ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Saturday 2 November 2013

ఆనందజ్యోతులు

 అలంకారాలన్నింటిలోకీ వెలుగే పెద్ద అలంకారం. అసలు ఏ అలంకారమైనా వెలుగు లేనిదే గోచరించదు కూడా. ప్రపంచంలో ఏ ప్రాంతంవారికైనా ఏ ఉత్సవం జరిపినా వెలుగు తోరణాలతోనో, వెలుగులు చిమ్మే బాణసంచాతోనో వేడుకలు సాగించడం అలవాటు. దీన్నిబట్టి మానవ స్వభావంలోనే వెలుగురవ్వలు ఉత్సాహానందాలకు ఉనికిపట్లు- అనే భావం దాగి ఉంది అని స్పష్టమవుతుంది.
యుగాల క్రితం భారతీయ సంస్కృతి ఈ వెలుగుల వేడుకను 'దివ్యత్వం'గా దర్శించి, దాన్ని పండుగగానూ, పవిత్రమైన ఆధ్యాత్మిక సాధనగానూ ప్రతిష్ఠించింది. ఒక చక్కని వ్యవస్థగా దీపావళిని తీర్చిదిద్దింది.
కేవలం వేడుక మాత్రమే కాక- జ్యోతిషశాస్త్రం, దేవతల అనుగ్రహాన్ని పొందే అర్చనా విధానం, పితరుల్ని తృప్తిపరచే పూర్వీకుల పట్ల ప్రేమ... ఇవన్నీ ఈ పండుగతో ముడివడి ఉన్నాయి. 'దీపావళినాడు ఎలాంటి మానసిక స్థితిలో ఉంటామో, ఏడాది పొడుగునా అదే స్థితి కొనసాగుతుంది' అని ధర్మశాస్త్ర వచనం. అందుకే ఈ రోజున అందరూ ఉత్సాహంగా కలిసిమెలసి ప్రేమలు పంచుకొనే కుటుంబ, సామాజిక సామరస్యపర్వంగా వేడుక జరుపుకొంటారు. పితృతర్పణాలతో, కొరవుల మంటల వెలుగులతో పెద్దలను తలంచుకొని పూర్వీకులపై భక్తిని ప్రకటిస్తారు. ఇంట సిరులు స్థిరంగా ఉండాలని లక్ష్మీపూజ, కుబేరపూజ చేస్తారు. అలక్ష్మిని (దారిద్య్ర, భయ, రోగాది దుర్భావాలను) తొలగించేందుకు ధ్వనులతో కూడిన వెలుగు రవ్వలను బాణసంచులుగా జ్వలింపజేస్తారు. దేవతల కృప లభించేలా దీపతోరణాలను వెలిగిస్తారు. భాద్రపద కృష్ణపక్షపు మహాలయ దినాల్లో ఆరాధించిన పితరులకు ఈ ఆశ్వయుజ అమావాస్య ఒక విధంగా వీడ్కోలు తెలుపుతుందని- పితృదేవతారాధన శాస్త్రాలు చెబుతున్నాయి.

ప్రదోషకాలంలో అమావాస్య ఉన్న రోజునే దీపామావాస్యగా పేర్కొనాలని ధర్మశాస్త్ర వచనం. ప్రాతఃకాలంలో అభ్యంగస్నానం, తదుపరి వినోదాలు, ఇష్టమృష్ఠాన్న భోజనం, బంధుమిత్రులతో సాంగత్యం, సందెవేళ ధనలక్ష్మీ పూజ, దీపలక్ష్మీ ఆరాధన, దీపాలంకరణ- ఈరోజున ఉత్సవ విధులుగా పేర్కొన్నారు. జగదంబ కళాస్వరూపాన్ని నరక చతుర్దశి, దీపరాత్రులతో ఆరాధించడం కూడా కొన్ని చోట్ల సంప్రదాయం.

నరక చతుర్దశి, దీపావళి, కార్తిక శుద్ధ పాడ్యమి- ఈ మూడు రాత్రుల్లో దీపాలు వెలిగించాలి- అని ఈ పండుగకు సంబంధించి ప్రాచీనగ్రంథాలు తెలియజేస్తున్నాయి. అంటే, త్రిరాత్ర పర్వంగా దీన్ని శాస్త్రం అభివర్ణించింది. ఇంటి వాకిళ్లలో, తులసికోటవద్ద, గుమ్మాల్లో, గోశాలలో, దేవాలయాల్లో దీపమాలికలను వెలిగించాలి- అని పురాణాల మాట. దేవతలు కాంతిశరీరులు కనుక, దీపజ్యోతుల వల్ల దేవతాశక్తులు ఆహ్వానితులై అనుగ్రహిస్తారు- అనే కారణంతో దీపాలు వెలిగించాలంటారు.

లక్ష్మీపూజతోపాటు గోమాతను, వృషభాలను అలంకరించి పూజించాలని- కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది గోలక్ష్మీపూజ. 'దీపేన సాధ్యతే సర్వం' అని ఆర్ష వచనం. దీపంతో దేనినైనా సాధించవచ్చు- అని రుషులు చెప్పిన మహిమా వచనం. గ్రహదోషాలు తొలగాలన్నా, ఆయువు పెరగాలన్నా, అభీష్టాలు సిద్ధించాలన్నా దీపాలను వెలిగించి నమస్కరిస్తే చాలునని దీప మహిమను పురాణ గ్రంథాలు వివరించాయి.
వేదన కలిగించే స్థితికి 'నరకం' అని నిర్వచనం. ఆ నరకాన్ని పోగొట్టి ఆనందాన్నిచ్చే సంతోష కాంతి సాధన దీపావళి పర్వం.
- సామవేదం షణ్ముఖశర్మ 

No comments:

Post a Comment