ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Monday 15 July 2013

పుష్ప సందేశం

  ప్రకృతి ప్రసాదించిన పుష్పాలు అనేకం. రకరకాల రంగులతో కనులకు ఆనందాన్నిచ్చే పూలు జీవితాన్ని పరిమళింపజేస్తాయి. పండుగ రోజుల్లోనే కాకుండా అన్ని ముఖ్య కార్యక్రమాల్లోనూ అన్ని మతాల వారూ వీటిని ఉపయోగిస్తారు. పూలు ఆనందాన్నివ్వడంతోపాటు శుభాశుభాలన్నింటికీ పూర్ణత్వాన్నిస్తాయి. దేవతార్చనల్లో పుష్పాలు అతి ముఖ్యమైనవి.

పుష్పమూలంలో బ్రహ్మ, పుష్పమధ్యంలో కేశవమూర్తి, పుష్పాగ్రంలో మహాదేవుడు, దళంలో సర్వదేవతలూ నివసించి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.

పుష్పాలన్నింటిలో ఉత్తమ గుణాలు కలిగి, సహస్ర పత్రాలు కలిగిన కమలం ఎంతో విశిష్టమైనది. లక్ష్మీదేవి ఉద్భవించింది కమలం నుంచే కనుక అది సర్వశుభాలకూ నిలయమైందంటారు.

చదువుల తల్లి సరస్వతిదేవి పూజలో తమస్సును దూరం చేసి, సాత్విక ప్రకాశాన్నిచ్చే తెల్లతామర, మల్లెపూలు ప్రధానమైనవి. తెల్లని పట్టుచీరను ధరించి, మల్లెమాలను దాల్చి, వీణ చేతపట్టి తెల్లతామర పూవులో ఆసీనురాలైన సరస్వతీదేవిని మల్లె, తెల్ల తామరలతో పూజించాలని 'శారదా తిలకమ్‌' చెబుతోంది.

సన్నజాజులు దైవ పూజకు శ్రేష్ఠమైనవని పుష్ప చింతామణి గ్రంథం వివరిస్తోంది. ఈ పుష్పాలతో పగటిపూటైనా, రాత్రిపూటైనా శివకేశవులను, ఇతర దేవతలనూ నిరభ్యంతరంగా పూజించవచ్చునని చెబుతారు.

పుష్పాలు రూపంలో కల్మషం లేనివేగాక సువాసన భరితమైనవి. కొన్ని కొన్ని పుష్పాల పరిమళాలను మనిషి ఆఘ్రాణించడం వల్ల కొన్ని వ్యాధులకు ఉపశమనం కలుగుతుంది. పుష్పాలు రోగ నివారణ ఔషధంగానూ పనిచేస్తాయని శాస్త్రపరంగా పరిశోధించి నిరూపించారు. పుష్పాలకు శారీరకంగానే కాకుండా మానసిక రోగాలను సైతం నివారించే స్వభావం ఉంది.

పుష్పాలు మనసుకు ఆహ్లాదాన్ని ఇవ్వడంతోపాటు తాత్విక, ఆధ్యాత్మిక విలువలను పొందుపరచుకుని ఉన్నాయి. యోగశాస్త్ర రీత్యా సప్తకమలాల్లో హృదయకమలం ఒకటి. హృదయమనే పుష్పాన్ని నిష్కల్మషంగా భగవంతుడి పాదాల చెంత ఉంచి, మన ఆత్మను ఆయనలో ఐక్యం చేసుకొమ్మని అర్థించాలన్నది పెద్దలమాట.అన్ని పూజల అసలు ఉద్దేశం ఇదే.

ఇక అహింసా పుష్పం, ఇంద్రియ నిగ్రహ పుష్పం, సర్వభూతదయా పుష్పం, క్షమా పుష్పం, శాంతి పుష్పం, తపో పుష్పం, ధ్యాన పుష్పం, సత్యపుష్పం అనే ఎనిమిదింటితో అంతరాత్మలో దైవాన్ని పూజించేవారికి దైవ సాక్షాత్కారం లభిస్తుందని శాస్త్రోక్తి. వేరే మాటల్లో, ఈ ఎనిమిది పుష్పాలతో పూజించడం అంటే ఉత్తమ మానవ లక్షణాలు కలిగి ఉండటం అన్నమాట.

అహింస, శాంతి, దయ, ఇంద్రియ నిగ్రహం, క్షమ, ధ్యాన తపస్సులు కలవాడు సాక్షాత్తు బ్రహ్మవేత్త అనక తప్పదు. ఈ గుణాలు కలిగి జీవనం సాగించేవారు భగవంతుని అష్టవిధ పుష్పాలతో పూజించిన వారవుతారు. అష్టదళ పద్మం ప్రాముఖ్యం ఇదే. జ్ఞాన యోగ నిష్ఠ సాధ్యపడని సామాన్యులు కేవలం ఇటువంటి స్వభావం కలిగి ఉన్నా దైవాన్ని పూజించినట్లే.

సత్ప్రవర్తన, సద్గుణాలు కలిగి, నిర్మలమైన మనసుతో సదా పరమాత్ముని సన్నిధి కోరుకోవాలని మనిషికి పుష్పం సందేశమిస్తోంది.
                                                                                        - భరణి

No comments:

Post a Comment