ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Tuesday 19 November 2013

జీవిత లక్ష్యం


దైవాన్ని గుర్తించి, నోరెత్తకుండా తన పని తాను చేసుకుపోవడమే ఆధ్యాత్మికతలో ఉన్న పరమ రహస్యం. చాలామంది సాధకులు భగవంతుణ్ని తెలుసుకున్న తరవాత మౌనం వహించారు. ఎందుకు? ఈశ్వరుడు ఆడిస్తున్న నాటకాన్ని సాక్షిగా చూస్తూ లోపల పరమానందాన్ని వాళ్లు పొందుతున్నారు. ఇది నిజమా, ఇదే నిజమా? శాస్త్రాలు, గురువులు ఈ విషయాన్ని పదేపదే చెబుతున్నప్పుడు- విశ్వసించాలి మరి.
అన్ని అనుభవాలూ మనకు సూటిగా లభించవు. ఇతరులకు లభించిన దాన్ని ప్రాతిపదికగా తీసుకుని రుజువు చేసుకోవాలి. దీనికి విశ్వాసం కావాలి. అప్పుడే మన లోపల తాళం మనం తెరుచుకోగలం. అంతరంగంలో జరుగుతున్న దాన్ని అనుభూతిలోకి తెచ్చుకోగలం.

దైవాన్ని గుర్తించడం అంత సులువైన పని కాదు. అది సాదాసీదా పని కాదు. అందరికీ సాధ్యమయ్యేది కాదు. అలా అని వూరుకుంటే మనం నిజమైన మానవులం కాదు. మనకు ఒక బాధ్యత ఉంది. ధర్మం ఉంది. మన జీవితానికి ఒక ప్రయోజనం ఉంది. అన్నింటికీ మించి పరమార్థం ఉంది. దాన్ని గుర్తించాలి.

నన్ను గుర్తించు అంటూ దేవుడు మన దగ్గరకి రాడు. మన సుఖం కోసం శాంతి కోసం ధన సంపాదన ఎలా అయితే చేస్తున్నామో, ఈశ్వరారాధనా అలాగే చెయ్యాలి. ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని పొందాలి. ఈ విషయాన్ని ఉపనిషత్తులు ఉద్బోధిస్తున్నాయి.

లౌకిక జీవనం సుఖవంతం కావడానికి ఎంతోమంది శాస్త్రజ్ఞులు జీవితాలు అంకితం చేశారు. అపార కృషి చేశారు. అలౌకిక మార్గంలో నడిపించి దైవసాన్నిధ్యం కల్పించడానికి ఎందరో మహానుభావులు తపించారు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుని జీవనం సాగించడం ఉత్తమ మానవుడి లక్ష్యం. ఏది వదిలిపెట్టినా జీవితం పరిపూర్ణం కాదు. వనం ఉండాలి. వసంతం ఉండాలి. అందులో కోయిల ఉండాలి. అప్పుడే పాట హాయిగా ఉంటుంది! హృదయం ఉండాలి. అందులో ప్రేమ ఉండాలి. దగ్గరకు తీసుకునే చేతులు ఉండాలి. అప్పుడే ఆ పరిష్వంగం ఆనంద రసకందాయమవుతుంది.

తీపిని బెల్లం నుంచి వేరు చెయ్యలేం. కాంతిని సూర్యుడి నుంచి వేరు చెయ్యలేం. కెరటాన్ని సముద్రం నుంచి వేరు చెయ్యలేం. మన జీవనం లోంచి ఆధ్యాత్మికతను వేరు చేసి చూసే అవకాశమే లేదు. అవగాహనకు వస్తున్న కొద్దీ దేవుడు మిత్రుడవుతాడు. మార్గదర్శకుడవుతాడు. గురువవుతాడు. చిట్టచివరకు ప్రేమికుడవుతాడు.

ఎక్కడ మనం ఉన్నామో, ఆ ప్రదేశం ఏమిటో, ఎందుకు మనం ఉన్నామో, ఆ స్థితి ఏమిటో, మనల్ని ఇలా ఉంచినవాడితో సంబంధ బాంధవ్యాలు ఎలా జరుపుకోవాలో తెలియకపోతే- మనకు బుద్ధి ఎందుకు? మనిషికి జంతువుకి తేడా ఏమిటి? హేతుబద్ధంగా ఆలోచించడం విజ్ఞానానికే కాదు, వేదాంతానికీ కావాలి. భగవంతుడు రుజువయ్యాడు. దానికి నిజభక్తులే సాక్ష్యం. భగవంతుడు రుజువవుతాడు. ఆధ్యాత్మిక హృదయం వికసించాలి. ఆ దిశలో మనం కళ్లు తెరుచుకుని చూడాలి.

'జీవిత లక్ష్యం ఏమిటి?' అని కొత్తగా వచ్చిన ఓ శిష్యుడు బోధకుణ్ని అడిగాడు.

'ఈ జీవితంలో ఎంతో బ్రహ్మానందం ఉంది. కాని, మామూలుగా జీవించాలని మనం అనుకోవడం లేదు. ఏదో సాధించాలని పరుగులు తీస్తున్నాం. జీవించడమే ప్రాతిపదికగా ఉన్న జీవితాన్ని ఓ సాధనంగా మార్చుకోవాలని అనుకుంటున్నాం. ఆశయాల కోసం తీస్తున్న పరుగులే మనలో ఉద్విగ్నతను పెంచుతున్నాయి' అని బదులిచ్చాడు ఆయన.
- ఆనందసాయి స్వామి 

No comments:

Post a Comment