ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Thursday 13 June 2013

కోరికలే గుర్రాలైతే...

                       
   
       
నిషి మనసు కోరికలకు పుట్టిల్లు. మనసులోని తపన, ఆరాటమే కోరిక. దైనందిన జీవితంలో ఎప్పుడూ ఏదో కావాలనే అనిపిస్తూంటుంది. అది దొరికాక మరోటి. అదీ లభించాక మరోటి. ఇలా చెలమను తోడినకొద్దీ నీరూరినట్టు కోరికలు తీరినకొద్దీ మనసులోంచి కొత్తవి ఊరుతూనే ఉంటాయి. మనసు అనే కొలిమిలో కోరిక అనే ఇంధనం వేసినకొద్దీ అగ్నికి ఆజ్యం పోసినట్టుగా పెరగడమేకాని, తరగడమంటూ ఉండదు. తృప్తి ఉండదు. ఆనందం ఉండదు. సుఖశాంతులూ ఉండవు. కళ్లెం వేయకపోతే కోరికలు గుర్రాలై పరుగెడుతూనే ఉంటాయి.
                           
కోరికలు ప్రాపంచికంగా కోరుకునేవి, వృత్తిరీత్యా కోరుకునేవి, కుటుంబపరంగా, సమాజపరంగా... ఇలా చాలా విధాలుగా మనసులోంచి పుడుతుంటాయి. ఉన్నతమైనవీ, అధమమైనవీ మాత్రమే కాక- కోరికలు బలమైనవీ, బలీయమైనవీ, బలహీనమైనవీ కూడా ఉంటాయి. మానసిక శాస్త్రజ్ఞుల పరిశోధనల ప్రకారం- ప్రపంచంలో నూటికి ముగ్గురే అనుకున్నది కొంతమేరకు సాధించగలుగుతున్నారట. కోరిక అవసరాన్ని గుర్తించడం, సరైన కార్యాచరణకు పూనుకోవడమే వివేకవంతుడి లక్షణం. జీవనప్రగతికి అవసరంకాని కోరికకోసం మూర్ఖంగా ముందుకు పోవడం, అసలు లక్ష్యానికి ఉపయోగపడే ఆశయాలను, కోరికలను ఉపేక్షించడం విజ్ఞత అనిపించుకోదు. 'లోకంలో అత్యంత ప్రమాదకరమైన కోరికలు మూడే మూడు... వాటి వెంటపడ్డావంటే నీకు మూడటం ఖాయం' అని పెద్దలు చెబుతుంటారు. వీటిలో మొదటిది ధనంమీది వ్యామోహం, రెండోది పరస్త్రీ వ్యామోహం, మూడోది కీర్తి మీది వ్యామోహం.

ధనార్జనమీద కోరిక మితంగా ఉండాలే కాని, ఆక్రమించి, దోచి, దాచుకోవాలనే అత్యాశ ఎంతమాత్రం వాంఛనీయం కాదు. ఆఖండ సామ్రాజ్యానికి అధిపతి కావాలనే దురాశతో దాయాదులను అడవులపాల్జేసి మహాభారత సంగ్రామానికి కారణభూతుడైన దుర్యోధనుడి చరిత్ర తెలియనిది కాదు. అంతిమశ్వాస తరవాత తనకు అవసరమైన నేల ఆరడుగులేనని తెలిసీ వేలాది ఎకరాల భూమికోసం ఆరాటపడటంలోని ఔచిత్యమేమిటి?విపరీత ధనార్జనకు దాసులై తద్వారా సామ్రాజ్య విస్తరణ, పదవీ కాంక్ష, సార్వభౌమత్వం మొదలైన అత్యాశలకు లోనై చరిత్రహీనులుగా మిగిలిపోయినవారెందరో ఉన్నారు.

