ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Monday 1 July 2013

మాయలమారే మహోపకారి


 మనసు లేకపోతే మనిషికి మనుగడ లేదు. అది మానవజీవితాన్ని ఉన్నత శిఖరానికి చేర్చగల ఒక మహస్సు. అదే ఆ మానవజీవితాన్ని అధఃపాతాళానికి అణగదొక్కగల తమస్సుకూడ. మనసు అనే నాణేనికి పురోగతి-అధోగతి బొమ్మ-బొరుసు అన్నమాట. ఇంద్రధనుస్సులా మెరిసే మనసుకు దాసోహం అన్న మనిషి కొంతమేరకు రంగులకలల్లో జీవిస్తూ ఆశలపల్లకి అధిరోహించవచ్చు. కోరికల వల్లకి మోగించవచ్చు. మోహపరవశుడై వూహాప్రపంచంలోనే జీవించటానికి ప్రయత్నించకూడదు. ఆ కలలే అలలై ఆ మనిషి జీవితనౌకను నడిసముద్రంలో ముంచగల ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే మనసును అదుపుచేయాలని కృష్ణుడు చెప్పాడు. చీకటినుంచి వెలుగులోకి, అసత్తు నుంచి సత్తులోకి, మృత్యువు నుంచి అమృతత్వానికి చేరవేయగల చేవ మనసుకు ఉన్నదని ఉపనిషత్తు చెబుతున్నది. అది పెడదారి పట్టకుండా, రహదారి మీద సాగేలా చూడటానికి బుద్ధిని తోడిచ్చాడు ఆ భగవంతుడు. దాని అండదండలతో మనసు ఆత్మకు చేరువవుతున్నకొద్ది- శరీరం, ఇంద్రియాలూ తమవంతు సాయాన్ని బుద్ధికి అందజేస్తాయి. ఆత్మవైపు మనసు మొగ్గుచూపటంతో రాగద్వేషాలు దూరమవుతాయి. కామం, క్రోధం, మోహం, లోభం, మదం, మాత్సర్యం... ఈ ఆరుగురూ అంతశ్శత్రువులు. మనిషికి కనిపించకుండా ఆత్మోన్నతికి, ప్రగతికి గోతులు తవ్వే దుష్టశక్తులు. బయట కనిపించే శత్రువులతో పోరాడటం, జయించటం తేలిక. కనిపించకుండా ఎప్పటికప్పుడు మెరుపుదాడి సలిపే పై ఆరు శత్రువులు మిక్కిలి ప్రమాదకరమైనవారు. శత్రువిజయం తథ్యమని కురుక్షేత్ర రణక్షేత్రంలో ధీమాగా రథం నడిపించాడు అర్జునుడు. రాగమనే అంతశ్శత్రువు చెలరేగి అర్జునుడి శౌర్యాన్ని అణచివేశాడు. ద్వేషమనే అంతశ్శత్రువు విజృంభించి తనను తానే ద్వేషించే పరిస్థితికి దిగజార్చాడు విజయుణ్ని.

కాబట్టి, మనసును మచ్చిక చేసుకుని అది అదుపాజ్ఞలకు లోబడి నడచుకునేలా మనిషి మలచుకోవాలి. అలా మలచుకోవటానికి కట్టుదిట్టమైన మార్గాలు అన్వేషించాలి. ఎలాంటి కష్టనష్టాలు ఎదురైనా, పట్టుదలతో ముందుకు సాగాలి. మనసు పైన విజయం సాధించడానికి అభ్యాసం, వైరాగ్యం యోగ్యమైన పరికరాలు. మనసు ఒక ఆలోచనల యంత్రాంగం; కామనల కర్మాగారం. ఆలోచన ఇలా బయలుదేరగానే కోరిక ఈరికలెత్తటం సహజం. కంటిముందు అందంగా కనిపించే గులాబీని ఎలాగైనా కైవసం చేసుకోవటానికి అడుగువేయటం కర్మ. కాని, మనిషి చేసే ప్రతి పనికి రెండురకాల ఫలితాలు ఉంటాయి. రోజా చేతికి అందితే ఆనందం. అందకపోతే దుఃఖం. చేతికందిన గులాబీ పువ్వు వాడి రేకులు రాలిపోగానే మళ్లీ దుఃఖం. సుఖదుఃఖాల వలయంలో గిరగిర లాడించే యంత్రాంగం నుంచి బయటపడటానికి మొట్టమొదటి సూత్రం- ఆలోచించకపోవటమే. ఎలుగుబంటిని అడవిలో నుంచి బయటికి పంపించవచ్చుకాని, అడవిని దానికి దూరంచేయలేం. ఆలోచించటం మనసు జన్మహక్కు. మరి ఈ సూత్రాన్ని ఎలా అమలుచేయాలి? అందుకే ముందుగా అభ్యాసం చేయమన్నాడు ఆ పరమాత్మ. అనవసరమైన ఆలోచనల తేనెపట్టును ముట్టుకోకూడదు. అవసరం ఉన్నంతవరకే ఆలోచనలను సాగనివ్వాలి. మన ఆలోచనలు మనకీ, మనచుట్టూ ఉన్న సమాజానికి, మనం ఉన్న ప్రపంచానికి హితంగా ఉండాలి. అన్నింటినీ కలుపుకొని చేసిన ఆలోచనను అమలుపరచటం సులభం. ఎందుకంటే అందరి సుఖం అందులోనే ఉంటుంది కాబట్టి.

మామూలుగా, మన ఆలోచనలన్నీ జరిగినవి, జరగబోయేవి- వీటిని గురించే సాగుతూ ఉంటాయి. జరిగిపోయింది తిరిగి రాదు. జరగబోయేది ఏమిటో మనకు తెలీదు.ఈ రెండూ మనచేతిలో లేవు కాబట్టి. ఏది ప్రస్తుతమో, ఏది ప్రకృతమో దాన్నిగురించి ఆలోచించటంవల్ల మనసు బరువు బాగా తగ్గుతుంది. ఇది రెండో సూత్రం. ముచ్చటైన మూడో సూత్రం- ఆలోచనను మొగ్గలోనే అణచివేయటం. ఒక వస్తువు కనిపించగానే మనసుపడే తత్వం మనసుకు సొంతం. అలా మారిపోవటం దానికి అలవాటు. కారణం- అది రెక్కలు టపటపలాడిస్తూ అనంతంలో విహరించే విహంగం కావటమే. ఈ ప్రతిపక్షభావనవల్ల, రెక్కల గుర్రం రౌతు అధీనంలోనే ఎగురుతూ ఉంటుంది. ఇది వైరాగ్య భావనకు ఇతోధికంగా దోహదంచేస్తుంది. మాయలమారి మనసు మహోపకారిగా మారుతుంది.                                                               - ఉప్పు రాఘవేంద్రరావు 

No comments:

Post a Comment