ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Sunday 11 August 2013

ఆత్మసౌందర్యం


న దేహాన్ని శుచిగా, అందంగా ఉంచుకోవటమే చాలదు. మన అంతరంగ సౌందర్యాన్ని పెంచుకోవటం ప్రధానం. నిష్కళంకమైన ఆచరణ, సచ్ఛీలం, మధురభాషణం మనం అలవరచుకోవాలి. అప్పుడే మనం నిజమైన సౌందర్యాన్ని సంతరించుకోగలం. అటువంటి సౌందర్యానికి వేషభూషణాలు అనవసరం. బుద్ధ, మహావీర, ఏసుక్రీస్తు మొదలైనవారి జీవిత చరిత్రల అధ్యయనం ద్వారా వారి వ్యక్తిత్వ సౌందర్యం, స్వభావం స్పష్టంగా అర్థమవుతుంది. సౌందర్యాన్ని విభిన్న రూపాలలో చూడగలం.

హృదయ సౌందర్యం: 
ఇక్కడ హృదయం అంటే మన శరీర ప్రక్రియలకు మూలమైన హృదయం (గుండె) కాదు. భావనాత్మక హృదయం ప్రధానం. ప్రేమ, దయ, వాత్సల్యం, నిస్వార్థ చింతన, భక్తి, గౌరవం మొదలైనవి. భౌతిక సంపద కంటే గొప్పది హృదయ సౌందర్యం.


మనస్సౌందర్యం: 
మనసు మనకు కనిపించదు. అది చాలా శక్తిమంతమైనది. మనసు కలవాడే మనిషి. మనసు మర్మమెరిగిన ఘనుడికి మొక్కుతానన్నారు నాదయోగి త్యాగరాజస్వామి. మనిషిని దేవుడి గానో, దానవుడిగానో రూపొందించేది మనసే. మనసును నియంత్రించటం అందరికీ సాధ్యం కాదు. సచ్ఛింతన, సత్సాంగత్యం, సదాచారం, సాత్వికాహార సేవనం తదితరాలతో మానసిక సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. ఆశలకు, ఆకాంక్షలకు అడ్డుగోడలు వేయటం సాధన చేయాలి.


నేత్ర సౌందర్యం: 
మహాత్ములను దర్శించినప్పుడు వారి నేత్రాల్లో కరుణ, విశ్వప్రేమ, వాత్సల్యం, చిప్పిల్లుతుంటాయి. శంకరభగవత్పాదులు జగన్మాత సౌందర్యాన్ని వర్ణిస్తూ, 'అమ్మా నవ్వులన్‌ గను కనుల్‌ సారించు నాపై గృపన్‌' అని ప్రస్తుతించారు. ఆ స్తోత్రమే, సౌందర్యలహరిగా ప్రశస్తినందుకొంది. వైష్ణవుడైన ధనుర్దాసు, తన అర్ధాంగి నేత్ర సౌందర్యం పట్ల ఆకర్షితుడై, నిరంతరం ఆమెను అనుసరిస్తుండేవాడు. భగవద్రామానుజులు ధనుర్దాసుకు, శ్రీరంగనాథస్వామి దర్శనం చేయించారు. స్వామి నేత్రాల దివ్య సౌందర్యాన్ని తిలకించిన ధనుర్దాసు, శ్రీరంగనాథస్వామి దాసుడయ్యాడు.


మాటల్లో సౌందర్యం: 
మన ఆలోచనల ప్రకటనకు ప్రధానమైన సాధనం మన మాట. మాట మధురంగా లేనప్పటికీ మృదువుగా ఉండాలి. శ్రీరామలక్ష్మణులు, సీతను అన్వేషిస్తూ కిష్కింధ పర్వతం వద్దకు వెళ్ళారు. వానర రాజైన సుగ్రీవుడు, మిత్రుడైన ఆంజనేయుని పంపి, వారి రాకకు కారణం కనుగొనమన్నాడు. ఆంజనేయుడు వారిని చూసి, వారిరాకకు కారణమేమని ప్రశ్నించాడు. ఆంజనేయుడి మాట తీరును విన్న రాముడు ముగ్ధుడయ్యాడు. అతడి మాటలు సంస్కార సంపన్నమైనవి. మంగళకరమైనవే కాక, హృదయాన్ని స్వాధీనపరచుకోగలిగినవి అన్నాడు. మాటల్లో ధ్వనించే స్నేహ భావం, ప్రశాంతత, నిత్యజీవితంలో మాధుర్యానికి చక్కటి సూత్రాలు. మృదువైన పద ప్రయోగాల వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయి.

ఆత్మస్త్థెర్యం: మనం ఎల్లవేళలా ధైర్యంగా ఉండాలి. 'అభీః' అన్నది వేదం. ధైర్యాన్ని శరీరబలంతో సాధించలేం. ధైర్యం అంటే ఆత్మబలం, ఆత్మవిశ్వాసం. ఆత్మస్త్థెర్యం కలిగిన వ్యక్తిముందు ఎక్కుపెట్టిన తుపాకులైనా తలవంచుతాయి. ఆత్మస్త్థెర్యం నాయకుడి మొదటి గుణం. మహాత్మాగాంధీ అపారమైన ఆయుధ శక్తిగల బ్రిటిష్‌ సామ్రాజ్యాన్నే తన ముందు మోకరిల్లజేశాడు. స్వామి వివేకానంద అభిమానులు, మిత్రులు కలిగించిన ఉత్సాహంతో ప్రపంచ మత మహాసభలో అనర్గళంగా ఉపన్యసించాడు. భారతీయ సంస్కృతికి సంకేతమైన వసుధైక కుటుంబం అంటే ఏమిటో విశ్లేషించి ప్రస్తుతులందుకొన్నాడు.

బౌద్ధిక సంపద లేనప్పుడు సౌందర్యం ఏ మాత్రం రాణించదు. విశ్వసుందరీమణుల ఎంపికలో వారి దైహిక సౌందర్యంకంటే బుద్ధిశక్తికి ప్రాధాన్యమిస్తారు. బౌద్ధిక శక్తి పెంచుకోవడానికి ఏకాగ్రత కావాలి. శరీరం దృఢంగా ఉండాలి.

మనం చేసే ప్రతి పనిలోనూ దీక్ష దక్షత ఉన్నప్పుడు మన వ్యక్తిత్వ సౌందర్యం ఇనుమడిస్తుంది. ప్రతి పనినీ పూర్తిచేసిన తరవాత ఆత్మావలోకనం చేసుకోవాలి. ఈ రీతిగా మనం వ్యవహరించినప్పుడు- మర్త్యలోకం స్వర్గలోకం కాగలదు.
                                             - డాక్టర్‌ జానమద్ది హనుమచ్ఛాస్త్రి

No comments:

Post a Comment