ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Sunday 6 October 2013

వైకుంఠ బ్రహ్మోత్సవాలు


  వేంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు తిరుమలలో నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. కలియుగ దైవం మాడ వీధుల్లో వివిధ రూపాల్లో తొమ్మిది రోజులు వూరేగనున్నాడు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి హస్త నక్షత్రంలో ప్రారంభమవుతున్న బ్రహ్మోత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదిస్తాయి. ఈ క్షేత్రంలోని మూర్తిలో సాక్షాత్తు విష్ణు అంశ నిండి ఉందని అంటారు. దైవానికి ఆది అంతం లేనట్లే ఈ మూర్తి సైతం ఆద్యంత రహితమే! గర్భగుడిలోని దైవాంశ మాడ వీధుల్లో వూరేగడమన్నది ఒక అద్భుతం. భక్తుల కళ్లముందు స్వామి వూరేగుతూంటే వీక్షకులు తమ విన్నపాలను ప్రత్యక్షంగా విన్నవించుకొంటారు. 'విన్నపాలు వినవలె వింత వింతలు పన్నగపు దోమతెర పైకెత్తవేమయా' అంటూ అన్నమయ వేంకటేశ్వరుడికి సూచించాడు. పూర్వం చక్రవర్తులు రాజులు సైతం రాజోత్సవాల సందర్భంగా రాజ వీధుల్లో వూరేగి ప్రజలకు దర్శనమిచ్చేవారట. పాలితుల కష్ట నష్టాలను గమనించేందుకు రాజులు ఈ అవకాశాన్ని వినియోగించుకునేవారు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సైతం ప్రతి పునర్వసు నక్షత్రం రోజు అయోధ్యానగరంలో సీతమ్మతో సహా వూరేగేవాడని మొల్ల రామాయణం చెబుతోంది. గర్భగుడిలో కనురెప్ప పాటులో జరిగే దర్శనానికన్నా దైవాన్ని వూరేగుతూంటే చూడటమన్నది ఒక మహత్తర అనుభూతి.

తిరుమలలో తొలి బ్రహ్మోత్సవం సాక్షాత్తు విరించి నిర్వహించాడని బ్రహ్మపురాణం వెల్లడిస్తోంది. తలచినంత మాత్రాన కలియుగంలో ప్రజలను స్వామి సంరక్షిస్తున్నందుకు సంతసించి పుష్కరిణీ తీరంలో బ్రహ్మ ఈ ఉత్సవాలను ప్రారంభించాడని అంటారు. తిరుమలలో తమిళ పంచాంగాన్ని అనుసరించడం ఆనవాయితీ. తమిళ పురాత్తసి మాసంలో బ్రహ్మోత్సవాలు జరుపుతారు. బ్రహ్మోత్సవాల తొమ్మిది రోజుల కాలంలో వేంకటేశ్వరుడు పులకాంకితుడై ఉంటాడని శ్రీ తిరుమల చరిత్ర చాటుతోంది. ఈ తొమ్మిది రోజులూ పరమాత్మ సంతుష్టుడై భక్తులు కోరినదెల్లా ఇస్తాడట. తిరుపతిలోని గోవిందరాజస్వామి తనకు సైతం ఒక పుష్కరిణి కావాలని అరవై సంవత్సరాల కాలం వేంకటేశుని వేడుకొన్నాడట. అయినా ఆ దైవం పుష్కరిణి ప్రసాదించలేదు. బ్రహ్మోత్సవాల సమయంలో గోవిందరాజస్వామి దేవదేవుని కార్యనిర్వహణలో తలమునకలై ఉండేవాడు. ఆ సమయంలో శ్రీవారిని పుష్కరిణి కోసం విన్నవించుకోలేకపోయాడు. ఒకసారి నారదుడు గోవిందరాజస్వామిని బ్రహ్మోత్సవాల సమయంలో పుష్కరిణి కోసం వేంకటేశ్వరుని వేడుకొమ్మని సూచించాడు. ఉత్సవం సమయంలో గోవిందరాజస్వామి ప్రార్థనను వెంటనే మన్నించి దిగువ తిరుపతిలో పుష్కరిణిని దైవం ప్రసాదించాడని బ్రహ్మపురాణం చెబుతోంది. ఈ బ్రహ్మోత్సవాల కాలంలో పరాత్పరుడు కోరిన కోర్కెలకు నెలవుగా నిలుస్తాడని ప్రతీతి.

బ్రహ్మోత్సవాల తొలిరోజు పూర్వ సాయంవేళ అంకురార్పణ జరుగుతుంది. నవధాన్యాలను పుష్కరిణిలో నుంచి పైకి తెచ్చిన మట్టిలో నాటడాన్ని అంకురార్పణ అంటారు. తొలిరోజు ధ్వజారోహణం చేస్తారు. గరుడ రూపాన్ని కలిగిన పతాకాన్ని ధ్వజ స్తంభంపైన ఎగురవేస్తారు. ఇక్కడి నుంచే గరుత్మంతుడు (గరుడాళ్వార్‌) దేవ లోకాలకు ఎగిరి బ్రహ్మోత్సవాలకు దేవతలనందరినీ ఆహ్వానిస్తాడన్నది నమ్మకం. ఈ తొమ్మిది రోజులూ వివిధ హోమాలు జరుగుతాయి. ఉత్సవ మూర్తులను వివిధ వాహనాలపై వూరేగిస్తారు. సింహ వాహనం, కల్పవృక్ష వాహనం, గరుడ వాహనం, సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనాల్లో వూరేగింపు, స్నపన తిరుమంజనం, చక్రస్నానం లాంటి సేవలు భక్తులను ఆనంద పారవశ్యానికి గురిచేస్తాయి.

శ్రేష్ఠమైన సర్పరాజు శేషుడు బ్రహ్మోత్సవాల తొలిరోజు రాత్రివేళ శేషవాహనంగా మారి వేంకటేశ్వరుని మాడ వీధుల్లో వూరేగించే సన్నివేశం చూసి తరించాల్సిన సేవ. శేషుడు తన స్వామికి శరణాగతుడై గరుత్మంతుని కాదని స్వామిని తనపై మోస్తాడట. శరణాగతితత్వం ఈ సన్నివేశంలో ప్రస్ఫుటమవుతుంది. ఈ తొమ్మిది రోజులూ త్రిమూర్తులు తమ తమ స్థానాలను విడచి తిరుమలలో నివాసం ఉంటారని నమ్ముతారు. ఈ సమయంలో తిరుమలలో ఉండటం వైకుంఠంలో నివసించడంలాంటిదేనని భక్తుల నమ్మకం. బ్రహ్మోత్సవాల చివరి రోజు స్వామి జన్మ నక్షత్రంలో అవభృత ఉత్సవం నిర్వహిస్తారు. అవభృత ఉత్సవం అంటే ఉత్సవ మూర్తులకు ప్రత్యేక అభిషేకం నిర్వహించడం! చక్రస్నానం తరవాత సుదర్శన చక్రాన్ని ఒక ఎత్త్తెన వేదిక పైన ఉంచి దానికింద నుంచి భక్తులు నడిచేలా ఏర్పాటు చేస్తారు. తిరుమలలోని దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలు భక్తులపాలిట వైకుంఠ సమారాధనలే.
- అప్పరుసు రమాకాంతరావు 

No comments:

Post a Comment