ఒక బాటసారి తలపైన డబ్బు మూట పెట్టుకుని, భార్యాబిడ్డలతో నదిని దాటుతున్నాడు. అకస్మాత్తుగా నదీ ప్రవాహ వేగం పెరిగింది. ఆ వేగాన్ని తట్టుకోలేక, బిడ్డను వదిలేశాడు. కొన్ని అడుగులు వేశాక, నీటి ఉరవడిని ఎదుర్కోలేక భార్యని వదిలేశాడు. డబ్బు మూట ఉంటే ఏదైనా సాధించవచ్చనుకున్నాడు. మరికొంత దూరం వెళ్లాక నీటివరద ఉద్ధృతమై- ఆ డబ్బు మూటనూ నీటిలో వదిలేశాడు. చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా చివరకు ఖాళీ చేతులతో ఒడ్డుకుచేరి ఏడవటం మొదలెట్టాడు. సంసారసాగరం ఈదాలన్నా ఇలాంటి కష్టాలే ఎదురవుతాయి. ఈ వివేచన ముందే ఉంటే ఏ సమస్యలూ ఉత్పన్నం కావు.

రెండోది పరస్త్రీ వ్యామోహం. నేడీ కోరిక ఎన్ని ప్రమాదాలకీ, ఘోరాలకీ హేతువవుతుందో ప్రత్యక్షంగా, పరోక్షంగా చూస్తున్నాం, వింటున్నాం. సీతను చెరపట్టిన రావణుడు, ద్రౌపదిని పరాభవించిన దుర్యోధనుడు, కామాంధుడైన కీచకుడు... ఆనాడు ఒక్కొక్కరే. ఇవాళ అడుగుడుగునా వేలాది కామోన్మాదులు చట్టానికీ, న్యాయవ్యవస్థకూ చిక్కకుండా తప్పించుకుపోతున్నారు. స్త్రీ కోసం ఎన్ని కలహాలు, ఎన్ని హత్యలు, ఎన్ని కుతంత్రాలు!

మూడోది కీర్తికాంక్ష. ఏమీ కృషి చేయకుండా, సేవచేయకుండా, స్వార్థపూరిత జీవితం కొనసాగిస్తూ కీర్తికోసం వెంపర్లాడటం అంటే ఎండమావుల్లో జలాన్వేషణ చేయడమే. సహజమైన యశస్సు విరజాజిలోని సురభిలా గుబాళిస్తుంది. ధర్మబద్ధుడై, నీతిమంతుడై నిస్వార్థంగా పరహితవ్రతుడైన మనిషిని ప్రతిష్ఠ తనంత తానుగా వరించి వస్తుంది. భగవంతుడి గుర్తింపు పొందినవాడు సహజంగానే చిర యశోభూషితుడవుతాడు. విదురుడు, అంబరీషుడు, రామకృష్ణ పరమహంస మొదలైనవారెందరో ఈ కోవలో చిరస్మరణీయులు. అశోకుడు, శివాజీ, అల్లూరి, భగత్‌సింగ్‌, ఝాన్సీ వంటివారెవ్వరూ కీర్తిని కోరి త్యాగాలు చెయ్యలేదు. వ్యాసుడు, వాల్మీకి, పోతనవంటి మహానుభావులు 'విశ్వశ్రేయఃకావ్యమ్‌' అన్న సదాశయంతోనే సాహితీ సమారాధన చేశారు. త్యాగయ్య, అన్నమయ్య, గోపన్న భక్తి తత్పరతతో సప్తస్వర సమార్చన చేశారు. అవినీతితో, దొడ్డిదారిలో అధికారాలు, న్యాయకత్వాలు చేపట్టి పదిమందీ బ్రహ్మరథం పట్టాలనుకునే మనస్తత్వం పోవాలి. రుజువర్తనతో నిష్కళంక ప్రజాసేవ ద్వారా మాన్యత పొందడం సాధ్యమని గ్రహించాలి.
                                               - చిమ్మపూడి శ్రీరామమూర్తి 
                                                                                                                                                                                       

No comments:

Post a Comment