ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Friday 21 June 2013

ఒక మనిషి-మూడు స్థితులు


 
   లో
కంలో ప్రతి మనిషీ మూడు స్థితుల్లో సంచరిస్తూ ఉంటాడు. ఈ స్థితులను అవస్థలు అనీ అంటారు. మనిషి మేల్కొని ఉంటాడు. ఇది జాగ్రదవస్థ. కలలు కంటూ ఉంటాడు. ఇది స్వప్నావస్థ. గాఢనిద్రలో ఉండే స్థితి సుషుప్త్యావస్థ.

గార్గ్యుడు జ్ఞానాన్వేషణకు బయలుదేరాడు. అతడిలాగానే మరో అయిదుగురూ అదే పనిమీద బయలుదేరారు. ఈ ఆరుగురూ పిప్పలాద మహర్షి గురించి విని ఆయనను కలుసుకున్నారు. వారి వారి ప్రశ్నలకు పిప్పలాదుడు సమాధానాలు ఇచ్చాడు. గురువు సమీపంలో శిష్యుడు ఉండి జ్ఞానాన్ని పొందడం- ఉపనిషత్తు. మాండ్యూకోపనిషత్తులో చర్చించిన జాగ్రద, స్వప్న, సుషుప్తి అవస్థలను మరింతగా విచారణ చేసేది ప్రశ్నోపనిషత్తు. అందువల్ల దీన్నే మాండ్యూకోపనిషత్తు సహ ఉపనిషద అని కూడా భావిస్తారు.

మనిషిలో ఏవి నిద్రిస్తున్నాయి, ఏవి మేల్కొంటున్నాయి, ఎవరు సుఖాన్ని అనుభవిస్తున్నారు, అన్నీ దేనిలో లయమవుతున్నాయి మొదలైన ప్రశ్నలు గార్గ్యుడు అడిగాడు. దానికి పిప్పలాద మహర్షి ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చాడు.

మనం మేల్కొని ఉన్నప్పుడు ఇంద్రియాలు పనిచేస్తుంటాయి. అవి బాహ్య ప్రపంచంతో సంబంధం కలిగి ఉండి అనుభవాలు సంపాదిస్తాయి. ఇది సూర్యోదయం తరవాత సూర్యకిరణాల వ్యాప్తి లాంటిది. సూర్యాస్తమయంలో కిరణాలు ఎలా లయించిపోతాయో అలాగే మనిషి నిద్రిస్తున్నప్పుడు అతడి ఇంద్రియాలన్నీ మనసులో లయించిపోతాయి. ఇంద్రియాలు పనిచేయకపోవడం వల్ల ఎలాంటి బాహ్య అనుభవమూ కలగదు.

నగరం రాత్రివేళ గాఢనిద్రలో ఉన్నా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటాయి. అదే రీతిలో శరీరం ఆదమరచి నిద్రిస్తున్నా ప్రాణశక్తులు మేల్కొని ఉంటాయి. పని చేస్తూ ఉంటాయి. అవి విశ్రమించవు. హృదయం, పేగులు, మూత్రపిండాలు వంటివి వాటి పనులు చేస్తుంటాయి. తిన్న ఆహారం జీర్ణమవుతూ ఉంటుంది. రక్తం పరిశుద్ధం కావడం వంటి పనులు నిద్రిస్తున్నప్పుడూ జరుగుతూనే ఉంటాయి.

మనసే దైవం. మనోశక్తికి హద్దులు లేవు. జాగ్రదావస్థలో చూసి అనుభవించినవన్నీ సుప్త చేతన మనసులో నమోదవుతాయి. కలలో మనసే ఇవి అన్నిటిగా అయిపోయి మళ్ళీ వాటిని అనుభవిస్తుంది. జాగ్రదవస్థలో మనం చూసినవి, విన్నవి కలలో సంభవించవచ్చు.

ప్రగాఢ నిద్రావస్థలో జాగ్రద, స్వప్నాలు లేవు. మేల్కొని ఉండకపోయినా, కలలు కనకపోయినా ఆ ప్రగాఢ నిద్రావస్థను మనం అనుభవిస్తాం. ఎందుకంటే నిద్రలేచిన తరవాత 'నిన్న బాగా నిద్రపోయాను. చాలా సుఖంగా ఉంది' అని చెబుతాం. సుషుప్త్యావస్థలోని లక్షణాలను మాండ్యూకోపనిషత్తు వివరిస్తుంది. ఈ స్థితిలో అనుభవాలు ఏమీ ఉండవు. కన్ను, చెవి వంటి మన ఇంద్రియాలు చేతన, మనసు, సుప్తచేతన అన్నీ విశ్రాంతిలో మునిగి ఉండటంతో అక్కడ బాహ్య జగత్తుకు సంబంధించిన అనుభవాలూ ఉండవు. నిద్రిస్తున్నప్పుడు మనసు, సుప్తచేతన లయించినప్పటికీ నేను అనే స్ఫురణ మేల్కొని ఉంటుంది. ఈ విధంగా నేను- స్ఫురణలో లయించిన మనసు బయటకు వస్తున్నప్పుడు మొదటి స్థితి కల ఇంకా బాహ్యస్థితిలోకి వస్తున్నప్పుడు జాగ్రదవస్థను అనుభవిస్తుంది. గాఢనిద్రలో ఉన్న ఒకే అనుభవం సుఖం. అందువల్లనే నిద్ర నుంచి లేవగానే 'నేను సుఖంగా నిద్రపోయాను' అని మనం చెప్పగలుగుతాం.

చూసేది, స్పర్శను పొందేది, వినేది, వాసన చూసేది, రుచి చూసేది, ఆలోచించేది, గ్రహించేది- వీటన్నింటికీ నేను స్ఫురణే ఆధారం. నిద్రావస్థను అనుభవిస్తున్న ఆ నేను- అమరమైన ఆత్మలో ప్రతిష్ఠితమై ఉంటుంది. శ్రేష్ఠమైన, వినాశన రహితమైన, రంగులేని, స్వచ్ఛమైన ఆత్మను ఎవరు అనుభూతితో గ్రహిస్తారో వారే ఆత్మను పొందగలుగుతారు. నేను అనే స్ఫురణ, ఇంద్రియాలు, పంచభూతాలు అన్నీ ఎక్కడ విలీనమవుతాయో ఆ ఆత్మను అనుభూతిలో గ్రహించినవాడే సర్వజ్ఞుడు.
                                               - డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు

No comments:

Post a Comment