ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Wednesday 13 November 2013

క్షీరాబ్ధి ద్వాదశి


కప్పుడు ఈ దేశంలో పిల్లా-మేక, పశువూ-పక్షి, చెట్టూ-చేమ మానవ పరివారంలో భాగంగా ఉండేవి. మనిషి వాటితో కలిసి బతికేవాడు. గోవును దేవతా స్వరూపంగా భావిస్తూ గోమాతగాను, భూమిని భూమాతగాను గౌరవించడం ఈ దేశ సంస్కృతిలో భాగం. తులసి, ఉసిరి, మామిడి, రావి, మారేడు, జమ్మివంటి వృక్షజాతులను సైతం పూజించడం ఈ దేశంలో ఆచారం. మన పండుగలు, పర్వాలు ఈ ఆచారాలను, వ్యవహారాలను పదేపదే గుర్తుచేయడానికా- అన్నట్లుగానే ఉంటాయి. తక్కిన ప్రాణికోటితో మనిషికి ఒకానొక బంధాన్ని ముడివడేలా చూసుకుంటూ, మన పెద్దలు కొన్ని విధివిధానాలు రూపొందించారు. కార్తికంలో వచ్చే క్షీరాబ్ధి ద్వాదశి పర్వదినం అందులో భాగం. తులసి మొక్కకు, ఉసిరి చెట్టుకు కార్తికమాసంలో ఎంతో ప్రాధాన్యం ఉంది.

కార్తిక శుద్ధ ఏకాదశిని 'ప్రబోధనా ఏకాదశి' అంటారు. ఆనాడు శ్రీ మహావిష్ణువు పాల కడలిపై పవళింపును చాలించి, తులసి వనానికి చేరుకుంటాడట. బ్రహ్మాది దేవతలు సైతం ఆయనతోపాటు కదిలివచ్చి తులసి వనంలో కొలువుంటారంటారు. మరునాడు ద్వాదశి పూట క్షీరాబ్ధి ద్వాదశి భావనతో- దీపదానాలు చేసి 'క్షీరాబ్ధి శయన వ్రతం' ఆచరించాలని వ్రత గ్రంథాలు సూచిస్తున్నాయి. శ్రీకృష్ణుడితో తులసికి పెళ్ళయిన రోజిది. కనుక ఈ రోజు 'తులసి వివాహ పర్వం' నిర్వహిస్తారు. కృష్ణుడు తనకు బాగా ఇష్టమైన చోట్లు మూడు- అని ఉద్ధవుడికి చెప్పాడట. భక్తుల హృదయాలు కృష్ణుడికి బాగా ప్రీతికరమైన స్థానం. తపస్వుల సన్నిధానం రెండోది. మూడోది- తన ప్రియురాలైన తులసితో కలిసి ఉండటం కృష్ణుడికి చాలా ఇష్టం. ఈ కథను ఆధారంగా చేసుకుని క్షీరాబ్ధి ద్వాదశినాడు తులసి వివాహ పర్వాన్ని ఆచరించడం ఆనవాయితీగా మారింది. నూతన వస్త్రాలు, గాజులు, పసుపుకుంకుమలతో తులసి మొక్కను అలంకరించి- కృష్ణుడి మూర్తికి, తులసి మొక్కకు మధ్య అడ్డుగా తెరను పట్టుకుని వివాహతంతు నిర్వహిస్తారు. కొన్నిచోట్ల కాయలతో ఉన్న పచ్చని ఉసిరి కొమ్మను తెచ్చి, తులసి కోటలో పాతి దీపారాధన చేయడం ఆచారంగా వస్తోంది. వేప, రావిచెట్లు రెండూ కలగలిసి ఉన్నచోట వాటిని లక్ష్మీనారాయణ స్వరూపంగా పూజించినట్లే; తులసిని లక్ష్మిగాను, ఉసిరికను నారాయణుడిగాను ఆరాధించడం- క్షీరాబ్ధి ద్వాదశి నాటి ఆచారం.

