ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Friday 31 May 2013

సరస్వతీ నదీ పుష్కరాలు



సరస్వతీ నదీ ప్రశంస రుగ్వేదం 'నదీ స్తుతి'లో కనిపిస్తుంది. ఇది హిమాలయంలోని శివాలిక్‌ పర్వతశ్రేణిలోని హాక్రాఘగ్గర్‌ ప్రాంతాల మీదుగా ప్రవహించేదని ఇతిహాసం చెబుతోంది. కాలాంతరంలో సరస్వతీ నది అంతర్థానమైపోయింది. దాని గమనాన్ని కనిపెట్టడానికి 'నాసా' విస్తృతమైన శాస్త్రీయ పరిశోధనలు జరుపుతోంది. ప్రస్తుతం ఒక అంతర్వాహినిగా సరస్వతీ నది గంగా యమునలతో చేరి త్రివేణి సంగమమైంది. గుజరాత్‌, హర్యానా, రాజస్థాన్‌లలో ఈ పుష్కర కోలాహలం మెండుగా కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని త్రివేణీ సంగమస్థానమైన అలహాబాద్‌ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు.

పుష్కరం అంటే కమలపుష్పం అని ఒక అర్థం ఉంది. విష్ణు సహస్రనామాల్లో 'పుష్కరాక్షః' అన్న నామం రెండు పర్యాయాలు ఆవృతం కావటం గమనించదగ్గ విశేషం. సూర్య కిరణ స్పర్శవల్ల వికసించిన పద్మంవంటి కన్నులు కలవాడని, ఆ కన్నులు కృపారసం వర్షించేవనీ రెండు రకాలుగా చెప్పుకోవచ్చు.

పుష్కరనామాన్ని బ్రహ్మకు, శివుడికి వర్తింపజేస్తున్నాయి కొన్ని పురాణగాథలు. పుష్కర తీర్థంలో బ్రహ్మాలయం ఉంది. పరమశివుడు సతీదేవి వియోగం వల్ల జలజల రాల్చిన కన్నీరు మున్నీరై అన్ని దిక్కుల్లో ప్రవహించిందట. ఇక్కడ పుష్కర శబ్దానికి జలం అన్న అర్థం అన్వయిస్తుంది. 'పుష్కరం సర్వతో ముఖం'- దాని గుణం అంతటా ప్రవహించటం.

బృహస్పతిని నవగ్రహాలకు అధిపతిగా తలచటానికి కారణం అతడి 'గురు' స్థానం. గురువుల్లో అగ్రగణ్యుడు, పైగా శుభాలు ఇచ్చేవాడు కాబట్టి, ఒక్కొక్క రాశిలో ప్రవేశించగానే ఒక్కొక్క నదికో పుష్కరయోగం కలుగుతుంది. ఇలా పన్నెండు రాశుల్లో పర్యటిస్తూ ఉండటంవల్ల పన్నెండు నదులు పుణ్యతీర్థాలుగా మారి పుష్కర ఘట్టానికి తెరలేస్తుంది. మళ్ళీ గురుడు ఆ రాశిలో ప్రవేశించటానికి పన్నెండు సంవత్సరాలు కావాలి. ఒకసారి పుష్కర యోగం పట్టిన నదిలో స్నానం చేస్తే అన్ని పాపాలు పటాపంచలవుతాయని ప్రజల విశ్వాసం. శుభాలు చేకూరగలవన్న నమ్మకంతో ప్రజలు ధారాళంగా దానధర్మాలు చేస్తారు. భక్తిశ్రద్ధలతో పితృకార్యాలు నిర్వహిస్తారు. పన్నెండు రోజుల దాకా పుష్కరుడు, దేవతలు దిగివచ్చి ఆ నదీ జలాలను పునీతం చేస్తారు కాబట్టి మిగతా నదుల దృష్టికూడా పుష్కర నదీ ముఖంగా ప్రవహిస్తాయి. పుష్కరం పన్నెండేళ్లకు ఒకసారి రావటంవల్ల ఆ కాలమానం ఒక కొలమానంగా ప్రజాదృష్టిలో నిలిచిపోయింది. పుష్కర స్నానాభిలాషతో దేశం నలు చెరగుల నుంచి జనసందోహం తరలి రావటం సహజం. కుల, మత, జాతి భేదాలు మరచి స్నానాలు చేయటం ఒక దృశ్యకావ్యంగా పర్యాటకులు భావిస్తారు. భారతీయ సంస్కృతిలోని 'భిన్నత్వంలో ఏకత్వా'నికి ఈ స్నానఘట్టం ఒక దర్పణం లాంటిది.

బృహస్పతి (గురుడు) మిథున రాశిలో 31.5.2013 ఉదయం 7.17గంటలకు ప్రవేశిస్తున్నట్లు పంచాంగం చెబుతోంది. వైశాఖ బహుళసప్తమి మొదలు పదకొండు రోజుల దాకా సర్వస్వతీ నదీపుష్కరాలు జరుగుతాయి. ఉత్తరప్రదేశ్‌లోని భీంపూర్‌, అలహాబాద్‌నగరాలు ముఖ్య కేంద్రాలు. గురుడు కన్యారాశిలోకి రాగానే కృష్ణా నదికి (విజయవాడ), తులారాశిలో కావేరి నదికి (శ్రీరంగం), వృశ్చికంలో తామ్రపర్లినదికి (బాణా తీర్థం), ధనుస్సులో పుష్కరిణీ నదికి (అజ్మీర్‌), మకరంలో తుంగభద్రనదికి (కర్నూలు), కుంభంలో సింధునదికి (కాశి), మీనంలో ప్రణీతానదికి (చోప్రా), మేషంలో గంగానదికి (హరిద్వార్‌), వృషభంలో నర్మదానదికి (నారీశ్వర్‌), కర్కాటకంలో యమునానదికి (మధుర), సింహంలో గోదావరి నదికి (రాజమహేంద్రి) పుష్కర యోగం పడుతుంది. సింధునది ప్రస్తుతం పాకిస్థాన్‌ పరం కావటంవల్ల కాశికాపురిలోని గంగానదీ స్నానంతో సరిపెట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఏది ఏమైనా పుష్కర నదీస్నానాలు విదేశీయుల దృష్టిని కూడా ఆకర్షించి, అంతర్జాతీయ ఖ్యాతిని గడించటం భారతజాతికి గర్వకారణం
                                                                   - ఉప్పు రాఘవేంద్రరావు 

No comments:

Post a Comment