ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Sunday 27 October 2013

తలలు-తలపులు

   బ్రహ్మ చతుర్ముఖుడు. కుమారస్వామి షణ్ముఖుడు. పురాణ పురుషుల్లో ఇలా ఎక్కువ ముఖాలు కలిగినవారు ఇంకెందరో ఉన్నారు. రావణాసురుడికి పది తలలు. మనిషికి మాత్రం ఒక తలకాయే ఉంటుంది.

మనిషికి బయటకు ఒక ముఖం మాత్రమే కనిపిస్తున్నా, లోపల ఇంకో ముఖం దాగి ఉంటుంది. సందర్భాన్నిబట్టి ఆ ముఖం బయటకు వస్తుంది. ఈ రెండు తలలూ ఎప్పుడోగాని ఏకీభవించవు. అందువల్లే ఒక వ్యక్తిలో రెండు విరుద్ధ భావాలను చూడవచ్చు. ధర్మరాజు వంటి మహాత్ముడు 'అశ్వత్థామ హతః...' అని అరిచాడు. అర్జునుడంతటి వీరుడు కూడా, అస్త్రశస్త్రాలను అవతలపెట్టి నిస్పృహ చెందాడు.

కరుణాపయోనిధి వంటి దాశరథి వాలిని కూలనేశాడు. లోపల దాగిన తల్లే వేదాలు చదివిన దశకంఠుణ్ని సీతాపహరణానికి పురికొల్పింది. ప్రతిమనిషీ ఏదో ఒక సందర్భంలో మానసిక సంఘర్షణకు గురి అవుతాడు. ఒకే వ్యక్తిలో ఉన్న రెండు ముఖాలమధ్య వాదోపవాదాలు చోటుచేసుకుంటాయి. 'ఇలా చేద్దాం!' అంటుంది. ఒక ముఖం. 'వద్దు! అలాకాదు. ఇలా చేస్తే విజయం తథ్యం' అంటుంది రెండో ముఖం. చివరికి ఏదో ఒకదాని వాదం నెగ్గుతుంది. నెగ్గిన వైపే మొగ్గుతాడు మనిషి. ఓటమి సంభవించిందో... 'అప్పుడు వద్దువద్దని ఎంత చెప్పినప్పటికీ నీ వెధవ ముఖం ఒప్పుకొని చావలేదు. ఇప్పుడు అనుభవించు!' అని శాపనార్థాలు పెడుతుంది మంచి సలహా ముందుగా చెప్పిన ముఖం. ఓడిన ముఖం వాడిపోతుంది. దీంతో మానసిక వేదన!

బాధ్యతల నిర్వహణలో రెండు ముఖాలకూ 'ముఖాముఖి' ఘర్షణ తప్పదు. న్యాయమూర్తిగారి ఒక ముఖానికి తెలుస్తుంది బోనులో ఉన్నవాడు నేరస్థుడే అని. కానీ, సాక్ష్యాలు సరిగా లేకపోవడంవల్ల రెండోముఖం అతడు నిర్దోషి అని తీర్పు చెబుతుంది. ఒక తలకు వ్యతిరేకంగా ఇంకో తల తీర్పు! మన జీవితాల్లోనూ ఇటువంటి పరిస్థితులు ఎన్నో తారసపడతాయి. 'ఏ ముఖం పెట్టుకొని మళ్ళా వచ్చావు?'- ఇలాంటి మాటలూ తరచూ మన చెవిలో పడుతుంటాయి. అలాంటి మాటలు అంటే ఎవరి ముఖాలైనా చిన్నపోక తప్పదు.

ధన సంపాదన, నైతిక విలువలు- ఈ రెండూ మనిషికి అవసరమే. అవినీతి మార్గంలో ధన సంపాదన చేసేవాళ్లు నైతిక విలువలకు తిలోదకాలిస్తారు. అన్యాయంగా సంపాదించిన ఆ ధనాన్ని రక్షించుకునే ప్రయత్నంలో ఒక తలకు ఎప్పుడూ నొప్పి వస్తూ ఉంటుంది. పరిమితులు దాటి చేసే అవినీతి పనులవల్ల రెండో తలకు బొప్పి కడుతూ ఉంటుంది. ఇటువంటివాళ్లకు లోలోన ఏ ఘర్షణా ఉండదు. చివరకు మిగిలేది శిరోవేదన మాత్రమే! రెండు ఆలోచనల వరకు ఫరవాలేదు. అంతకంటే ఎక్కువైతే మాత్రం జీవితం గందరగోళమే!

ఒక యువకుడు దక్షిణ దిక్కుగా వడివడిగా నడుస్తున్నాడు. కొంత దూరం పోయి, ఒకచోట ఠక్కున ఆగాడు. ఒక్కక్షణం తలగోక్కొని, గిర్రున వెనక్కి తిరిగి ఉత్తర దిక్కుగా నడక ప్రారంభించాడు. ఒక పెద్దాయన ఈ యువకుని తతంగం అంతా చూస్తూన్నాడు. 'బాబూ! ఎక్కడికి వెళుతున్నావు?' అని అడిగాడు. 'ఒక ముఖ్యమైన పని మీద అవతలి వూరికి వెళుతున్నాను!' అన్నాడు యువకుడు.

'మరి వెనక్కి తిరిగావేం?'
'అక్కడ నా పని కాదేమో అనిపించింది!'
'మరి... బయలుదేరే ముందు బాగోగుల గురించి బాగా ఆలోచించుకో లేదా?'
'చాలాసార్లు నాలో నేను మథన పడ్డాను. చివరికి వెళితేనే బాగుంటుందని బయలుదేరా. కానీ, మధ్యలో అనుమానం వచ్చి వెనక్కి తిరిగా!'

'నాయనా! ప్రారంభించిన పనిని మధ్యలో ఆపేయడం పెద్ద తప్పు. ముందే బాగా ఆలోచించుకొని, ప్రణాళిక సిద్ధం చేసుకొని ప్రయాణం ప్రారంభించాలి. ప్రారంభించడం, ప్రారంభించక పోవడం- అనే రెండింటి గురించి మాత్రమే చర్చించుకొని, ఒకదాన్ని నిర్ణయించుకోవాలి. మూడో ఆలోచనని బుర్రలోకి రానీయకూడదు!'

'అలా అయితే రెండు రకాలెందుకు? ఒకే ఆలోచన చేస్తే ఇంకా మంచిది కదా?'
'మంచీ చెడూ ప్రతిదానికీ ఉంటాయి. ఈ రెంటిలో మనం మంచినే ఎంచుకోవాలి!' ఆ పెద్ద మనిషి హితబోధతో యువకుడు, తాను అనుకున్నది సాధించే వరకు మనసు మార్చుకోకూడదని నిశ్చయించుకొని మళ్ళా దక్షిణం వైపు తిరిగి పోయాడు! ఈ సలహా చెప్పిన పెద్దాయన చైనా తత్వవేత్త కన్‌ఫ్యూషియస్‌!
                                                            
                                                             - డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు

No comments:

Post a Comment