు ఎక్కడున్నా పనిచేసే వాతావరణాన్ని పాడుచేస్తాడు.
       ఒక గొప్ప చిత్రకారుడు. వినయం లేదు. అతడి పరిస్థితి ఏమిటి? ఒక గొప్ప సంగీత విద్వాంసుడు, వినయం లేదు. అతడి భవిష్యత్తు ఏమిటి? ఒక గొప్ప కళాకారుడు. వినయం లేదు. అతడిని ఎవరు ఆదరిస్తారు. నిజం చెప్పుకోవాలంటే వినయం లేకుండా గొప్పదనం రాదు. ఒకవేళ వచ్చినా అది నిలబడదు. ఎవ్వరూ దీన్ని కాదనలేరు!
                                                                       - ఆనందసాయి స్వామి

No comments:

Post a Comment