ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Tuesday 28 May 2013

వైవిధ్యం

                             
         తెల్లగా మెరిసిపోయే రెండు సమాంతర గోడలున్నాయి. వాటి మధ్య ఒంటరిగా ఒక మనిషి ప్రయాణిస్తున్నాడు. పరిశుభ్రంగా, చక్కగా ఉన్నాయే అని పది అడుగులు వేశాడు. కనుచూపు మేరలో మరో నరుడు కనబడలేదు. వడివడిగా మరో వంద అడుగులు వేశాడు. నరుడేకాదు; పురుగు కూడా లేదు. అటూ ఇటూ చూస్తే ఒకే రంగు. తల తిరిగినట్లయింది. ముందుకు పరుగెత్తాడు. తెలుపు... తెలుపు... ఒకే రంగు! భయం వేసింది. కాసేపటికి పిచ్చిగా కేకలు వేస్తూ పడిపోయాడు. అతడిలో ఒంటరితనమూ, నిస్సహాయతా... అన్నింటికంటే మించి వైవిధ్య రహితమైన దృశ్యమూ విపరీత పరిణామానికి దారితీశాయి. భగవంతుడు ఈ లోకంలో అన్నింటికీ తగు స్థానాన్ని కల్పించాడు. అవేవీ ఒకే జాతివి కావు. గడ్డిపోచ నుంచి మహావృక్షం వరకు, ఏక కణ జీవి నుండి ఏనుగు వరకు... ఎన్ని రకాలో! చిన్నపుట్టలు గుట్టల నుంచి మహాపర్వతాల వరకు ఎన్నెన్నో పరిమాణాలు. ఆకుపచ్చని చెట్టుకు ఎర్రటి పూలు! ఆ చెట్టుపై రంగు రంగుల రెక్కలతో ఎగిరే సీతాకోక చిలుక!

భారతీయుల దృష్టిలో ప్రతిదీ భగవత్‌ స్వరూపమే! సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే కొండల్నీ, గోవుల్నీ పూజించమని నందాదులకు సూచించాడు. ఈ భూమిని రక్షించడానికి శ్రీహరి చేపగా, తాబేలుగా, వరాహంగా అవతారాలెత్తాడు. గజముఖుణ్ని విఘ్నేశ్వరుడిగా పూజిస్తాం. కపివరుడైన హనుమంతుణ్ని పూజిస్తే శ్రీరాముని పూజించినట్లే! ఆంజనేయుడి గుండెలోనే తారక రాముడు కొలువై ఉన్నాడు. ఈ పౌరాణిక గాథల సారాంశం ఒక్కటే! భిన్న ఆకృతులతో కనబడే స్వరూపాలన్నీ భగవదంశలేగాని వేరుకాదు.

మానవుడు బుద్ధిజీవి. బుద్ధిని మంచికీ చెడుకీ- దేనికైనా ఉపయోగించవచ్చు. లోకమంతా తన చెప్పుచేతల్లో ఉండాలనుకోవడం రాక్షసత్వం. ప్రకృతిని వశం చేసుకొనే ప్రయత్నంలో మానవుడు రాక్షసుడవుతున్నాడు. ఒక్కొక్క జాతినీ హరిస్తున్నాడు. పట్టణాల్లో పిచ్చుకలు మచ్చుకైనా లేకుండా మాయమయ్యాయి. కాకులు కరవైపోతున్నాయి. రసాయన పదార్థాల దెబ్బకు ఇప్పటికే వేలకు వేల వృక్ష, జంతు జాతులు అంతరించిపోయాయి.

'బుద్ధి'కి పరమార్థం ఏమిటి? ప్రకృతిని భగవంతుని ప్రసాదంగా స్వీకరించి పరిరక్షించడం. 'బుద్ధిహీనత' అంటే? ప్రకృతిని పరిమార్చడం. కొండలను బండరాళ్ల కుప్ప అనుకుంటాం. హిమాలయాలు మాయమైన మరుక్షణం మన దేశం మనగలుగుతుందా? జీవనదులు ప్రవహిస్తాయా? ఇవన్నీ అంతరించిపోయిన తరవాత ఆ ప్రాంతానికి ఒక అందమా చందమా, ఒక చెట్టా పుట్టా? అప్పుడు కనబడే దృశ్యం ఒకటే! ఎటు చూసినా 'కాంక్రీటు' అరణ్యాలు. బండగుండెల మనుషులు. జీవజాలపు అస్తికల పర్వతాలు! ఒక వైవిధ్యానికి తావులేదు. ఎటు చూసినా ఒకే జీవజాతి. అదే మానవజాతి. చోటుకోసం, నీటికోసం, తుదకు గాలికోసం పోటీపడే మానవజాతి! పేరుకు మానవులు. ప్రవర్తనలో దానవులు. దేవాలయ స్థలాలూ, ఆస్తులూ వారి ఆకలికి చాలవు. వారి తర్కం ఒక్కటే! 'మనకే గతి లేకపోతే ఈ రకరకాల జీవులన్నింటినీ రక్షించడమేమిటి? వాటన్నింటినీ మనం ఆహారంగా ఉపయోగించుకుంటే తప్పేమిటి? పాపంలేదు. పుణ్యం లేదు! మన ఉనికే సత్యం, మిగతాదంతా కల్పన!' ఈ తర్కం కర్కశత్వానికి దారి తీస్తుంది. తన ఉనికిని రక్షించుకునే ప్రయత్నంలో సాటి జీవులకు మనుగడ లేకుండా చేస్తాడు. తెల్లవాడు లోకాన్నంతా తెల్లవాళ్లే పరిపాలించాలనుకుంటాడు. తెల్లతోలు గల మానవజాతి శ్రేష్ఠమైనదని నమ్మిస్తాడు. ఎదిరిస్తే ప్రాణాలు హరిస్తాడు. 'తెల్లగా ఉండటం అందం' అని అందరూ భ్రాంతిపడేలా చేస్తాడు. కానీ లోకంలో ఎంత వైవిధ్యం ఉంది. అందం రంగుకు సంబంధించిన సంగతి కాదు. కృష్ణుడిది ఏ రంగు? ఆ నల్లనివాడి దివ్య సౌందర్యాన్ని దర్శించి భక్తులు ధన్యులయ్యారా లేదా? అది త్రిజగన్మోహనమా కాదా? ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క రంగు. ఒక్కొక్క దైవానికి ఒక్కొక్క వాహనం! అంతా వైవిధ్యమే! అదే స్వామి- శ్రీరంగంలో ఒకరీతి, పండరి క్షేత్రంలో ఒకతీరు. అందంలో, అలంకారంలో... ఎంత వైవిధ్యం! అదే కన్నుల పండుగ! ఈ వైవిధ్యమే జీవితాన్ని రంగుల కలగా మారుస్తుంది. కష్టాలను మరపిస్తుంది. మనం చేసే అలంకారాల్లోనే ఇన్ని రకాలుంటే, దేవుడి సృష్టిలో ఇంకెన్ని ఉండాలి? వైవిధ్య భరితమైన ఈశ్వర సృష్టిని రక్షించడానికే మానవుడికి 'బుద్ధి'ని ప్రసాదించాడు. ఆ బుద్ధి సరైన విధంగా ఉపయోగించేటట్లు చేయమని తిరిగి ఆ పరమేశ్వరుణ్నే ప్రార్థించవలసివస్తోంది.
                                                  - డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు 

No comments:

Post a Comment