ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Thursday 20 June 2013

మనసు


    చాలామంది తరచుగా తమ మనసెందుకో బాగాలేదంటూ ఉంటారు. వారు దానికి కారణం చెప్పలేరు. వాస్తవంగా అది వారికే తెలియదు. లోతుగా చూస్తే వారి మనసుల్ని ప్రభావితం చేసే అంశాలు చాలా కనిపిస్తాయి. పరిసరాలు, ఆహారం, గత వాసనలు, సాంగత్యం, చేసే పనులు, కాలం... ఇలా అనేకం ఉంటాయి. పరిసరాలు మన మనసులమీద తీవ్రమైన ప్రభావం చూపుతాయి. సహజంగా అతిథుల గదిలో గంభీరంగా ఉన్నా, ఆహ్లాదంగా ఉన్నా మాటలస్థాయి ఎక్కువగానే ఉంటుంది. అదే పడక గదిలో ఆంతరంగికమైనా, శృంగారభరితమైనా గుసగుసల్లోకి మారిపోతుంది. ఇక పూజగదిలో భగవన్నామ స్మరణ మంద్రంగానో, నిశ్శబ్దంగానో సాగిపోతుంది. అందుకే అక్కడుండే ప్రశాంతత మరెక్కడా దొరకదు.

మన ఆహారం కూడా మనసుల మీద ప్రభావం చూపిస్తుంది. సాత్వికాహారం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. అదే విపరీతమైన కారం, పులుపు తింటే మనసు ఉత్తేజభరితమవుతుంది. అంతేకాదు, ఎవరు వడ్డిస్తున్నారన్న అంశం కూడా ఇక్కడ ముఖ్యం. తల్లి లాలించి పెడుతుంది. భార్య ప్రియమారపెట్టవచ్చు... లేక మరేదో సాధించాలని సణుగుతూ వడ్డించవచ్చు. వేరే వ్యక్తి ఇంకొక విధంగా ప్రవర్తించవచ్చు. వడ్డించేవారి ప్రవర్తననుబట్టి తినే పదార్థాలపై ఇష్టాయిష్టాలు మారతాయి. ఏర్పడతాయి.

ఒకసారి గాంధీజీ స్వాతంత్య్రోద్యమంలో కారాగారంలో ఉన్నారు. ఒక రాత్రి తాను ఆచరిస్తున్న అహింసావాదం సరైంది కాదేమోనని ఆయనకు అనిపించిందట. అలాంటి ఆలోచన వచ్చినందుకు మర్నాడుదాకా ఆయనను ఆ కలవరం వదలిపెట్టలేదు. తనకలాంటి ఆలోచనలెందుకు వస్తున్నాయా అని ఆయన తీవ్ర మనస్తాపానికి గురవుతుండగా ఎవరో కొత్త వ్యక్తి వచ్చి 'మహాత్మా! టీ' అనటం వినిపించింది. అతను వెళ్లిపోయాక అతనెవరని మామూలుగా వచ్చే వ్యక్తి తనకెందుకు సేవ చేయటంలేదని అడిగారు గాంధీజీ. 'అతను నిర్దాక్షిణ్యంగా కొందర్ని చంపిన హంతకుడు. మర్నాడు ఉరికంబమెక్కుతున్నాడు. తన చివరి కోరిక ఏమిటంటే మామూలుగా వచ్చే మనిషి స్థానంలో ఓ రోజు మీకు సేవ చేయాలని ఉందన్నాడు' అని చెప్పాడు కారాగార అధికారి.

మహాత్ముడు కనుక ఆయనకు వెంటనే విషయం అర్థమైంది. హంతకుడి చేతులమీదుగా తీసుకున్న ఆహారంవల్ల ఒక్కరోజులో తన ఆలోచనల తీరు ఎలా మారిపోయిందో కదా అని ఆయన చింతించారు. అందుచేత ఆహారమే కాదు... దాన్ని వడ్డించేవారి మనస్తత్వం కూడా భోక్తలపై ప్రభావం చూపిస్తుంది. 

గతంలో మనం చేసిన పనులు మన మనసుల్ని పట్టి పీడిస్తుంటాయి. జ్ఞాన సముపార్జన, ధ్యానం గత వాసనల్ని తుడిచివేస్తాయి. 

ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం... ఇలా సమయాన్ని బట్టి మన మనసు ప్రభావితమవుతుంది. నిరంతర సాధనలో మనసును నియంత్రించుకుంటే అన్ని సమయాల్లోనూ ఒకే స్థిర భావనతో ఉండగలగటం సాధ్యం.

సాంగత్యం మన మనసు మీద విపరీతమైన ప్రభావం చూపుతుంది. మంచివారి చెలిమివల్ల జ్ఞానం కలుగుతుంది. ఆ వెలుగులో పయనం సాగిస్తే మనసు నిశ్చలంగా నిర్మలంగా ఉంటుంది. 

చేసే పనులు ఒకరికి హానికరం కానివి, స్వార్థపూరితం కానివి, స్వలాభాపేక్షతో కూడినవి కాకపోతే సరిపోదు. అన్నార్తుల కళ్లల్లోని దీనభావనల్ని గుర్తించాలి. మన సుఖాలను మరి కాస్త వాయిదా వేసుకుని వారిని కష్టంలో ఆదుకోగలగాలి. 

ఒకరికి సాయపడగలగటం ఒక గొప్ప అనుభవం. అందులో అవతలి వ్యక్తి అర్థించకుండానే సాయమందించగలగటం ఒక అదృష్టం. అది భగవద్దర్శన భాగ్యం కలిగినంత భాగ్యం!
                                                      - తటవర్తి రామచంద్రరావు 

No comments:

Post a Comment