ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Friday 19 July 2013

మానవత్వమే సాయితత్వం


    మహిమలతో కాదు, మానవత్వంతో బతకాలన్నదే సాయితత్వం. బాబా ఎప్పుడూ తన గొప్పతనాన్నీ, మహిమాన్వత శక్తినీ ప్రద ర్శించలేదు. తాయెత్తులు కట్టలేదు. చివరకు జ్యోతిషం, గ్రహదోషాల వంటి వాటిని కూడా బాబా మూఢనమ్మకాలుగానే భావించారు. వాటి జోలికి తన భక్తుల్ని వెళ్లనివ్వలేదు. అందుకే యోగీశ్వరుల పరంపరలో సాయిబాబా ఎంతో విశిష్ఠమైనవారు. కొందరు మిడిమిడి జ్ఞానంతో మహిమలు ప్రధ ర్శించబోయినా వారిని వారించి దారిలో పెట్టారు. మహిమల కంటే మానవత్వాన్ని ప్రదర్శించడమే ఉత్తమమని బోధించేవారు. బాబాకు దేహాభిమానం లేదు. భక్తులను మనసారా ప్రేమించారు.

గురువులు రెండు రకాలు. ఒకరు- నియత గురువులు. అంటే నియమితులైన గురువులని అర్థం. రెండు- అనియత గురువులు. సమయానుకూలంగా తమంతట తామే వచ్చి మన అంతరంగాలను శుద్ధిచేసి, సుగుణాలను పెంపొందించి, మోక్షమార్గాన నడిపించే వారిని అనియత గురువులు అంటారు.

రకరకాలుగా ప్రపంచ జ్ఞానాన్ని బోధించే గురువులు లోకంలో ఎందరో ఉన్నారు. వీణ, చిరుతలు పట్టుకుని ఇంటింటికీ తిరుగుతూ ఆధ్యాత్మిక ఆడంబరాన్ని చాటేవారు కొందరు. గురువులమని చె ప్పుకుంటూ డాబుసరి కబుర్లతో కాలం గడిపే వారు మరికొందరు. చెవిలో మంత్రాలు ఊదుతామని భక్తుల వద్ద డబ్బులు గుంజేవారు ఇంకొందరు. కానీ, ప్రస్తుతం మనమున్న సహజస్థితిలోనే మనల్ని ఉంచి, ప్రపంచపు అంచులకు అతీతంగా తీసుకుపోయేవారే నిజమైన గురువులు. వారే సద్గురువులు. సాయిబాబా అలాంటి సద్గురువు.

బాబా మహిమ నిజంగా వర్ణనాతీతం.
చూపుమాత్రంగానే బాబా, భక్తుల భూత, భవిష్యత్, వర్తమానాలను గ్రహించేవారు. అవన్నీ బాబాకు కరతలామలకం. బాబా ప్రతి జీవిలోనూ దైవాన్ని చూసేవారు. శత్రువులు, స్నేహితుల పట్ల సమభావంతో ఉండేవారు. నిరభిమానం, సమత్వం బాబాలో మూర్తీభవించి కనిపించేవి. బాబాకు కలిమిలేములు సమానం. బాబా మానవదేహం ధరించినా, ఇల్లూ వాకిలి పట్ల అభిమానం, వ్యామోహం ఉండేవి కావు. శరీర ధారిగా కనిపించే సాయిబాబా నిజానికి నిశ్శరీరులు.

నిజమైన, స్వచ్ఛమైన కవిత్వం పాండిత్యం వల్ల రాదు. ప్రేమలోంచి వ స్తుంది. హృదయం దాని ఆస్థానం. ఈ లెక్కన చూస్తే షిర్డీ వాసులు ఎంతో పుణ్యాత్ములు. తాము తింటున్నా, తాగుతున్నా, పనీపాటలు చేసుకుంటున్నా సాయి నామస్మరణను ఎప్పుడూ మరిచేవారు కాదు. బాబా మహిమలను కీర్తిస్తూ తమ పనులు తాము చేసుకునే వారు. బాబా పట్ల షిర్డీ స్త్రీల ప్రేమను, బాబా పట్ల వారి భక్తిని, బాబా వారిపై కురిపించిన అవ్యాజమైన కరుణను గురించి వర్ణించడానికి అక్షరాలు చాలవు. షిర్డీ వాసులు అక్షరజ్ఞానం లేని పామరులే అయినా, అద్భుతమైన ప్రేమతో బాబాను గెలుచుకున్నారు. బాబా పాదస్పర్శతో షిర్దీలోని చెట్టూ చేమ, మట్టీ పుట్ట అన్నీ పులకించాయి. ఆ నేల బాబా పాద ధూళిని తాకి పునీతమైంది.

