ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Thursday 21 November 2013

ఆనందామృత మంత్రం


 సంతోషంగా ఉండటం ఇష్టం కానిదెవరికి? అటువంటివారు ఎవరూ ఉండరు. సంతోషంగానీ దుఃఖంకానీ ఆకాశంనుంచి అమాంతంగా వూడిపడేవి కావు. ఆలోచనలే వాటికి కారణమవుతాయన్నది గ్రహించాల్సిన అంశం. ఎంత ఆనందంగా ఉన్న సమయంలోనైనా బాధను కలిగించే ఆలోచన ఒక్కటి మెదడులోకి ప్రవేశిస్తే చాలు- ఆనందం ఆవిరైపోతుంది.
ఆనందంగా, హాయిగా ఉండాలని కోరుకుంటే ఒక్కటి గుర్తుంచుకోవాలి... చీకూచింతలను దూరంచేసే వ్యాపకాన్ని అలవాటు చేసుకోవాలి. బుద్ధికి పని కల్పించాలి. 'ఈ ఘడియలు కూడా శాశ్వతం కాదు, గడచిపోతాయి'- దీన్ని గుర్తుంచుకుంటే సంతోషం సంగతి అలాఉంచి, ఎంతటి విచారమైనా తట్టుకోవడం తేలికవుతుంది. దుఃఖమొచ్చినప్పుడు ధైర్యంతో ఎదుర్కోగలిగే పరిస్థితులుంటాయి. 'సుఖదుఃఖాలు శాశ్వతం కాదు'- ఇదొక మంత్రంగా భావించాలి. కష్టసమయాల్ని పదేపదే ఎదుర్కొన్నప్పుడు ఇది సాధ్యమవుతుంది. చలించిపోయే మనస్తత్వం పోయి దృక్పథంలో సమతుల్యత ఏర్పడుతుంది.

రెండు భిన్నమైన పరిస్థితులు జంటగా ఉంటాయి. గమనిస్తే- ఆశ నిరాశలు, కలిమిలేములు, లాభనష్టాలు, శీతల ఉష్ణాలు, చీకటి వెలుగులు... ఇలా ఎన్నో మనిషిమీద ప్రభావం చూపిస్తాయి. ఒక్కో సందర్భంలో, ఒక్కొక్కరిలో ఒక్కోస్థాయిలో వస్తుంటాయి, పోతుంటాయి శరీరం ఉన్నంతవరకూ... వాటికి తీవ్రస్థాయిలో చలించిపోనక్కరలేదు. మనిషి ఏదో ఒకరోజు ఈ లోకం విడిచిపెట్టిపోక తప్పదు. జీవితమే అశాశ్వతమైనప్పుడు అందులో వచ్చిపోయే సుఖదుఃఖాలు ఇంకా ఎంతో అల్పమైనవి. మనిషి ఆనందంగా, ప్రశాంతంగా ఉండే శక్తిని అలవరచుకోవాలి. సుఖమైనా, దుఃఖమైనా ప్రత్యేకంగా ఉండదు. అది మనసుమీదే ఆధారపడి ఉంటుంది. దాని స్వభావం చంచలం. యథార్థ స్థితిని గ్రహించినప్పుడే ప్రశాంతంగా ఉండటం సాధ్యమవుతుంది. ఆనందం అనేది మనలోనే ఉంటుంది. కానీ అజ్ఞానం చేత అది బయట దేని కారణంగానో పొందుతున్నామని భ్రమ చెందుతాం.

నీటిలో సూర్యుడి ప్రతిబింబం పరిశీలిద్దాం. కంటికి కనిపించినా నీటిలో కనిపించేది సూర్యుడు కాదు. ప్రతిబింబమే. ఉందనిపించడం భ్రాంతి. అలాగే ఆనందానుభూతి. సుఖం, సంతోషం... అన్నీ ఇంద్రియాల ద్వారా పొందే అనుభూతి. ఇదీ నిజమైన ఆనందం కాదు. భ్రాంతి మాత్రమే.

మనిషి అది కావాలి, ఇది కావాలి, ఇలా జరగాలి అని కోరుకుంటాడు. అవి తాను పొందగలిగితే, సాధించుకోగలిగితే ఆనందం కలుగుతుందని ఆశిస్తాడు. దానికోసం తాపత్రయపడతాడు. మంచైనా, చెడైనా సాధించడమే ధ్యేయంగా పెట్టుకుని ముందుకెళతాడు. దక్కించుకుంటాడు. దక్కినట్లే దక్కి చేజారితే ఎంత నిరాశో... దక్కితే ఎంత సంబరమో... ఆ తరవాత? అదే అసలైన ప్రశ్న. ఆ దక్కినది శాశ్వతమా? అశాశ్వతమని చూస్తూనే ఉన్నాం. తెలుసుకుంటూనే ఉన్నాం. అయినా ఆలోచనల్లో మార్పురావటం లేదు. అశాశ్వతమైన వాటివెనక పరుగులుపెడుతూ, ఒకదాని తరవాత మరొక 'కోరిక'తో జీవిస్తున్నాం. ఆ కోరికనే త్యజించగలిగితే అసలైన ఆనందం ఏమిటో తక్షణం అర్థమవుతుందని అనుభవజ్ఞులు చెబుతారు. కలల ప్రపంచంలో పొందే ఆనందం కంటే అది ఎన్నోరెట్లు అధికమైందని అనుభవం నేర్పుతుంది.

కోరికలను అధిగమించగలిగితే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. శాశ్వతమైన ఆనందాన్నీ సొంతం చేసుకోవచ్చు. అసలైన శాంతి అంతులేని కోరికల వెంటపడనప్పుడే లభిస్తుందనేది సత్యం.

తృప్తిగా జీవించే వ్యక్తే సంతోషంగా ఉండగలుగుతాడు. కోటీశ్వరుడైనా దివాలా తీస్తాడు, మనశ్శాంతి కరవవుతుంది- 'తృప్తి' అన్నది లేకపోతే. తృప్తి కలిగినవారే నిజమైన సంపన్నులు. వారే ప్రశాంతంగా జీవించగలుగుతారు. వర్తమానానికి విలువిస్తూ, గతంలోని చేదును మరచిపోతూ భవిష్యత్తు గురించి భయంలేకుండా దురాశకు పోకుండా ఉన్నదాంతో తృప్తిచెందే మనస్తత్వం ఏర్పరచుకోవాలి. దేవుడిపట్ల, దేవుడు సృష్టించిన తోటి ప్రాణులపట్ల ప్రేమతో, కృతజ్ఞతతో మెలగినప్పుడే తృప్తి లభిస్తుంది.
- మంత్రవాది మహేశ్వర్‌ 

No comments:

Post a Comment