ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Saturday 9 November 2013

మంచి - చెడ్డ


వరి గురించి అయినా మనం ఎప్పుడూ చెడుగా ఆలోచించకూడదు. ఇది ఒక నియమంగా పెట్టుకోవాలి. అలా ఆలోచించకుండా ఉండగలమా అని సందేహం కలుగుతుంది. అయినా దీన్ని మనం అభ్యాసం చెయ్యాలి. ఎందుకంటే, దీనివల్ల చాలా లాభాలున్నాయి. నిరంతరం ఇతరుల గురించి చెడుగా ఆలోచించటంవల్ల ముందు మన మనసులో చెడ్డ వాతావరణం ఏర్పడుతుంది. అది అవతలవారికి ఎంత హాని చేస్తుందో తెలియదు కాని, ముందు మన ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. తిరుగు లేదు. దీనికి శాస్త్రీయమైన దాఖలాలు ఉన్నాయి. రక్తపోటు పెరుగుతుంది. మధుమేహం అదుపు తప్పుతుంది.

మనిషి ఎలా ఆలోచిస్తే అలాగే ఉంటాడంటారు. చెడుగా ఆలోచించి, ఆలోచించి చెడ్డలో మునిగిపోతే మన మనసును దయ్యంలా చెడు పట్టుకుంటుంది. అది అవతలవారికి హాని చేసే లోపలే మనం దానికి బలి అయిపోతాం.

చెట్టుకు పట్టిన చీడ పక్క చెట్లకు అంటుకునే లోపల మొదటి చెట్టు మూలాన్నే తినేస్తుంది.

దుర్యోధనుడు ఒకసారి వెదికితే ఎక్కడా అతడికి ఒక్క మంచివాడు కూడా కనపడలేదట. చెడ్డవాడికి మంచి ఎక్కడ కనిపిస్తుంది? ఏ చూపుతో చూస్తే ఆ భావమే అందరిలో కనిపిస్తుంది. ఉదయం లేవగానే ఈ లోకం బాగుండాలి, అందరూ బాగుండాలి అని హృదయపూర్వకంగా పది నిమిషాలపాటు కోరుకోవాలి. ఇలా చేస్తే, మందులు వేసుకోకుండానే ఆరోగ్యం బాగుంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఆధ్యాత్మిక శాస్త్రాలు తెలియజేస్తున్నా యి. గురువులు బోధిస్తున్నారు. మనం కూడా ఆలోచించాలి, ఆచరించాలి.

రాగద్వేషాలు మనల్ని నలిపి పారేస్తున్నాయి. నువ్వు-నేను అనే భేదం చివరికి ఒకరినొకరు హతమార్చుకునే స్థితికి తీసుకుపోతోంది. జంతులక్షణాలు బాగా ప్రబలి మానవత్వం మంటగలిసి పోతోంది. ఇలా జరగడానికి కారణాలు ఏమిటి?

మంచిగా ఆలోచించడానికి, మంచిగా ఉండటానికి పుణ్యం కారణమైనట్లు, చెడుగా ఆలోచించడానికి చెడ్డగా ఉండటానికి పాపం కారణం అవుతోంది. ఉల్లి ఉల్లివాసనను ఇస్తోంది. మల్లి మల్లివాసనను ఇస్తోంది. ఏ విత్తనం ఆ ఫలాన్ని ఇస్తోంది.

మంచి చెడుల మిశ్రమమే జీవితం. సుఖదుఃఖాల సంగమమే జీవనం. త్రేతాయుగంలో అవతార పురుషుడైన శ్రీరాముడున్నాడు. మంచికి, ధర్మానికి మారుపేరు ఆయన. ఆ యుగంలోనే అతి దురాత్ముడు, మహా పాపి అయిన రావణాసురుడూ ఉన్నాడు. ఏ యుగమూ చెడ్డను తప్పించుకోలేదు.

చెడ్డలో కూడా మంచిని చూడాలి. మంచి గురించే ఆలోచించాలి. ప్రసాద భావంతో భగవంతుడు దేన్ని ఇస్తే దాన్ని స్వీకరించాలని పెద్దలు చెబుతారు. అందుకు అనుగుణంగా ఎవరూ లేరు. కొత్త వూహలు, కొత్త ఆలోచనలు, కొత్త సిద్ధాంతాలు లేవనెత్తుతున్నారు. శాస్త్రీయ పరిష్కారాలు వెదుకుతున్నారు. ఆధునిక మార్గాల్లో వెళుతున్నారు. మంచిదే... ఎవరు వద్దన్నారు, ఎవరు కాదన్నారు? సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు. రుతువులు వాటి ప్రభావాన్ని తప్పక చూపిస్తాయి. సార్వత్రిక సత్యాలను ఎవరూ కాదనలేరు.

మార్చుకోవలసింది మన తలరాతను కాదు. ఆలోచనా విధానాలను. ఆలోచనలు మారితే అదృష్టాలు మారతాయి. దైవానుగ్రహం లభిస్తుంది. బతుకులు బాగుపడతాయి.

కష్టాలు, కడగండ్లు అనుభవించిన పాండవులను పరమాత్మ వదిలేశాడా? గర్వంతో విర్రవీగే కౌరవుల ఆలోచనలు ఎలా తలకిందులయ్యాయి? చరిత్రలో ఎక్కడైనా చెడ్డవైపు నిలుచున్నాడా భగవంతుడు? అలా అయితే అతడు దేవుడెలా అవుతాడు? మనకు ఇతరులు ఏ మంచి చేయాలని కోరుకుంటామో, ఏ చెడ్డ చెయ్యకూడదని ప్రతిఘటిస్తామో- మనమూ ఇతరుల పట్ల అలాగే ఉండాలి. అనుకోకుండా చెడ్డ జరిగినా, దానికి దారితీసిన పరిస్థితులను విశ్లేషించుకుని, మళ్ళీ ఎప్పడూ అలా జరగకుండా చూసుకోవాలి. ఇది మన జీవన విధానంలో ఒక సూత్రంగా పెట్టుకోవాలి. కౌరవులు నూరుగురు, పాండవులు అయిదుగురు. తాత్కాలికంగా చెడ్డకున్న శక్తి ఎక్కువగా కావచ్చు. సహనం, సంయమనం, సౌశీల్యం, శాంతం, శరణాగతి, ఈశ్వర కృప ఉంటే విజయాన్ని ఎవరూ ఆపలేరు?

మంచిని నిర్మించే శక్తి మనకు లేకపోవచ్చు. చెడ్డను నిరసించే శక్తి కావాలి. చెడుభావనలు మనసును హింస పెడుతున్నప్పుడు తత్సమానమైన మంచి భావాలతో నింపుకోవాలి.

అందరిలో ఒకడే పరమాత్మ నివసిస్తున్నాడు అనే శుద్ధజ్ఞానం కలిగేంతవరకు ఈ అభ్యాసం తైలధారలాగ కొనసాగాలి. అప్పుడే మంచి కోసం మంచిగా ఉండగలం, మానవత్వాన్ని నిలబెట్టుకోగలం.
- ఆనందసాయి స్వామి 

No comments:

Post a Comment