ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Wednesday 9 October 2013

సామూహిక ధ్యానం


మానవ నిశ్శబ్దం పరాత్పర నిశ్శబ్దంతో సంభాషించడమే ప్రార్థన. అంతరంగం అనంతంతో మాట్లాడటమే ప్రార్థన. అసలు ఎందుకు ప్రార్థన? ఏవేవో కావాలని, కష్టాల నుంచి కాపాడాలని, సదా రక్షించమని కోరడమేనా? ఎన్నో ఇచ్చినందుకు కృతజ్ఞత చూపడం ప్రార్థనా? ఎటువంటి లోటులేకుండా, భగవంతుడితో బంధం తెగిపోకుండా నిత్యం కృప చూపాలనుకోవడం ప్రార్థనా?
అన్నింటికన్నా నిశ్శబ్ద ప్రార్థనే ఉత్తమం. యాంత్రికంగా బాహ్యపెదవుల్ని కదపడంకన్నా నిండుగుండెతో మౌన ప్రార్థన మేలు- 'నాకు సంపద కాని సౌందర్యం కాని వద్దు. మరో ప్రపంచం అసలే వద్దు. ఈ ప్రపంచాన్ని భరించే నువ్వు ఈ జీవన భారాన్ని మోయడంలో సహాయపడు...' 'ఒక తండ్రి తన కుమారుడి హస్తం పట్టుకుని నడిపించినట్లు నన్ను మహోదయ తీరాలవైపు నడిపించు. నీ కృపచాలు. కోటివరాలు వద్దు'.

వెలుగుకోసం జ్ఞానం కోసం ప్రార్థన మరింత ఉత్తమమైనది. భ్రమలు, భ్రాంతులు తొలగించి దైవం తన యథార్థరూపాన్ని, అంతిమ సత్యాన్ని సాక్షాత్కరింపజేయడానికి మనల్ని మనం అర్హులుగా తీర్చిదిద్దుకోవాలి. కోరికలు తీరుతున్నా కష్టాలు తప్పవు. కృప ఉన్నా నష్టాలు తప్పవు. భగవంతుడి కరుణవల్ల కొందరికి బాధలు అంతరిస్తాయి. మరికొందరికి బాధలు పోవు. అంతమాత్రాన భగవంతుడి కృప వారిపై లేనట్లేగా? ఈ భూమిమీద కావలసినవన్నీ వరాలుగా కురిపిస్తాడు భగవంతుడు. ఒక్కొక్కసారి ఏమీ ఇవ్వకుండా ఆ రోజుకు వాయిదా వేస్తుంటాడు. ఈలోగా భక్తుల్ని తన ఆనంద పరిష్వంగంలోకి తీసుకొని రక్షిస్తాడు. విశ్వాసం, శ్రద్ధ, ఆత్మ సమర్పణ- ప్రార్థనకు పూజా వస్తువులు.

విధివల్ల కలిగే గాయాలు మనల్ని భగవంతుడికి మరీ దగ్గరకు తీసుకొని వెళ్తాయి. గతం, వర్తమానం, భవిష్యత్తులో భగవంతుడి స్వరూపాల్ని కనుగొనాలి. మనం పొందిన వరాలు, పోగొట్టుకున్న వరాలు... అన్నీ ఆయనలోనే పదిలంగా ఉంటాయి. తగిన సమయంలో అన్నీ ఇస్తాడు.

ఈ విశ్వాన్ని ఎవరో రక్షిస్తున్నారు, మనల్ని ఎవరో రక్షిస్తున్నారు అన్న భావన చాలు- జీవితాన్ని వెలుగుగా మార్చడానికి. నిత్యానందమయమైన ఆత్మనుంచి వెలువడే మంత్ర ధ్యానాలే ప్రార్థనలు. వ్యక్తి ప్రార్థనకన్నా సామూహిక ప్రార్థన మరింత శక్తిమంతమైనది. కొంతమంది కలిసి ఒక ముఖ్య లక్ష్యంతో ఒక బృందంగా ఏర్పడి చేసేదే సామూహిక ప్రార్థన లేదా ధ్యానం. అన్ని యుగాల్లో ప్రార్థనకోసం ఒకచోట సమావేశం కావడం జరుగుతుండేది. అనేక దేశాల్లో ఈ సమావేశాలు జరిగేవి. కొందరు దైవసంకీర్తనలు గానం చేసేవారు. స్తోత్రాలు, ధన్యవాదాలు, ఆరాధన, కృతజ్ఞత, సమర్పణ లేదా కీర్తన, ప్రస్తుతి చేసేవారు. ఇందుకు చారిత్రక ఆధారాలున్నాయి. అందరూ కలిసికట్టుగా సమకూడటంవల్ల ప్రార్థనకు బలం చేకూరుతుందని విశ్వసించేవారు. క్రీ.శ. 1000 సంవత్సరంలో జరిగిన ఒక ప్రాచీన ఘటన అద్భుతమైనది. కొంతమంది ప్రవక్తలు విశ్వం అంతమైపోతుందని ప్రకటించినప్పుడు, అన్ని చోట్ల ప్రజలు సమూహాలుగా ఏర్పడి ప్రపంచం అంతం కాకూడదని, రక్షించమని భగవంతుణ్ని ప్రార్థించారట. ఇటీవలి కాలంలో, ఆధునిక యుగంలో ఇంగ్లాండ్‌కు చెందిన కింగ్‌జార్జి న్యూమోనియాతో మరణశయ్యపై ఉన్నప్పుడు, ప్రజలంతా వీధుల్లో బారులుతీరి త్వరగా నయంకావాలని ప్రార్థించారు. ఆశ్చర్యకరంగా ఆ రాజు కోలుకొన్నాడు. ఇందుకు భిన్నంగా సామూహిక అభ్యున్నతికోసం, ఒక శక్తికి, ఒక తేజస్సుకు ఉన్మీలనం కావడం కోసం ఆశ్రమాల్లో, దీక్షారామాల్లో సామూహిక ధ్యానం చేసేవారు. అప్పుడే అంతర్దీపాలు వెలుగుతాయి. అంతర్మార్గాలు తెరచుకొంటాయి... త్వరగా.
- కె.యజ్ఞన్న 

No comments:

Post a Comment