తులసి మొక్కను అనునిత్యం అర్చించినట్లే ఉసిరిక చెట్టును కార్తిక మాసమంతటా పూజించాలని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. అమలక తరువు అనేది తెలుగులోకి వచ్చేసరికి ఉసిరి పక్కన 'క' చేరి ఉసిరిక చెట్టు అవుతోంది. దీన్నే ధాత్రీ వృక్షమనీ పిలుస్తారు. ఉసిరి చెట్టు నీడ సోకే చెరువునీట స్నానం కార్తిక మాసంలో చాలా పవిత్రం. కార్తిక వన సమారాధనలు ఉసిరి చెట్టు నీడలో నిర్వహించడం అందరికీ తెలిసిన విషయమే! ఏ తోటలో అయినా ఉసిరి చెట్టును ఒక దాన్నయినా పెంచడం శుభప్రదంగా భావిస్తారు. ఆయుర్వేదం తులసి, ఉసిరికల ఔషధ విశేషాలను విస్తారంగా వర్ణించింది. తులసిని సర్వరోగ నివారిణిగా చెబుతుంది. ఏదైనా ఒక విద్యపై గట్టిపట్టు సాధించినప్పుడు 'ఆయనకు అది కరతలామలకం' అంటుంటారు. అంటే, అరచేతిలో ఉసిరిలా అమరిపోయిందని అర్థం. ఇది జ్యోతిర్విద్యకు చెందిన ఒక రహస్య సంకేతం. మనిషి అరచేతిలోని రేఖలకు, ఉసిరికాయపై కనబడే గీతలకు, భూగోళంపై గల అక్షాంశ, రేఖాంశాలకు సమన్వయం చూపిస్తూ- భాస్కరాచార్యుడు తన 'సిద్ధాంత శిరోమణి'లో గోళాధ్యాయం పేరుతో ఎన్నో విశేషాలు వివరించాడు. రామాయణం బాలకాండలోని ఒక శ్లోకం 'రామకథ వాల్మీకి ముని అరచేతిలో అమలకం' అంటుంది. అలా కరతలామలకం అనే పదప్రయోగం వెనక చాలా కథ ఉంది. గోళాకారంగా ఉండే నిమ్మకాయవంటి వేరే పళ్లకు దక్కని ఒకానొక ఔచిత్య సౌభాగ్యం ఈ పోలికలో ఉసిరిపండు దక్కించుకుంది.

తులసి, ఉసిరి ఒకేచోట పుట్టాయని 'శివ పురాణం'లోని ఒక కథ వివరించింది. కాలనేమి కుమార్తె 'వృంద'. ఇదే పేరు పద్మపురాణంలో 'బృంద'గా కనిపిస్తుంది. ఆమె జలంధరుడి భార్య. మహాపతివ్రత. ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి విష్ణుమూర్తి జలంధరుడి రూపంలో వృందను సమీపిస్తాడు. భర్తగా పొరబడి ఆమె విష్ణువును గాఢంగా ఆలింగనం చేసుకుంటుంది. ఆ పిదప వాస్తవాన్ని గ్రహించి, అవమానభారంతో తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేస్తుంది. చితిలో దగ్ధమవుతూ ఆమె 'నన్నిలా నా భర్త నుంచి దూరం చేసిన మూలంగా నీవూ నీ భార్యకు దూరమై చిరకాలం దుఃఖాన్ని అనుభవించి, చివరకు కోతుల సాయంతో ఆమెను దక్కించుకుందువుగాక!' అని విష్ణువును శపిస్తుంది. ఆమె చితాభస్మం భూమిలో కలిసిపోయిన చోటులోంచి తులసి, ఉసిరి మొక్కలు మొలిచాయని శివపురాణ గాథ. ఆ కారణంగా ఆ రెండింటికీ పవిత్రత, పూజ్యత చేకూరాయని పెద్దలు చెబుతారు. కార్తిక మాసమంతటా కాకపోయినా, కనీసం క్షీరాబ్ధి ద్వాదశినాడైనా ఆ రెండింటినీ ఆరాధించాలని పెద్దలు నిర్దేశించడం వెనక ఇలా ఎన్నో అంతరార్థాలు, రహస్యాలు ఇమిడి ఉన్నాయి. అవి తెలిసి చేసినా, తెలియకుండా చేసినా ఆరాధనవల్ల ఆయురారోగ్యాలు, శుభాలు చేకూరతాయి. అలాంటి పర్వదినం క్షీరాబ్ధి ద్వాదశి!
- ఎర్రాప్రగడ రామకృష్ణ 

No comments:

Post a Comment