అండగా నిలిచే బాబా
మంచి కోసం మనిషి నిరంతర ప్రయత్నం చేయాలి. మనసు మాయల ఫకీరు. కొద్దిసేపు ఆశల పల్లకీలో ఊరేగిస్తుంది. మరికొద్దిసేపు ఆకాశానికి నిచ్చెనలు వేస్తుంది. అదే సమయంలో పాతాళానికి దిగ జార్చే సందేహాలను, అపోహలను కలిగిస్తుంది. నిలకడలేని తనం దాని లక్షణం. అలాంటి మనసును అదుపులో పెట్టుకోవడానికి మనిషి ఏదో ఒక పనిచే యాలి. దాన్ని దారి మళ్లించాలి. ఎంచుకున్న పనిలో, దాని తాలూకు ప్రయత్నాల్లో సంపూర్ణంగా మునిగిపోవాలి. మనసులో మంచి ఆలోచనలు కలగడం కోసం, ఆ ఆలోచనలు సాఫల్యం కావడం కోసం చేసే ఏ ప్రయత్నానికైనా భగవంతుడు మనకు అండగా నిలుస్తాడు.

భగవద్గీతలో శ్రీకృష్ణుడు పార్థునికి చెప్పింది కూడా ఇదే. " అర్జునా! మన సు నిలకడలేనిది. దాన్ని నిశ్చలం చేసుకోవడం ద్వారా ప్రతి మనిషీ తనను తాను ఉద్ధరించుకోవాలి. తనను తానే సంస్కరించుకోవాలి. అంతే తప్ప మనసు చెప్పినట్టల్లా తలాడించి తనను తాను అధోగతి పాలు చేసుకోకూడదు.'' షిర్గీ సాయిబాబా కూడా ఆ తన భక్తులకు ఇదే విషయాన్ని బోధిస్తున్నారు.రోహిల్లా ఆజానుబాహుడు. అతను షిర్డీలో ఉండేవాడు. అతని మనసు నిలకడగా ఉండేది కాదు. ఏవేవో ఆలోచనలతో మనిషి కదిలిపోతుండేవాడు. అతను చదువుకున్నవాడు కాదు. మనసును అదుపులో పెట్టుకోవడానికి ఏం చేయాలో తెలియదు. అతనికి తెలిసిన ఏకైక మంత్రం దైవ నామస్మరణ. తనకు చెడు ఆలోచనలు రాకుండా ఉండేందుకు రాత్రింపగళ్లు 'అల్లాహో అక్బర్' అని గట్టిగా అరుస్తూ ఉండేవాడు. అలా స్మరిస్తే మనసులో చెడు ఆలోచనలకు తావుండదనేది అతని భావన.

రోహిల్లా అలా అరుస్తుంటే, ఆంబోతు రంకెలు వేస్తున్నట్లుండేది. పగలంతా శ్రమించి హాయిగా నిద్రపోతున్న షిర్డీవాసులు ఈ రంకెలతో ఉలిక్కిపడి లేచేవారు. రోజూ ఇదో తంతుగా మారడంతో ఇక భరించలేక వారంతా సాయి బాబా వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. వారి మాటలు విన్న బాబా " ఎవరి పనులు వారు చేసుకోండి. రోహిల్లా జోలికి వెళ్లకండి'' అని గట్టిగా అనడంతో వారు విస్తుపోయారు. ఆ తరువాత బాబా దీన్ని వివరిస్తూ, " రోహిల్లాకు ఓ దౌర్భాగ్యపు భార్య ఉంది. ఆమె పరమగయ్యాళి. అతని మనసును ఆమె ఏనాడూ కుదురుగా ఉండనీయదు. ఆ దౌర్భాగ్యం నుంచి బయటపడేందుకే రోహిల్లా అలా గట్టిగా భగవన్నామ స్మరణ చేస్తున్నాడు'' అంటూ షిర్దీవాసులకు సర్ది చెప్పారు.

వాస్తవానికి రోహిల్లాకు అసలు పెళ్లే కాలేదు. అయితే బాబా ఇక్కడ అన్నది అతని మనసులోని దుర్బుద్ధిని ఉద్దేశించి. అతని మనసులో చెడు ఆలోచనలు పుడుతున్నాయి. వాటిని అణుచుకోవడానికే రోహిల్లా భగవంతుని నామాన్ని గట్టిగా స్మరిస్తున్నాడు. బాబా అతన్ని ప్రయత్నాన్ని గ్రహించారు. అందుకే అతనిపై షిర్డీ వాసులు ఫిర్యాదు చే సినా బాబా వారిపైనే తిరిగి కేకలు వేశారు. మంచి కోసం ఎవరు ఏ ప్రయత్నం చేసినా ఏదో విధంగా ప్రోత్సహించాలనేది బాబా అభిమతం. ఏమైనా కొన్నాళ్లకు నిరంతర భగవ న్నామ స్మరణ ద్వారా రోహిల్లా మనసు కుదుటపడింది.
సాయిబాబా ప్రత్యేకత ఏమిటంటే, ఏ విషయం చెప్పినా, భక్తుల మనసులో సూటిగా నాటుకుపోయేలా నిదర్శనాలు చూపేవారు. చిన్న చిన్న ఉపదేశాలు, సన్నివేశాల ద్వారా ఎవరో ఒకర్ని నిదర్శనంగా చూపి, మిగతా వారి కళ్లు తెరిపించేవారు. మంచితనాన్ని, మంచి ప్రయత్నాలను ఎలా ప్రోత్సహించాలో కళ్లకు కట్టినట్లుగా చూపేందుకు బాబా రోహిల్లాను నిదర్శనంగా చూపారు.
                                                            - డాక్టర్ కుమార్ అన్నవరపు

No comments:

Post a Comment