ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Saturday 16 November 2013

జగద్గురు నానక్‌

                                                              
   భగవంతుడు ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఏమి చేస్తుంటాడు?జిజ్ఞాసువులు ఇలాంటి ప్రశ్నలతో సతమతమవుతుంటారు. కొందరు 'కనిపించని దైవాన్ని నమ్మటమెలా' అని వితండవాదం చేస్తారు. ఈ ప్రపంచాన్ని, విశ్వాన్ని శాస్త్రీయంగా, భౌతికంగా నిర్వచిస్తుంటారు కొందరు. చెట్లకు ప్రాణముందని శాస్త్రీయంగా రుజువయ్యేదాకా ఆ విషయం చాలామంది నమ్మలేదు. అన్నింటికీ రుజువులు వెతకటం సాధ్యమా, దైవం తర్కానికి అందుతాడా?

 ఆచారాలు, సంప్రదాయాలు తరతరానికీ మారిపోతున్నాయి. అంధ విశ్వాసాలుగా, మూఢనమ్మకాలుగా రూపు మార్చుకున్నాయి. వీటి మరుగున పడి అసలు నిజం అర్థంకాకుండా పోతోంది. ఇలాంటి సమయంలోనే మహాత్ములు జన్మిస్తారు. అలాంటి మహాత్ముడే గురు నానక్‌ దేవ్‌. ఆయన్ను- నానక్‌ బాబా, గురు నానక్‌ దేవ్‌, నానక్‌ షా అని సిక్కులు భక్తితో పిలుచుకుంటారు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న రాయ్‌భోయ్‌ తల్వాండీలో కార్తిక పౌర్ణమినాడు గురు నానక్‌ జన్మించారు. ప్రస్తుతం నానక్‌ జన్మస్థలాన్ని 'నన్‌కానా సాహెబ్‌'గా వ్యవహరిస్తున్నారు.

జన్మతః ఆయన క్షత్రియుడు. తండ్రి గ్రామాధికారి. సంప్రదాయవాది. బాల్యం నుంచే కులమతాలకు అతీతంగా ఉండేవాడు నానక్‌. అసాధారణ జ్ఞానంతో, ఆలోచనాత్మక వాక్కులతో బాలనానక్‌ అందర్నీ ఆకట్టుకుంటూ, ఆశ్చర్యం కలిగించేవాడు. నానక్‌ హిందు, ముస్లిమ్‌ బోధకుల వద్ద విద్య అభ్యసించాడు. తన సహజ కుతూహలంతో అనేక ఆధ్యాత్మిక సందేహాలను అడిగి తెలుసుకునేవాడు. నానక్‌ ప్రశ్నలు ఎంతో ప్రముఖులైన ఆధ్యాత్మికవేత్తలకే ఆశ్చర్యం కలిగించేవి. నానక్‌ మొదటి సంప్రదాయ విరుద్ధచర్య, ఉపనయనాన్ని వ్యతిరేకించడం. 'దయను పత్తిగా చేసి, సంతృప్తిని సూత్రంగా మార్చి, నిగ్రహాన్ని ముడివేసి, సత్యాన్ని పురి ఎక్కించి దాన్ని ఉపవీతంగా ధరించటమే నిజమైన ఉపనయనం' అని నానక్‌ చెప్పగా విన్న పెద్దలందరూ అవాక్కయ్యారు. అలా మొదలైన నానక్‌ ఆధ్యాత్మిక ప్రస్థానం, ప్రపంచవ్యాప్తంగా కొనసాగింది. అన్ని మతాలవారూ ఆయన బోధలకు ఆకర్షితులయ్యేవారు. భగవత్‌ ప్రేరణతో ఆయన చేసే ప్రవచనాలు అతి సులభంగా అందరికీ అర్థమయ్యేవి. వారు వెంటనే తమ జీవన విధానాన్ని మార్చుకునేవారు. నానక్‌ శిష్యులయ్యేవారు. సిక్కు అంటే శిష్యుడని అర్థం. ఎవరైనా తన కులమతాల గురించి ప్రశ్నిస్తే 'నాది పంచభూతాల కులం, భేదరహిత సన్మార్గపు తెగ, సర్వమానవ క్షేమమే నా మతం' అనేవాడు నానక్‌. నిజమైన భక్తుడు- 'బతికి ఉండి మరణించినవాడిలా, నిద్రించీ మేల్కొనిఉన్నవాడిలా, తెలిసి తెలిసి తన్ను దోచుకొననిచ్చినవాడిలా' ఉండాలనేవాడు నానక్‌. కోపం, గర్వం, కోరికలు లేకుండా అన్నింటా సమబుద్ధి కలిగి, నిశ్చల సమాధిలో భగవధ్యానం చేస్తూ, భగవద్వాణి తప్ప ఇతరమేదీ వినకుండా, సర్వాంతర్యామియైన పరమాత్మను అందరిలోనూ, అన్నింటిలోనూ చూడగలిగేవాడే భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రుడు- అని నానక్‌ చెప్పేవాడు. నానక్‌ తన సందేశాలను మధురమైన కీర్తనల రూపంలో పాడుతుంటే, ముసల్మాను శిష్యుడైన మర్దానా శ్రుతి వేస్తూ, ఏక్‌తారా మీటేవాడు.


  సిక్కుల ఆదిగురువు గురు నానక్‌ దేవ్‌ తరవాత, తొమ్మండుగురు గురువులు ధర్మపథాన్ని బలోపేతం చేశారు. చివరి గురువు గురు గోబింద్‌ సింగ్‌. తన తరవాత గురుగ్రంథ సాహెబ్‌నే శాశ్వత గురువుగా ఆయన నిర్ణయించాడు. ప్రపంచంలో అందరినీ ఆత్మీయంగా అక్కున చేర్చుకునే, కులమతాతీతమైన ఏకైక దైవమార్గం సిక్కు ధర్మం. ఇది పూర్తిగా స్వదేశీయమైనది. భారతీయ ఆధ్యాత్మికతకు కిరీటంగా, మేలిమి బంగారంగా, కల్మషరహితంగా చెప్పదగినది సిక్కు ధర్మం. గురుద్వారాలు అందరికీ స్వాగత ద్వారాలు.
                                                                     - కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌ 

No comments:

Post a Comment