ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Saturday 29 June 2013

సత్యాన్వేషణలో...


   లోకంలో చాలా ఘాతుకాలు జరుగుతుంటాయి. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తుంటాయి. ఇవన్నీ భగవంతుడు చేస్తున్నవేనా? వీటన్నింటికీ కారణం ఎవరు? చాలామంది భగవంతుడు నిర్దయుడు, ఇన్ని జరుగుతుంటే చూస్తూ ఉంటున్నాడు, జరగకుండా ఆపవచ్చు కదా అంటుంటారు. ఇదెలా సాధ్యం?
     కారు నడుపుతుంటే ప్రమాదం జరుగుతుంది. కారు నడిపేవాడు కారణమా, కారులో ఇంధనం కారణమా, కారే కారణమా, రహదారి కారణమా? అసలు ఆ ప్రయాణం సంకల్పించిన వ్యక్తి కారణమా, ఆ వ్యక్తికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు కారణమా, వాళ్లను కన్నవాళ్లు కారణమా? ఇలా వెదుక్కుంటూపోతే ఎన్నో కారణాలు కనిపిస్తాయి. చివరికి ఒక్క దగ్గరే అంతమవుతాయి. ఇది అంతర్జాలం లాగా ఒక మాయాజాలం.

అన్నింటికీ భగవంతుడు కారణం కాదు అని తెలుసుకునేంత వరకు ఈ సంఘటనలు మనల్ని బాధపెడుతూనే ఉంటాయి. కాని, శాస్త్రాలు సర్వానికీ కారణం భగవంతుడే అని చెబుతున్నాయి కదా. ఈ చిక్కుముడి వీడటం ఎలా?

కనిపించే ఈ ప్రపంచానికి కారణం భగవంతుడి సృజనాత్మక శక్తి. దానికి మరోపేరు మాయ. దీన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించి ప్రయత్నించి విజయం సాధించినవాళ్లు మౌనం వహిస్తారు. విఫలమైనవాళ్లు భగవంతుడే కారణం అంటూ బాధపడుతూ ఉంటారు.

ఏది ఏమైనా మన కళ్లముందు జరుగుతున్నదాన్ని మనం నమ్ముతాం. అది లేదు అంటే, ఆ అన్న వ్యక్తిని పిచ్చివాడికింద జమకడతాం. మన కన్నే మనకు ప్రమాణం. దాని వెనక బుద్ధి ఒకటి ఉందని మరచిపోతాం. దాని వెనక వివేకం ఒకటి ఉందని మరచిపోతాం. కనిపించనివి ఎన్నో మనం మన జ్ఞానంతో అంగీకరిస్తున్నాం.

ముందు మనం దైవాన్ని అంగీకరించాలి. చూసిగాని చూడకుండాగాని సత్యాన్ని నమ్మడానికి సిద్ధపడినప్పుడే విశ్వరహస్యాలు తెలుస్తాయి. విశ్వం నడిచే విధానం తెలుస్తుంది. ఏ వస్తువూ అన్ని కాలాల్లో ఒకేవిధంగా ఉండదు. మార్పు సహజం. మనల్ని మనం అంగీకరించినట్లే దైవం చేసే పనిని కూడా అంగీకరించాలి. సృష్టిలో చాలా లోపాలు కనిపిస్తాయి ప్రతి ఒక్కరికీ. పనిగట్టుకుని విమర్శించమని చెబితే, నేనైతే ఈ సృష్టిని ఇలా కాకుండా మరోలా తయారుచేద్దును అని ప్రతి ఒక్కరూ అంటారు!

దేవుణ్ని మార్చేయడానికి సిద్ధపడతారు కొందరు. దేవుడికి బోధ చెయ్యడానికి ఉద్యుక్తులవుతారు ఇంకొందరు. దేవుణ్ని పక్కనపెట్టి తామే దేవుళ్లం అంటారు మరికొందరు. మంచి ధర పలికితే దేవుణ్ని అమ్మేయడానికి ముందుకొస్తారు ఇంకొందరు. చివరికి దేవుణ్ని మాయం చేయడానికీ వెనకాడరు. మంచి జరిగినప్పుడు పొగిడి, చెడు జరిగినప్పుడు దేవుణ్ని తిట్టేవాళ్లను ఏమనాలి?

అన్ని శక్తుల్లోనూ అత్యంత గొప్పది ఇచ్ఛాశక్తి. అది స్వేచ్ఛాయుతంగా మనిషి వాడుకునే సంకల్పశక్తి. దీనితో అద్భుతాలు చెయ్యవచ్చు. ఇది జ్ఞానశక్తిగా క్రియాశక్తిగా మారుతుంది.

కల కను, నిజం చేసుకో అంటారు. కల కనాలి అంటే మనలో ఇచ్ఛాశక్తి పుష్కలంగా ఉండాలి. దీన్ని నడిపించేదే దైవశక్తి. మోక్షం వరకు తీసుకెళ్లేదీ ఇదే శక్తి. దీనిద్వారా నేనైనా నువ్వయినా చివరికి ఏ ప్రాణి అయినా తన ఆధ్యాత్మిక ప్రయాణంలో పురోగమనం సాధించడం తథ్యం.

దేవుణ్ని అర్థం చేసుకోవటం అంటే విశ్వాన్ని అర్థం చేసుకోవటమే. చెట్టును తెలుసుకుంటే అడవి తెలుస్తుంది. నది గురించి తెలుసుకుంటే సముద్రం తెలుస్తుంది. వెలుగు గురించి తెలుసుకుంటే సూర్యుడు తప్పక అర్థం అవుతాడు. శ్రద్ధ-సహనం ఉంటే జరుగుతున్న విపరీతాల వెనక సూత్రధారి ఎవరో తెలియకుండా పోతుందా?

మంచికి మంచే కారణం. చెడ్డకు తప్పనిసరిగా చెడే కారణం. తిరుగులేని ఈ అనివార్య సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని దైవాన్ని అర్థం చేసుకోవాలి. ఏది ఎవరు చేస్తున్నారో, ఎవరివల్ల జరుగుతున్నదో, ఎందుకు జరుగుతున్నదో తెలుసుకోవడానికైనా మన విమర్శలను మాని సత్యాన్వేషణ మొదలు పెట్టాలి. అప్పుడు ఎవరు దోషులో ఎవరు నిర్దోషులో తెలిసిపోతుంది!
- ఆనందసాయి స్వామి 

No comments:

Post a Comment