ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Wednesday 6 November 2013

నాగులచవితి

పాముల ఆరాధన ఈనాటిది కాదు. ఎన్నో యుగాలనాటిది. సౌభాగ్యానికి, సత్సంతాన ప్రాప్తికి సర్పపూజ చేయడం లక్షల శరత్తుల కిందటే ఉన్నట్లు ఎన్నో పురాణాలు చెబుతున్నాయి. దేశంలోని అనేక ఆలయాల్లో మెలికలు తిరిగిన నాగరాజు విగ్రహాలు కనిపిస్తాయి ఇప్పటికీ.

దీపావళి అనంతరం వచ్చే కార్తిక శుద్ధ చవితిని నాగుల చవితిగా పండగ చేసుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. పాముల్ని ఆరాధించే భారతీయ సంస్కృతి ఆంతర్యం ఏమిటి? ప్రకృతిలోని సమస్త ప్రాణుల్లో దైవత్వం అదృశ్య రూపంలో పరివ్యాప్తమై ఉంటుంది. ప్రాణికోటిని కాపాడుకొంటే సమస్త మానవకోటి మనగడకు ముప్పు వాటిల్లదు. పర్యావరణ సమతుల్యానికి విఘాతం కలగదు. చెట్లలో, పుట్లలో, రాయిరప్పల్లో, కొండకోనల్లో, నదుల్లో దైవత్వాన్ని వీక్షించింది భారతీయ సంస్కృతి. అందులో భాగంగానే నాగరాజుగా, నాగదేవతగా పామును పూజిస్తూ వస్తున్నారు.

భూమిలో పాములు నివసిస్తూ జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా పూర్వీకులు భావించారు. పంటల్ని నాశనం చేసే క్రిములు, కీటకాలను భక్షిస్తూ, పరోక్షంగా రైతుకు పంటనష్టం రాకుండా చూస్తాయట. విషసర్పాల మాట వినగానే భయపడి పారిపోతాం. విషసర్పాలకు మించిన దుష్ట మానవులు మన మధ్యే తిరుగుతూ నిష్కారణంగా కాటేస్తుంటారు.

శరీరంలో నాడులతో నిండిన వెన్నెముకను వెన్నుపాము అంటాం. కుండలినీ శక్తి మూలాధార చక్రంలో పాము ఆకృతిలో ఉంటుంది. నాగుల చవితినాడు విషసర్పంపుట్టను పూజించి, పాలుపోస్తే, మనిషిలోని విషసర్పం కూడా శ్వేతవర్ణం పొంది హృదయాల్లోని మహావిష్ణువుకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా భాసించాలన్న కోరిక నెరవేరుతుందని పెద్దలు చెబుతారు.

సర్పారాధనకు తామరపుష్పాలు, కర్పూరం, పూలు, లడ్డు మొదలైనవి శుభప్రదమైనవి. సర్పారాధన చేసేవారి వంశం తామరతంపరగా వర్ధిల్లుతుందని భవిష్యపురాణం చెబుతోంది. మన దేశంలోని ఎన్నో ఇళ్లలో ఇలవేలుపు సుబ్రహ్మణ్యేశ్వరుడే.

నాగర్‌కోయిల్‌ అనే వూరిలో ఒక నాగుపాము విగ్రహం ఉంది. దాని సమీపంలో తెల్లని ఇసుక ఆరునెలలు, నల్లని ఇసుక ఆరునెలలు ఉబికివస్తుందని భక్తులు చెబుతారు. పాము కుబుసానికి ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. గరళాన్ని ఆయుర్వేద మందుల్లో తగు మోతాదులో ఉపయోగిస్తారు.

నక్షత్ర మండలాలు సర్పాకృతిలోనే ఉన్నాయంటారు. నాగలింగం పువ్వులో పుప్పొడి సర్పాకృతిలోనే ఉంటుంది. శివుడి మెడనిండా సర్పాకృతిలోని హారాలు మెరుస్తుంటాయి. నాగేంద్రుని శివభావంతో చవితినాడు అర్చిస్తే సర్వరోగాలు నశించి సౌభాగ్యవంతులవుతారని రుషివాక్కు..
- కె.యజ్ఞన్న 

No comments:

Post a Comment