ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Sunday 13 October 2013

జయహో దుర్గామాతా!

    శక్తితో కూడుకున్నది- సృష్టి. బ్రహ్మాండం, ప్రపంచం, దేశం, సమాజం, కుటుంబం, వ్యక్తి- ఇలా దేన్ని తీసుకున్నా శక్తితో నడుస్తున్నదే. శక్తి లేనిదే చలనం ఉండదు. అందుకే 'సర్వం శక్తిమయం జగత్‌' అన్నారు. బ్రహ్మకు సృష్టి చేసే శక్తి, విష్ణువుకు వృద్ధిచేసే శక్తి, శివుడికి లయం చేసుకునే శక్తి- ఈ శక్తులన్నీ ఓ మహాశక్తి నుంచి ప్రసాదితమైనవే. ఆ మహాశక్తే ఆది పరాశక్తి. యోగనిద్రారూపిణియైన మహామాయ!
ఆశ్వయుజం అమ్మలమాసం, దేవీనవరాత్రుల పేరిట పలు రూపాల్లో ఆ ఆదిపరాశక్తిని ఆరాధించే పర్వదినాల మాసం. అమ్మ అనే పదానికి అర్థం సర్వజీవుల్నీ వశపరచుకుని, అనేకానేక సుఖసంపదలనీ, శాంతినీ ప్రసాదించేదని వ్యాఖ్యానిస్తున్నారు విజ్ఞులు. బ్రహ్మవైవర్త పురాణం అమ్మను ప్రకృతి అంటున్నది. ప్రకృతి అనే పదానికి ఉన్నతురాలైన దేవి అనే అర్థముంది.

ఈ దేవీ నవరాత్రుల్లో పరాదేవత, సకలజగత్కల్యాణదాయిని ఎనిమిదో రోజున 'దుర్గాదేవి'గా అలంకృతయై భక్తులకు దర్శనమిస్తున్నది. మనలో నిద్రాణమై ఉన్న శక్తులను జాగృతం చేసుకుని, భవ్యనవ్య మార్గాన్ని సుగమం చేసుకుని, జీవిత సార్థక్యానికి ఉపక్రమించడమే దుర్గారాధనలోని ప్రధాన లక్ష్యం. ఎనిమిదో రోజున దుర్గ దర్శనం కనుక ఈ పర్వడిని దుర్గాష్టమి అంటున్నాం.

'దుర్గే దుర్గతి నాశని' అంటారు. మన సకల దుర్గతుల్ని నాశనం చేసి, మనకు సద్గతుల్ని కలిగించేది 'దుర్గా' అని అర్థం. 'దు' అంటే దారిద్య్రం, దుఃఖం, దుర్భిక్షం, దుర్వ్యసనం మొదలైన దుర్వికారాలు; 'గ'కారానికి అర్థం శమింపజేయడం, నివారించడం. 'దుర్గా' అనే పదంలోని 'అ'కారానికి అర్థం అన్యాయం, అధర్మం, అలసత్వం, అసుర ప్రవృత్తి, అవాంఛనీయం. కనుక 'దుర్గా'దేవి సకల అనర్థాలనీ నివారించి, శాంతి, సౌఖ్యాలను లోకాలకు ప్రసాదించే తల్లి అని అర్థం. సమస్త దేవతల ప్రాణశక్తి నుంచి ఉద్భవించిందీ మాత. అందుకే ఆమెను అష్టలక్ష్మీ స్వరూపిణి, 'త్రిగుణాతీత' అన్నారు. ఆదిశక్తి దుర్గ యోగమాయ రూపంలోనే కాక- గ్రామాల్లో పోలేరమ్మ, అంకమ్మ, గంగమ్మ, పెద్దమ్మ, ముత్యాలమ్మ, మారెమ్మ, మైసమ్మ తదితర నామాలతో పూజలందుకుంటోంది. అజ్ఞాతవాసం ఆరంభంలో పాండవులు, కురుక్షేత్ర సంగ్రామానికి ముందు అర్జునుడు, రావణసంహారానికి బయలుదేరినప్పుడు శ్రీరాముడు దుర్గను పూజించారంటారు

'దుర్గముడు' అనే రాక్షసుడు బలగర్వితుడై, సకల లోకవాసులను హింసిస్తుంటే, వెళ్లి వాణ్ని వధించి లోకాలను కాపాడిన తల్లిని దుర్గామాతగా స్తుతిస్తున్నారు. దుర్గామాత, ఎనిమిదో రోజున రుద్రశక్తిగా సింహకాసురుణ్ని వధించినట్టు పురాణ కథనం ఉంది. అనుష్ఠానం, నవగ్రహ జపాలు, యాగాలు, చండీపారాయణం, హోమం, బలులతో ఈ నవరాత్రుల వైభవం వర్ణనాతీతం.

'దుర్గ'నామాన్ని జపించినంత మాత్రాన సకల దుఃఖాలు, ఆపదలు తొలగిపోతాయంటారు. శుంభ, నిశుంభ, మహిషాదుల వంటి వేలాది రక్కసుల సంహరించి లోకాలకు విముక్తిని ప్రసాదించిన భగవతి ఆమె. అష్టమినాడు అలంకరించే ఈ దేవి పేరుతోనే 'దుర్గాష్టమి' ఏర్పడింది. 'మాతంగి' అనే పేరుతో జగన్మాత అంటరానితనాన్ని నిర్మూలించేందుకు పూనుకొందని, వాగ్దేవిగా మధురమైన వాక్కులిచ్చి ప్రశంసలందుకుందని చెబుతారు. ఆకాశంలో ఉండి ఏకపదిగా, అంతరిక్షంతో కూడి ఉండి ద్విపదగా, నాలుగు దిక్కులా వ్యాపించి చతుష్పదిగా, ఎనిమిది దిక్కులా వ్యాపించి అష్టపదిగా, వూర్ధ్వ-అధోదిశలూ కలిపి దశపదిగా, శబ్దబ్రహ్మమయిగా భాసిల్లుతున్న సహస్రాక్షరి విజయవాడ ఇంద్రకీలాద్రిపైన, కృష్ణవేణి నదీతీరాన స్వయంభువై వెలసి భక్తకోటి నీరాజనాలు అందుకుంటోంది. దుర్గాదేవిని ఎనిమిదో రోజున ఎర్రని వస్త్రాలు ధరించి, ఎర్రని పూలతో పూజించి, నివేదనగా వడపప్పు, పానకం, పులిహోర, గారెలు, గుమ్మడికాయ సమర్పిస్తారు. ఎర్రని ఫలాలను కూడా ఈ మహాష్టమి పర్వదినాన అమ్మవారికి సమర్పిస్తారు. శాక్తేయులు, మధ్వలు, వైష్ణవులు, వీరశైవులు తదితర విభిన్న మత సంప్రదాయవాదులకే కాక- కోయలు, గిరిజనులు వంటివారెందరికో అమ్మ ఆరాధ్య దేవత! ఆటవికులు దుర్గను పూజించిన ఘట్టాన్ని హరివంశ పురాణం వర్ణించింది. భక్తుడికి భక్తిశ్రద్ధలు ఉంటేచాలు, దుర్గకృప అవశ్యం లభించి తీరుతుందంటారు. ఈ దుర్గాష్టమీ పుణ్యదినాన దేవిని మనసారా స్మరించి తరిద్దాం!
                                                                  - చిమ్మపూడి శ్రీరామమూర్తి

No comments:

Post a Comment